తెలుగు సినిమాలంటే మైత్రీ మూవీస్కు చిన్నచూపా? పరభాషా చిత్రాలపై అంత మోజా?
తెలుగులో అగ్ర హీరోలతోపాటు భారీ బడ్జెట్ చిత్రాలను అందించే మైత్రీ మూవీస్ ఇటీవల డిస్ట్రిబ్యూషన్ రంగంలో బిజీగా మారిపోయింది. తెలుగు చిత్రాలతోపాటు అత్యధికంగా తమిళ, మలయాళ చిత్రాలను డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా మలయాళంలో విజయం సాధించిన ఓ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ తెలుగు, రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నది. అయితే ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో తెలుగు సినిమాలపై చిన్నచూపు చూసే విధంగా మైత్రీ సంస్థలో కీలకమైన భాగస్వామి శశి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆ వ్యాఖ్యల వివరాల్లోకి వెళితే..
తెలుగులోకి డబ్బింగ్ అవుతున్న మలయాళ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్లో మైత్రీ శశి మాట్లాడుతూ.. మలయాళంలో విజయవంతమైన సినిమాను నైజాంలో అవకాశం కల్పించడం సంతోషంగా ఉంది. కేరళలో ఎంత పెద్ద విజయం సాధించిందో.. తెలుగులో కూడా అంత సక్సెస్ కావాలని కోరుకొంటున్నాను. మేము రిలీజ్ చేసిన మంజుమ్మెల్ బాయ్స్ సినిమా తర్వాత అంతటి విజయాన్ని సాధిస్తుందని భావిస్తున్నాను అని శశి అన్నారు.

అయితే తెలుగులో ఏప్రిల్ 25 తేదీన తెలుగు సినిమాలు రిలీజ్ లేవు. ఉన్నా వాటిలో బెటర్ సినిమా అని అనుకొంటున్నాం. మంచి సినిమాను, యూత్ఫుల్ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను అని శశి తన ప్రసంగాన్ని ముగించారు. అయితే తెలుగులో రెండు, మూడు సినిమాలు రిలీజ్కు ఉన్నాయి. వాటిని పట్టించుకోకుండా సినిమాలు రిలీజ్ లేవు. ఉన్నవాటిలో ఇదే బెటర్ అని చెప్పడంపై సినీ వర్గాలు, నెటిజన్లు, తెలుగు సినీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగులో ఈవారం మంచి సినిమాలు రిలీజ్కు సిద్దమవుతున్నాయి. దర్శకుడు నక్కిన త్రినాథరావు నిర్మాతగా మారి నిర్మించిన చౌర్యపాఠం, ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్, ఇంద్రగంటి మోహనకృష్ణ కాంబినేషన్లో వస్తున్న సారంగపాణి జాతకం సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వరుస విజయాలతోపాటు కోర్ట్ సినిమాతో 50 కోట్లకుపైగా వసూళ్లు సాధించిన హీరో ప్రియదర్శి సినిమా రిలీజ్ అవుతున్నది. అలాంటి తెలుగు సినిమాలు రిలీజవుతున్నా పట్టించుకోకుండా.. సినిమాలు రిలీజ్ కావడం లేదనడం ఏమిటి? వారికి స్థానికంగా రిలీజ్ అయ్యే సినిమాలంటే చిన్నచూపా? చిన్న నిర్మాత బాగోగులు పట్టించుకోరా? తెలుగు ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉన్న నిర్మాణ సంస్థ తరపున ఇలా బాధ్యతారాహితంగా మాట్లాడటం సరికాదు అని మండిపడుతున్నారు.
తెలుగు సినిమా పరిశ్రమ ఇటీవల కాలంలో బాక్సాఫీస్ వద్ద తడబాటుకు గురి అవుతున్నది. ఇటీవల విడుదలైన భారీ బడ్జెట్ సినిమాలు, అగ్ర హీరోలు సినిమాలకు ప్రేక్షకుల ఆదరణ లేకపోవడం వల్ల నిర్మాణ సంస్థలు, నిర్మాతలు వాపోతున్నారు. ఇటీవల నిర్మాతగా మారిన నక్కిన త్రినాథరావు తెలుగు సినిమాల ప్రదర్శన, వాటి పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. పలు సినిమాల్లో సెకండ్ షోలు వేయడం కూడా ఆపేస్తున్నారు. ఇది తెలుగు సినిమా ఎదుర్కొంటున్న సంక్షోభం అని తన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగు సినిమాపై ప్రతికూల ప్రభావం చూపే విధంగా మైత్రీ శశి మాట్లాడటం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు.


Click it and Unblock the Notifications











