Who is Daaku Maan Singh? 1100 దోపిడీలు, 185 హత్యలు ... NBK109 కథ అదేనా?
సినీ దర్శక నిర్మాతలు ఇటీవలి కాలంలో వాస్తవిక సంఘటనలు , బయోపిక్స్, రియల్ స్టోరీస్, పీరియాడికల్ డ్రామాలు వైపు చూస్తున్నారు. అఫ్కోర్స్ జనం కూడా వాటినే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. క్రైమ్ వరల్డ్లో డాన్లుగా వెలుగొందిన వారి జీవిత కథల ఆధారంగా తీసిన బొమ్మలకి బాగా గిరాకీ నెలకొంది. రెండ్రోజుల క్రితం మెగా హీరో వరుణ్ తేజ్ నటించి మట్కా సైతం ఇలాంటి ఓ నేరస్థుడి కథే.. తాజాగా గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఎన్బీకే 109 మూవీ కూడా నిజ జీవిత గాథగా ఫిలింనగర్ సర్కిల్స్లో ఓ గాసిప్ చక్కర్లు కొడుతోంది. ఈ వివరాల్లోకి వెళితే...
వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాల తర్వాత నందమూరి బాలకృష్ణ నటిస్తున్న మూవీ ఎన్బీకే 109. తాజాగా శుక్రవారం ఈ సినిమా టీజర్ అండ్ టైటిల్ను రివీల్ చేశారు. ఈ మూవీకి డాకు మహారాజ్గా టైటిల్ని ఖరారు చేశారు. గుర్రంపై ముసుగు వేసుకుని వస్తున్న గెటప్లో బాలయ్య అలరించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న డాకు మహారాజ్ను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లుగా చిత్ర యూనిట్ టీజర్లో తెలిపింది. అయితే బాలయ్య లుక్, గెటప్ టైటిల్ పేరు వైరల్ కావడంతో నెటిజన్లు అసలు ఇంతకీ డాకు మహారాజ్ ఎవరు అనే దానిపై నెట్టింట సెర్చ్ చేస్తున్నారు.

ఆన్లైన్లో వైరల్ అవుతున్న వార్తలను బట్టి ఇది మాన్ సింగ్ అలియాస్ డాకు మాన్ సింగ్ జీవిత కథగా తెలుస్తోంది. అఖండ భారతదేశాన్ని బ్రిటీష్ వాళ్లు పరిపాలిస్తున్న సమయంలో ఛంబల్, పంజాబ్ ప్రాంతాలను తన అడ్డాగా చేసుకుని ఆయన ఆంగ్లేయులకు ముచ్చెమటలు పట్టించారు. 1890లో మధ్యప్రదేశ్లోని ఖేరా రాథోడ్ గ్రామంలో జన్మించిన మాన్ సింగ్ రాజ్పుత్ తెగకు చెందిన వారు. దట్టమైన అటవీ, లోయలు, కొండలు, గుట్టలతో ప్రపంచానికి దూరంగా ఉన్నట్లుండే ఛంబల్ ప్రజలకు మాన్ సింగ్ ఆరాధ్య దైవమని అంటారు.
1939 నుంచి 1955 మధ్యకాలంలో నాటి తన దోపిడీలు, దాడులతో బ్రిటీష్ , స్వతంత్ర భారత ప్రభుత్వాలను గడగడలాడించారు మాన్ సింగ్. దాదాపు 1112 దోపిడీలు, 185 హత్యలు (ఇందులో 32 మంది పోలీస్ అధికారులే)తో ఆయన ఆ ప్రాంతంలో మారణహోమం సృష్టించారు. కేవలం 17 మంది ముఠాతోనే మాన్ సింగ్ ఇంతటి కల్లోలం రేపారని అంటారు. ఇందులో ఎక్కువ మంది ఆయన కుమారులు, సోదరుడు నవాబ్ సింగ్, మేనల్లుళ్లే.
మాన్సింగ్పై కిడ్నాప్, దోపిడీ, హత్య సహా దాదాపు 100కు పైగా కేసులు ఉన్నాయని అంచనా. దీంతో మోస్ట్ వాంటెడ్గా మారిన మాన్ సింగ్ తలపై ప్రభుత్వం భారీ రివార్డ్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో 1955లో మధ్యప్రదేశ్లోని కకేకపురా భింద్లో మర్రి చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్న మాన్ సింగ్ ఆయన కుమారుడు సుబేదార్ సింగ్ను గుర్ఖా రెజిమెంట్ దళాలు కాల్చి చంపాయి. ఈ ఆపరేషన్కు ఇన్స్పెక్టర్ వినోద్ చంద్ చతుర్వేది నాయకత్వం వహించారు.
అయితే ఆయన చెడ్డవాడు కాదని పరిస్ధితులే మాన్సింగ్ను అలా మార్చేశాయని ఛంబల్ ప్రజలు చెబుతుంటారు. ఉన్నవారిని దోచుకుని పేదలకు ఆ సంపదను పంచిపెట్టారని అంటారు. స్థానిక సమస్యలను పరిష్కరించడంతో పాటు ఆపదలో ఉన్న ఎంతోమందిని మాన్ సింగ్ ఆదుకున్నారని చెబుతారు. ఖేరా రాథోడ్లో ఏకంగా డాకు మాన్ సింగ్కు అక్కడి ప్రజలు నేటికీ పూజలు చేస్తుంటారు. బాలీవుడ్ అగ్ర కథానాయకుడు, బిగ్బీ అమితాబ్ బచ్చన్ సైతం పలు సందర్భాల్లో డాకు మాన్ సింగ్ గురించి ప్రస్తావించారు.
తన చిన్నతనంలో డాకు మాన్ సింగ్ పేరు చెప్పగానే భయపడేవాళ్లమని.. పోలీసుల నుంచి చాకచక్యంగా తప్పించుకోవడం, ఆయన ధైర్యసాహసాల గురించి కథలు కథలుగా చెప్పుకునేవారని అమితాబ్ తెలిపారు. మరి డాకు మాన్ సింగ్ జీవితాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని బాబీ ఈ కథను తెరకెక్కించాలని అనుకున్నారా? లేక ఆయన పేరును వాడుకున్నారా? అన్నది తెలియాలంటే జనవరి 12 వరకు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











