మూడు నెలలు డిప్రెషన్లోనే.. చావు అంచుల వరకు స్టార్ కమెడియన్, ఆ డైరెక్టర్ వల్లే
తెలుగు వారు హాస్య ప్రియులు.. హాస్యం ఏ రూపంలో ఉన్న దానిని ఆస్వాదించడంలో ముందుంటారు. అందుకే ఏ ఇండస్ట్రీలోనూ లేని విధంగా తెలుగు చిత్ర పరిశ్రమలో పదుల సంఖ్యలో కమెడియన్లు ఉన్నారు. నాటి కస్తూరి శివరావ్ నుంచి నేటి వెన్నెల కిషోర్ వరకు ఎందరో హాస్యనటులు ప్రేక్షకులను నవ్విస్తున్నారు. వీరిలో బాబూమోహన్ కూడా ఒకరు. దాదాపు నాలుగు దశాబ్ధాల నట జీవితంలో వందలాది సినిమాలలో నటించి మెప్పించిన ఈ హాస్య నటుడి జీవితంలోనూ విషాదం ఉంది.
టాలీవుడ్లోని మిగిలిన కమెడియన్లతో పోలిస్తే బాబు మోహన్ది విలక్షణ శైలి. కామెడీ టైమింగ్, బాడీ లాంగ్వేజ్తో ఆయన గిలిగింతలు పెడుతారు. డ్రెస్సింగ్ స్టైల్ కూడా డిఫరెంట్గా ఉంటూ అక్కినేని నాగేశ్వరరావు వంటి దిగ్గజం చేత అందగాడా అనిపించుకున్నారు. టైమింగ్, డైలాగ్ డిక్షన్తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. ఇప్పటికీ తెరపై ఆయనను చూస్తే నవ్వు ఆపుకోవడం కష్టం. ఇక తెరపై బాబు మోహన్ - కోట శ్రీనివాసరావు కాంబినేషన్ కొన్నేళ్ల పాటు అప్రతిహతంగా సాగింది. హీరో ఎవరైనా, డైరెక్టర్ ఎవరైనా సరే వీరిద్దరి కాంబో ఉండాల్సిందే.

నిజానికి ఖమ్మం జిల్లాకు చెందిన బాబు మోహన్ చిన్న వయసులోనే కుటుంబ భారాన్ని తన భుజాలపై వేసుకున్నారు. కష్టపడి డిగ్రీ పూర్తి చేసిన ఆయన పౌర సరఫరాల శాఖలో ఉద్యోగం సంపాదించారు. కాలేజ్ రోజుల్లోనే ఆయనకు ఇందిర విజయలక్ష్మీతో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. దీంతో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అన్న నందమూరి తారక రామారావుకు వీరాభిమాని అయిన బాబూ మోహన్కు నాటకాలంటే పిచ్చి .. వివాహ తర్వాత కూడా నాటకాలు వేస్తూ ఉండటంతో ఆయన భార్యకు నచ్చేది కాదు. ఆమెకు దొరికిపోతే దాదాపు నెల రోజుల పాటు విజయలక్ష్మీ మాట్లాడేవారు కాదట.
ఓ రోజున హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఆయన వేసిన నాటకం చూసి నిర్మాత రాఘవ ఈ ప్రశ్నకు బదులేది సినిమాలో అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ఆహుతితో బాబు మోహన్ను టాలీవుడ్కు డిఫరెంట్గా పరిచయం చేశారు కోడి రామకృష్ణ. ఇందులో ఆయన పోషించిన క్యారెక్టర్కు పేరు రావడంతో కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా బాబు మోహన్ బిజీ అయ్యారు . అప్పట్లో బ్రహ్మానందం, కోటా శ్రీనివాసరావు, అలీ, మల్లిఖార్జునరావు వంటి సీనియర్లతో పోటి పడి మరి టాప్ కమెడియన్గా వెలుగొందారు బాబు మోహన్
సినిమాల్లో బిజీగా ఉన్నప్పుడే రాజకీయాల్లోకి దిగారు. తొలుత లక్ష్మీపార్వతి నేతృత్వంలోని ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ టికెట్పై అమలాపురం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే 1999 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ జిల్లా అంధోల్ నుంచి గెలిచి చంద్రబాబు నాయుడు కేబినెట్లో కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. 2014లో టీఆర్ఎస్లో చేరి మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. రాష్ట్ర విభజన తర్వాత ఆయన రాజకీయం పడుతూ లేస్తూ సాగుతోంది. సినిమాల్లోనూ బాబూ మోహన్కు అవకాశాలు తగ్గిపోయి ప్రస్తుతం ఖాళీగానే ఉంటున్నారు.
అయితే బాబు మోహన్ జీవితంలో కుమారుడి మరణం ఆయనను బాగా కృంగదీసింది. 2003 అక్టోబర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో పెద్ద కుమారుడు పవన్ కుమార్ దుర్మరణం చెందారు. దాంతో బాబూ మోహన్ కొన్నేళ్ల పాటు డిప్రెషన్లోకి వెళ్లిపోయారు. మూడు నెలల పాటు సినిమాలు చేయకుండా ఎవరితోనూ మాట్లాడకుండా ఇంటికే పరిమితమయ్యారు. ఈ క్రమంలో ఆత్మహత్య చేసుకుని చనిపోవాలని అనుకున్నారట. బాబూమోహన్ను ఇలాగే వదిలేస్తే మంచిది కాదని దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ వరుస అవకాశాలిచ్చి మామూలు మనిషిని చేశారు.


Click it and Unblock the Notifications











