Akhanda 2: హరిహర వీరమల్లు విషయంలో పవన్ కల్యాణ్ అలా.. అఖండ 2 రిలీజ్ విషయంలో బాలకృష్ణ ఇలా!
తెలుగు సినిమా పరిశ్రమలో అఖండ సినిమా రిలీజ్ వాయిదా పడటం భారీ చర్చకు దారి తీసింది. ఈ సినిమా రిలీజ్ ఆగిపోవడంపై రకరకాల చర్చలు, అనేక రకాల ఊహాగానాలు గత కొద్ది రోజులుగా సాగుతున్నాయి. భారీ సినిమాలు, అగ్ర నటుల చిత్రాల రిలీజ్కు ముందు ఫైనాన్స్ క్లియరెన్స్ కాకపోవడమనేది చాలా సహజంగానే జరుగుతుంటాయి. పవన్ కల్యాణ్ నటించిన హరిహరవీరమల్లు సినిమా విషయంలో ఇలాంటి సంక్షోభం నెలకొంటే.. స్వయంగా పవర్ స్టార్ రంగంలోకి దిగి.. తన రెమ్యురనేషన్ తగ్గించుకొని మూవీని రిలీజ్ చేశారు. అయితే అఖండ 2 విషయంలో బాలయ్య, బోయపాటి ఎందుకు ఇలా రిస్క్ చేయలేదనే విషయంపై ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. ఆ విషయంలోకి వెళితే..
హరిహర వీరమల్లు సినిమా రిలీజ్కు ఫైనాన్స్ పరమైన సమస్యలు వచ్చాయనేది అందరికి తెలిసిందే. అయితే ఆ సినిమా 5 ఏళ్లుగా షూటింగ్ ఆలస్యం కావడం, దాంతో నిర్మాత ఆర్థిక సమస్యల్లో కూరుకుపోవడం జరిగింది. ఆ తప్పును సరిదిద్దేందుకు పవన్ కల్యాణ్ ముందుకు వచ్చాడు. అలాగే నిర్మాత ఏఎం రత్నంకు పవర్ స్టార్కు మంచి రిలేషన్ ఉంది. గతంలో వారిద్దరి కాంబినేషన్లో భారీ హిట్స్ కూడా ఇచ్చారు. ఆ అభిమానం, మానవతా దృక్పథంతో నిర్మాతకు ఇబ్బందులు రావొద్దని రిస్క్ తీసుకొని సినిమాను రిలీజ్ చేసిన మాట వాస్తవమే అని నట్టి కుమార్ అన్నారు.

సినిమా రిలీజ్ విషయంలో పెద్ద మనషులతో కలిసి హీరో గానీ, డైరెక్టర్ గానీ చర్చించి నిర్ణయం తీసుకొంటారు. కానీ వారినే డబ్బు పెట్టి రిలీజ్ చేయాలని డిమాండ్ చేయకూడదు. సినిమా రిలీజ్ ఆగిపోతుందనుకొంటే పవన్ కల్యాణ్ తీసుకొనే నిర్ణయం ఒకలా ఉంటుంది. బాలకృష్ణ తీసుకొనే నిర్ణయం మరోలా ఉంటుంది. ఎవరి ఇష్టం వారిది. మనం డబ్బు పెట్టి రిలీజ్ చేయాలని ఒత్తిడి చేయడానికి మనం ఎవరం? సినిమాను ఆర్థిక పరమైన కష్టాల నుంచి గట్టెక్కించడానికి బాలయ్య, బోయపాటి తమ రెమ్యునరేషన్ నుంచి కొంత తగ్గించుకొన్నారని బయట చెప్పుకొంటున్నారు. వారు పారితోషికం వదులుకొన్న తర్వాత కూడా ఫైనాన్స్ లెక్కలు తేలలేదని విషయంపై చర్చ జరుగుతుంది. ఆ విషయంలో ఏం జరిగిందనే విషయంపై ఎవరికీ క్లారిటీ లేదు అని నట్టి కుమార్ అన్నారు.
అయితే ఏపీలో ప్రభుత్వం వారి చేతుల్లోనే ఉంది. బాలయ్య బావగారు సీఎం, అల్లుడు మంత్రి, మరో అల్లుడు ఎంపీ, స్వయాన బాలకృష్ణ ఎమ్మెల్యే. అయితే ఓ మాట చెబితే సినిమా రిలీజ్ జరిగిపోయేది. ఆ విషయంలో కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది. దాని వల్లే సినిమా రిలీజ్ ఆగిపోయింది. వారు తలచుకొంటే ఈ సమస్య వచ్చి ఉండేదే కాదు. ఏది ఏమైనా రిలీజ్ డేట్ ప్రకటించి ఎగ్జిబ్యూటర్లు, అభిమానుల కళ్లలో ఆనందం చూడాలి అని నట్టి కుమార్ అన్నారు.
తాజా సమాచారం ప్రకారం.. అఖండకు సంబంధించి ఎరోస్ ఇంటర్నేషనల్ సంస్థతో ఉన్న ఆర్థిక సమస్యలు ఓ కొలిక్కి వచ్చాయి. అయితే ఈ సినిమాను 12వ తేదీ గానీ, లేదా 25వ తేదీన గానీ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారనే విషయాన్ని సినీ వర్గాలు ప్రస్తావిస్తున్నారు. ఏది ఏమైనా నందమూరి ఫ్యాన్స్ మాత్రం ఇంకా తీవ్ర నిరాశలోనే ఉన్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నది.


Click it and Unblock the Notifications











