What is Zero FIR? జీరో ఎఫ్ఐఆర్ అంటే ఏమిటి? జానీ మాస్టర్కు కలిసి వచ్చిన క్రిమినల్ యాక్ట్!
జాతీయ అవార్డు విజేత, ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై లైంగిక దాడి ఆరోపణలు చేస్తూ తన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ చేసిన ఫిర్యాదు వ్యవహారం సంచలనం రేపుతున్నది. ఆరేళ్లుగా ఆయనతో పనిచేస్తున్న ఆమె తనపై వేధింపులకు పాల్పడ్డారనే విషయంతో రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆమె చేసిన ఫిర్యాదు ఆధారంగా జీరో ఎఫ్ఐఆర్ (Zero FIR) కేసును దాఖలు చేశారు. ఆ కేసు వివరాల్లోకి వెళితే..
జానీ మాస్టర్కు సంబంధించిన కేసులో బాధితురాలు రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటారు. అలాగే జానీ మాస్టర్ నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్నారు. అయితే బాధితురాలు తన పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు చేయడంతో.. దానిని స్వీకరించి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ ఎఫ్ఐఆర్పై నంబర్ కేటాయించకుండా జీరో పేర్కొని.. దానిని సంబంధిత పొలీస్ స్టేషన్కు బదిలీ చేశారు.

అసలు జీరో ఎఫ్ఐఆర్ (Zero First Infromation Report) అంటే ఏమిటి?
ఎవరిపైనైనా ఎవరైనా వ్యక్తి ఫిర్యాదు చేయాలనుకొంటే.. తన పరిధికి సంబంధించని ఏదైనా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయవచ్చు. బాధితురాలి లేదా బాధితుడి ఫిర్యాదును స్వీకరించి దానిని సంబంధింత పోలీస్ స్టేషన్కు ట్రాన్స్ఫర్ చేసి.. అక్కడే దర్యాప్తు ప్రారంభిస్తారు.
జీరో ఎఫ్ఐఆర్ కాన్సెప్ట్ను క్రిమినల్ లా (సవరణ) చట్టం, 2013 ద్వారా అమలు చేస్తున్నారు. జస్టిస్ వర్మ కమిటీ నివేదిక ద్వారా ఈ నిబంధనను చట్టంలో ప్రవేశపెట్టారు. బాధితులు త్వరగా ఫిర్యాదు చేయడానికి వెసలుబాటు కల్పిస్తూ ఈ అవకాశం కల్పించారు. అయితే తమ పరిధిలో లేని ఫిర్యాదును స్వీకరించిన పోలీస్ అధికారులు.. ఎలాంటి కేసు నంబర్ వేయకుండా జీరో వేసి.. ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. అనంతరం సంబంధింత పోలీస్ స్టేషన్ అందజేస్తారు.

హత్య, అత్యాచారం, ఆలస్యం చేయరాని కేసులు లాంటి అత్యవసరంగా నమోదు చేయాల్సిన కేసు లేదా సమస్య తీవ్రత ఉన్న కేసులకు సంబంధించిన ఫిర్యాదులను తమ పరిధిలేకున్నా బాధితుల నుంచి అధికారులు స్వీకరించాల్సిందని చట్టం చెబుతుంది.బాధితులకు సమస్య ఎదురైనప్పుడు సత్వర పరిష్కారానికి, వేగంగా ఫిర్యాదు చేయడానికి సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేసే అవకాశం ఈ చట్టం కల్పిస్తున్నది.
అయితే జానీ మాస్టర్ కేసులో బాధితురాలు తాను నివసిస్తున్న పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు చేశారు. ఫిర్యాదు అందుకొన్న రాయదుర్గం పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి..దానిని జానీ మాస్టర్ నివసిస్తున్న నార్సింగి పోలీసులకు కేసు బదిలి చేశారు. అయితే ఎఫ్ఐఆర్ నమోదు అయి ఉంటే వెంటనే కేసు తీవ్రతను బట్టి వెంటనే రిమాండ్కు తరలిస్తారు. కానీ జీరో ఎఫ్ఐఆర్ నమోదైనందున బాధితురాలిని విచారించి. ఆమె వాగ్మూలం రికార్డు చేసి ఆ తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తారు. కేసు తీవ్రతను బట్టి జానీ మాస్టర్ను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఈ విషయంలో జానీ మాస్టర్కు కొంత సమయం కలిసి వచ్చింది అని లీగల్ నిపుణులు పేర్కొంటున్నారు.


Click it and Unblock the Notifications











