Devi Sri Prasad : చిన్నారి మృతి .. దేవిశ్రీప్రసాద్కు షాకిచ్చిన ఏపీ పోలీసులు, చిక్కుల్లో DSP
టాలీవుడ్లో ఈ జనరేషన్లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్లో ముందు వరుసలో వినిపించే పేరు దేవిశ్రీప్రసాద్. క్లాస్ అయినా , మాస్ అయినా, మెలోడీ అయినా వెస్ట్రన్ అయినా దుమ్మురేపుతాడు దేవి. ఇక ఐటెం సాంగ్స్కు దేవిశ్రీ ప్రసాద్ బ్రాండ్ అంబాసిడర్. ఈ తరంలో డీఎస్పీ చేసినన్నీ ఐటెం సాంగ్స్ మరే మ్యూజిక్ డైరెక్టర్ చేసి ఉండరు. చేసినా ఆ స్థాయిలో అలరించలేదని సినీ జనాలు చెబుతుంటారు. ఈ మధ్య కాస్త జోరు తగ్గించినప్పటికీ దేవిశ్రీప్రసాద్ సౌత్లో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్.
రైటర్ సత్యమూర్తి కుమారుడే దేవిశ్రీ ప్రసాద్. 1999లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కుమారుడు ఎస్పీ చరణ్తో కలిసి డ్యాన్స్ పార్టీ అనే ప్రైవేట్ ఆల్బమ్తో దేవి లైమ్ లైట్లోకి వచ్చాడు. 19 ఏళ్ల చిన్న వయసులోనే కంపోజర్గా ఘనత అందుకున్నారు. ఈ క్రమంలో కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన దేవి సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్గా కెరీర్ మొదలుపెట్టిన ఆయన తొలి సినిమానే తన ఇంటి పేరుగా మార్చుకున్నారు. ఆ తర్వాతి నుంచి దేవిశ్రీ ఇక వెనుదిరిగి చూసుకోలేదు.

దేవి, ఆనందం, కలుసుకోవాలని, ఖడ్గం, మన్మథుడు, వర్షం, వెంకీ, ఆర్య, శంకర్ దాదా ఎంబీబీఎస్, మాస్, నువ్వొస్తానంటే నేనద్దంటానా ఇలా వరుస బ్లాక్బస్టర్స్తో తిరుగులేని సంగీత దర్శకుడిగా నిలిచారు దేవి. సీనియర్, జూనియర్ ఇలా ఏ హీరోకైనా సరే దేవియే ఉండాలన్నంతగా క్రేజ్ సంపాదించుకున్నారు దేవిశ్రీప్రసాద్. ఇక క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్కైతే ఆస్థాన సంగీత దర్శకుడిగా మారిపోయారు. 2000 నుంచి 2010 మధ్యకాలంలో దేవిశ్రీ ప్రసాద్ తప్పించి మరో పేరు వినిపించేది కాదంటే అతిశయోక్తి కాదు. ఆ దశాబ్ధంలో ఏకంగా 50కి పైగా సినిమాలకు స్వరాలు సమకూర్చి రాక్స్టార్, డీఎస్పీగా ప్రేక్షకుల మన్ననలు పొందారు.
25 ఏళ్ల కెరీర్లో తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, హిందీ భాషల్లో దాదాపు 100కు పైగా సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు దేవిశ్రీప్రసాద్. ఇటీవల యువ సంగీత దర్శకుల రాకతో దేవిశ్రీ జోరు కాస్త తగ్గింది. గతేడాది పుష్ప 2తో దేశాన్ని ఊపేసిన దేవిశ్రీ ప్రసాద్ ఈ ఏడాది తండేల్తో ప్రేక్షకులను పలకరించారు. ప్రస్తుతం కుబేర, వృషభ, ఉస్తాత్ భగత్ సింగ్ చిత్రాలకు స్వరాలు అందిస్తున్నారు.
కెరీర్ పరంగా టాప్లో ఉన్నప్పటికీ సామాజిక సేవా కార్యక్రమాలలో దేవిశ్రీ ప్రసాద్ చురుగ్గా పాల్గొనేవారు. భారత్తో పాటు పలు దేశాలలో కచేరీలు నిర్వహించి తద్వారా వచ్చిన డబ్బును ఛారిటీలకు అందించేవాడు. ఈ క్రమంలోనే విశాఖలోని విశ్వానాథ స్పోర్ట్స్ క్లబ్లో ఓ మ్యూజికల్ కాన్సర్ట్ నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. అయితే ఈ ఈవెంట్కు విశాఖ నగర పోలీసులు అనుమతి నిరాకరించారు.
దీనికి కారణం లేకపోలేదు.. ఇటీవల విశ్వనాథ స్పోర్ట్స్ క్లబ్ వాటర్ వరల్డ్లో ఓ చిన్నారి ప్రమాదవశాత్తూ మునిగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన నేపథ్యంలో భద్రతా కారణాల రీత్యా అనుమతి ఇవ్వలేమని నగర పోలీస్ కమీషనర్ శంకబ్రత బాగ్చి తెలిపారు. అయితే దేవిశ్రీ ప్రసాద్ ఈవెంట్ టికెట్లను ఆన్లైన్లో పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. ఈ క్రమంలో పోలీసులు ఈ కాన్సర్ట్కు అనుమతి నిరాకరిచడంతో నిర్వాహకులు, టికెట్లు కొనుగోలు చేసిన వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











