Ahmadabad Plane Crash: ఆహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం.. కన్నప్ప ఈవెంట్ రద్దు.. షాక్లో మంచు విష్ణు
దేశ పౌర విమానయాన చరిత్రలో దారుణమైన ఘోరం జరిగింది. ఆహ్మదాబాద్ నుంచి లండన్కు వెళ్తున్న విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే కుప్పకూలింది. ఆ దుర్ఘటన జరిగిన వెంటనే విమానం పేలిపోయి భారీ ఎత్తున మంటలు ఎగిసాయి. ఈ ఘోర ప్రమాదంలో చాలా మంది సజీవంగా దహనమయ్యారు. గుర్తు పట్టడానికి వీలు లేకుండా ప్రయాణీకులు కాలిపోయారు. ఈ దుర్ఘటన జరిగిన వెంటనే యుద్ధ ప్రాతిపాదికన సహాయ చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..
ఆహ్మదాబాద్ నుంచి లండన్కు బయలు దేరిన విమానంలో మొత్తం 242 మంది ఉన్నారు. వారిలో 230 మంది ప్రయాణికులు ఉండగా, ఇద్దరు పైలెట్లు, 10 మంది క్రూ సిబ్బంది ఉన్నారని ఎయిర్ ఇండియా వెల్లడించింది. ఈ ప్రయాణికుల్లో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ జాతీయులు, ఒకరు కెనడియన్, 7 గురు పోర్చుగల్కు చెందిన వారు అని తెలిపారు. ఇందులో పెద్దలు 217 మంది, 11 మంది పిల్లలు, ఇద్దరు పసిపిల్లలు ఉన్నారు. ఈ దుర్ఘటనలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని కూడా దుర్మరణం పాలయ్యారు.

బోయింగ్ విమానం కూలిపోయి సమీపంలోని బైరాంజీ జీజీభోయ్ మెడికల్ కాలేజీ (BJMC) విద్యార్థుల హాస్టల్లోని మెస్ను ఢీకొట్టింది . ఈ ఘటనలో సుమారుగా 20 మంది విద్యార్థులు మరణించారు అని సమాచారం. ప్రమాదం జరిగిన సమయంలో విద్యార్థులు మూకుమ్మడిగా భోజనం చేస్తున్నారు. ఆ కారణంగా మృతుల సంఖ్య భారీగా ఉంది. ఇంకా సంఖ్య పెరిగే అవకాశం ఉంది అని తెలిసింది.
ఆహ్మదాబాద్ విమానం ప్రమాదం నేపథ్యంలో తెలుగు సినీ హీరో విష్ణు మంచు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. విమాన ప్రమాదంలో మరణించిన వారికి ఆత్మశాంతి చేకూరాలని ప్రార్థించారు. వారి కుటుంబాలకు మనోధైర్యాన్ని కల్పించాలని భగవంతుడిని వేడుకొన్నారు. ఈ దుర్ఘటనపై తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో సంతాపం ప్రకటించారు.
ఆహ్మదాబాద్ విమాన ప్రమాదం నేపథ్యంలో సంతాపం ప్రకటిస్తూ.. శుక్రవారం (జూన్ 13వ తేదీ) రోజున మధ్యప్రదేశ్ ఇండోర్లో జరిగే కన్నప్ప ట్రైలర్ లాంఛ్ కార్యక్రమాన్ని రద్దు చేసుకొన్నారు. ఈ వేడుకలో అక్షయ్ కుమార్, ఇతర సినీ ప్రముఖులు పాల్గొనాల్సి ఉంది. ఈ దిగ్బ్రాంతికర క్షణాల మధ్య విచారం వ్యక్తం చేస్తూ తమ ప్రమోషనల్ కార్యక్రమాలను రద్దు చేసుకొన్నట్టు ప్రకటించారు.
మంచు విష్ణు తన ట్విట్టర్ ఖాతాలో ఓ మెసేజ్ పోస్ట్ చేస్తూ.. ఆహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురై చాలా మంది ప్రాణాలు కోల్పోయారనే వార్తతో నా హృదయం ముక్కలైంది. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం. ఈ విషాద సమయంలో ఇండోర్లో తలపెట్టిన కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ను రద్దు చేసుకొంటున్నాం. ఈ కష్ట సమయాల్లో బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం అని ఆయన పేర్కొన్నారు. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ తదితరులు నటించిన కన్నప్ప మూవీ జూన్ 27వ తేదీన గ్రాండ్గా రిలీజ్ కానున్నది.


Click it and Unblock the Notifications











