ఛావా ఎఫెక్ట్ : మొఘలుల నాటి కోట ధ్వంసం .. వందల మంది ఊరిపై పడి!
భారతదేశాన్ని ఎందరో చక్రవర్తులు, మహారాజులు, సుల్తానులు పరిపాలించారు. వారిలో ఛత్రపతి శివాజీ ప్రముఖమైన వ్యక్తి. మధ్యయుగ భారతదేశ చరిత్రలో ఆయన చెరగని ముద్ర వేశారు. మొఘల్ చక్రవర్తులను , ముస్లిం పాలకులను ఎదుర్కొంటూ ఆయన సువిశాల మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించారు. అలాగే హిందూ మతాన్ని పరిరక్షించిన వ్యక్తిగానూ శివాజీని చరిత్రకారులు చెబుతుంటారు. ఆయన మరణానంతరం శివాజీ కుమారుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ పరిపాలనా బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలో శంభాజీ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? మొఘలుల దాడుల నుంచి తన రాజ్యాన్ని ఎలా కాపాడుకున్నారు అనేది తెలియజేస్తూ నిర్మించిన ఛావా చిత్రం సంచలన విజయం అందుకుంది.
ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితంలోని ముఖ్య ఘటనల ఆధారంగా లక్ష్మణ్ ఉటేకర్ ఛావాను తెరకెక్కించారు. ఈ సినిమాలో శంభాజీగా విక్కీ కౌశల్, ఆయన సతీమణి మహారాణి ఏసుభాయిగా రష్మిక మందన్న నటించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరుకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. దాదాపు 600 కోట్లకు పైగా వసూళ్లతో భారతీయ చిత్ర పరిశ్రమలోని అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాల లిస్ట్లో ఈ సినిమా స్థానం సంపాదించింది. అలాగే లాంగ్ రన్లో ఖచ్చితంగా రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకుంటుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

అయితే థియేటర్లో ఈ సినిమాను చూస్తూ ప్రేక్షకులు భావోద్వేగానికి గురవుతున్నారు. చిన్నారులు, పెద్దలు కన్నీటితో బయటికి వస్తున్నారు. ఇక జై శివాజీ, జై శంభాజీ అంటూ నినాదాలతో థియేటర్లు దద్ధరిల్లుతున్నాయి. హిందీలో తెరకెక్కినప్పటికీ దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఛావాను నెత్తిన పెట్టుకుంటున్నారు. తెలుగు ప్రజల కోసం ఛావాను తెలుగులో రిలీజ్ చేసింది గీతా ఆర్ట్స్ సంస్థ. ఇక్కడా ఈ సినిమా ఘన విజయం సాధించింది. రెండ్రోజుల్లోనే ఏకంగా రూ.7 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది.
కాగా.. ఛావా సినిమాపై కొన్ని చోట్ల అభ్యంతరాలు సైతం వ్యక్తమవుతున్నాయి. చరిత్రను వక్రీకరించి ఛావాను తెరకెక్కించారని , మొఘల్ చక్రవర్తి ఔరంగజేబును అత్యంత క్రూరుడిగా చూపించారని ముస్లిం సంఘాలు మండిపడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లోనూ ఛావా రిలీజ్ను నిషేధించాల్సిందిగా ప్రభుత్వానికి వినతులు సైతం వచ్చాయి. అయితే విడుదల సాఫీగానే జరిగి, ప్రశాంతంగా సినిమా చూస్తున్నారు జనం. ఈ మధ్యకాలంలో జనంపై ఇంతటి ప్రభావం చూపిన సినిమా మరొకటి లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఛావా సినిమా ప్రభావం ప్రజలపై గట్టిగా ఉంది అనడానికి ఓ ఘటన జరిగింది. మధ్యప్రదేశ్లోని బుర్హన్పూర్లో ఉన్న అసిర్గఢ్ కోట వద్ద వందల మంది జనం తవ్వకాలు చేస్తూ కోటను నాశనం చేస్తున్నారు. అయితే దీనికి కారణాలు లేకపోలేదు.. ఛావాలో బుర్హన్పూర్ కోటలో బంగారు గనులున్నాయని ప్రస్తావించారు. అలాగే చరిత్రకారుల ప్రకారం మొఘలుల కాలంలో బుర్హాన్పూర్ ప్రాంతం సంప్ననమైనదిగా ఉండేదట. యుద్ధాలు జరిగిన సమయంలో ఈ ప్రాంత పాలకులు, ధనవంతులు, ప్రజలు తమ సంపదను శత్రువులకు దొరక్కుండా భూమిలో పాతిపెట్టేవారని చెబుతున్నారు.
సరిగ్గా ఇదే సమయంలో రహదారి నిర్మాణ పనుల్లో భాగంగా అధికారులు జేసీబీ సాయంతో తవ్వకాలు చేపట్టగా వచ్చిన మట్టిని కోటకు దగ్గరలో పారబోశారు. ఈ మట్టిలో కొందరు పురాతన నాణేలను గుర్తించగా.. అవి మొఘలుల కాలం నాటివిగా పుకార్లు వ్యాపించాయి. ఇంకేముంది రాత్రయితే చాలు బుర్హన్పూర్ కోటకు వందలాది మంది పలుగు, పారలు , టార్చ్లైట్లు , మెటల్ డిటెక్టర్లు తీసుకుని పరుగులు తీస్తున్నారు. కోటలో ఇష్టమొచ్చినట్లు తవ్వుతూ గుప్త నిధుల కోసం అన్వేషిస్తున్నారు. వీరి సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఉండటంతో అధికారులు తల పట్టుకుంటున్నారు. ఇలాంటి తవ్వకాల వల్ల కోటకు నష్టం వాటిల్లి, చారిత్రక సంపద కనుమరుగయ్యే అవకాశం ఉందని.. తక్షణం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చరిత్రకారులు సూచిస్తున్నారు.


Click it and Unblock the Notifications











