చిరంజీవి ఇంట్లో ఉపాసనకు సీమంతం.. కనిపించని అల్లు ఫ్యామిలీ, కారణం అదేనా?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల దీపావళి పండుగ నాడు మెగా అభిమానులకు గుడ్న్యూస్ చెప్పారు. ఆమె రెండోసారి తల్లి కాబోతున్నారు. దీపావళి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి నివాసంలో వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి అగ్రనటులు నాగార్జున, వెంకటేష్, నయనతారతో పాటు ఇతర సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. దాంతో అందరూ ఇవి పండుగ సంబరాలుగానే భావించారు. అయితే రెండ్రోజుల తర్వాత ఈ దీపావళికి డబుల్ బ్లెస్సింగ్స్, డబుల్ సెలబ్రేషన్స్ అంటూ చరణ్, ఉపాసన వేరు వేరుగా వీడియోలు పోస్ట్ చేయడంతో అసలు విషయం తెలిసింది.
ఉపాసన గుడ్ న్యూస్
ఈ వీడియోలో చిరంజీవి సతీమణి సురేఖతో పాటు ఇతర ముత్తయిదువలు ఉపాసనకు హారతి ఇస్తుండటం, ఆమెను ఆశీర్వదిస్తూ ఉండటం గమనించవచ్చు. దాంతో ఉపాసన గర్భం దాల్చారని అందరికీ అర్ధమైంది. రెండేళ్ల క్రితం ఉపాసన - రామ్ చరణ్ దంపతులకు ఆడబిడ్డ జన్మించిన సంగతి తెలిసిందే. ఆమెకు అమ్మవారి పేరు కలిసొచ్చేలా క్లీంకారా కొణిదెలగా నామకరణం చేశారు. ఈ చిన్నారి వచ్చిన వేలా విశేషంతో మెగా కుటుంబంలో అన్ని శుభకార్యాలే జరుగుతున్నాయి. తాజాగా చరణ్ - ఉపాసనలు గుడ్ న్యూస్ చెప్పడంతో మెగా ఫ్యామిలీలో సంబరాలు అంబరాన్ని తాకాయి.

కవలలకు జన్మనివ్వనున్న ఉపాసన
అలాగే పుట్టబోయేది ఆడబిడ్డా లేక మగబిడ్డా అంటూ అప్పుడే చర్చ కూడా మొదలైపోయింది. అయితే మెగా వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు రామ్ చరణ్కు ఒక కుమారుడు పుట్టాలని మెగాస్టార్ చిరంజీవి ఓ సందర్భంలో తన మనసులోని మాటను చెప్పిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో చరణ్ - ఉపాసనలు మరో సర్ప్రైజ్ ఇవ్వబోతున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఉపాసన కవలలకు జన్మనివ్వబోతున్నారన్నది ఆ వార్తల సారాంశం. ఈ విషయాన్ని ఉపాసన తల్లి శోభన కామినేని కన్ఫర్మ్ చేశారు. నేను, అనిల్ వచ్చే ఏడాది ఉపాసన - రామ్ చరణ్ల ట్విన్స్ పిల్లలకు గ్రాండ్ వెల్కమ్ చెప్పబోతున్నాం.. త్వరలోనే ఐదుగురు గ్రాండ్ చిల్డ్రన్స్కి గ్రాండ్ మదర్ కాబోతున్నానని శోభన పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కనిపించని అల్లు అరవింద్ కుటుంబం
అంతా బాగానే ఉంది కానీ.. ఈ సంబరాల్లో ఓ లోటు కనిపించింది. మెగాస్టార్ చిరంజీవి బావమరిది అల్లు అరవింద్ కుటుంబ సభ్యులు ఎక్కడా కనిపించకపోవడం టాలీవుడ్లో చర్చనీయాంశమైంది. అల్లు అరవింద్, ఆయన సతీమణి, అల్లు అర్జున్ - స్నేహ దంపతులు, అల్లు శిరీష్ ఇలా ఎవ్వరూ హాజరుకాలేదు. గతంలో మెగా - అల్లు కుటుంబాల మధ్య కొంత గ్యాప్ ఉన్నప్పటికీ తిరిగి రెండు ఫ్యామిలీలు ఒక్కటై.. తాము ఏకతాటిపైనే ఉన్నామని చాటిచెప్పారు. అలాంటిది చిరంజీవి కుటుంబంలో అత్యంత కీలకమైన కార్యక్రమానికి.. స్వయానా చరణ్ మేనమామ అయిన అల్లు అరవింద్ కుటుంబం హాజరుకాకపోవడం ఫిలింనగర్లో చర్చనీయాంశమైంది.
అందుకే అల్లు ఫ్యామిలీ దూరంగా?
అయితే ఇటీవలే అల్లు రామలింగయ్య సతీమణి, అల్లు అరవింద్ తల్లి కనకరత్నమ్మ కాలం చేశారు. దీంతో హిందూ సాంప్రదాయం ప్రకారం.. ఏడాది వరకు అల్లు అరవింద్ కుటుంబ సభ్యులు శుభకార్యక్రమాల్లో పాలు పంచుకోకూడదని.. అందుకే ఉపాసన సీమంతానికి అల్లు ఫ్యామిలీ దూరంగా ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. మరి అల్లు కుటుంబం చిరంజీవి ఇంటికి రాకపోవడానికి కారణం అదేనా? లేదంటే మరేదైనా కారణం ఉందా? అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











