ఘోర విమాన ప్రమాదం నుంచి బయటపడ్డ చిరు, బాలయ్య... అసలు ఏం జరిగిందంటే?
గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన ఎయిరిండియా ఘోర విమాన ప్రమాదంతో దేశ ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ దుర్ఘటనలో 241 మంది ప్రయాణికులు, సిబ్బంది దుర్మరణం పాలయ్యారు. ఇదే విమానం వైద్య కళాశాల హాస్టల్పై పడటంతో 24 మంది వైద్య విద్యార్ధులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నారు. కేవలం ఒకే ఒక్కడు ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ విషాదం నేపథ్యంలో దేశాన్ని కుదిపేసిన విమాన, వైమానిక ప్రమాదాలు మరోసారి తెరపైకి వస్తున్నాయి. దేశ ప్రజలు ఇలాంటి ఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన తమ ఆత్మీయులను గుర్తుచేసుకుంటున్నారు.
విమాన ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన ప్రముఖులు
స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎన్నో విమాన, వైమానిక ప్రమాదాలు జరిగి వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో సామాన్యులతో పాటు ప్రముఖులు కూడా ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, సినీ నటి సౌందర్య, మాజీ లోక్సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి, మాజీ కేంద్ర మంత్రి మాధవరావ్ సింధియా, భారత త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ తదితరులు విమాన ప్రమాదాల్లోనే మరణించారు. ఇదే సమయంలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన దాదాపు 60 మందితో ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురైన ఘటన మరోసారి తెరపైకి వచ్చింది. నాటి ప్రమాదంలో చిరంజీవి, బాలకృష్ణ వంటి అగ్రనటులు కూడా ఉండగా.. వీరంతా తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు.

విమానంలో 60 మంది తెలుగు సినీ ప్రముఖులు
సరిగ్గా 32 ఏళ్ల క్రితం 1993 నవంబర్ 15న మద్రాస్ ఎయిర్పోర్ట్ నుంచి ఇండియన్ ఎయిర్లైన్స్ 440 ఎయిర్బస్ దాదాపు 272 మంది ప్రయాణీకులతో ఉదయం 6.20 గంటలకు హైదరాబాద్కు బయల్దేరింది. ఆ విమానంలో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, విజయశాంతి, అల్లు రామలింగయ్య దంపతులు, దర్శకులు కోడి రామకృష్ణ, ఎస్వీ కృష్ణారెడ్డి, ఉప్పలపాటి నారాయణరావు, బాపు, మాలాశ్రీ, కమెడియన్ సుధాకర్, పరుచూరి వెంకటేశ్వరరావు, ఎండీ సుందరం, కేసీ శేఖర్ బాబు, నరసింహారావు, కాట్రగడ్డ ప్రసాద్, సూపర్ సుబ్బరాయన్, సుచిత్ర, హరి అనుమోలు సహా దాదాపు 60 మందికి పైగా సినీ ప్రముఖులు, వారి కుటుంబ సభ్యులు ఉన్నారు.
రన్వేపై దట్టంగా పొగ మంచు
ఈ భారీ విమానాన్ని సీనియర్ పైలెట్ కెప్టెప్ భల్లా, కో పైలెట్ వేల్రాజ్ నడుపుతున్నారు. మొత్తం సినీ రంగానికి చెందిన వారే కావడం, పైగా పరిచయస్తులే కావడంతో విమానంలో వాతావరణం అంతా సందడిగా ఉంది. షెడ్యూల్ ప్రకారమే విమానం హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని ల్యాండింగ్ కోసం ఏటీసీ అనుమతి కోసం నిరీక్షిస్తోంది. అయితే అప్పటికి రన్వేపై దట్టమైన పొగమంచు ఉండటంతో తిరిగి మద్రాస్కు వెళ్తున్నట్లు ఎయిర్హోస్టెస్ ప్రయాణీకులకు సమాచారం అందించారు.
ఎమర్జెన్సీ ల్యాండింగ్కు యత్నం
విమానం తిరిగి మద్రాస్ వెళ్తుండగా ఎయిర్హోస్టెస్, ఇతర క్రూ సిబ్బందిలో కంగారు కనిపించింది. దీంతో చిరంజీవి తదితరులు ఏం జరుగుతోందని అడిగారు. ఆ కాసేపటికీ విమానం మద్రాస్ వెళ్లడం లేదని ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం ప్రయత్నిస్తున్నట్లుగా ప్రయాణీకుల్లో చాలా మందికి అర్ధమైంది. ఆ దెబ్బతో నిద్రలో ఉన్న వారికి మత్తు వదిలి .. అందరిలో భయాందోళనలు నెలకొన్నాయి. అయితే కెప్టెన్ భల్లా అత్యంత చాకచక్యంగా విమానాన్ని కంట్రోల్ చేస్తూ నెల్లూరు జిల్లా వెంకటగిరికి సమీపంలోని బాలాజీ పల్లె గ్రామంలోని పంట పొలాల్లో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.
తిరుపతి పొలాల్లో దిగిన విమానం
విమానం సురక్షితంగా ల్యాండ్ కాగా.. ఎయిర్హోస్టెస్, క్రూ సిబ్బందికి నటీనటులు సాయం చేసి అతి కష్టం మీద విమానం తలుపులు తెరిచారు. అనంతరం గ్రామస్తుల సహకారంతో ప్రయాణీకులంతా క్షేమంగా కిందకి దిగారు. నాడు పైలెట్ సమయస్పూర్తి, అదృష్టం తోడవ్వడంతో అంతా క్షేమంగా బయటపడ్డారు. లేదంటే కోట్లాది మంది ఆరాధించే తారలకు ఏమైనా అయి ఉంటే? అది ఊహించుకోవడానికే వెన్నులో వణుకు పుడుతుంది. నాటి ఘటనను గుర్తుచేసుకుంటూ చిరంజీవి సోదరుడు నాగబాబు ట్వీట్ చేశారు. చిరంజీవి, సుస్మిత ఆ విమానంలో ఉండటంతో వారి క్షేమ సమాచారంపై మేమంతా భయాందోళనకు గురైనట్లు తెలిపారు. అహ్మదాబాద్ విమాన ప్రమాద మృతులకు నాగబాబు సంతాపం తెలియజేశారు.


Click it and Unblock the Notifications











