దేవీ శ్రీ ప్రసాద్ అవుట్.. తమన్ రంగంలోకి.. ఉస్తాద్ భగత్ సింగ్ సరికొత్త వివాదం
ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్, మైత్రీ మూవీ మేకర్స్ మధ్య అభిప్రాయ బేధాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయా? అనే విషయం తాజా సంఘటనతో మరోసారి స్పష్టమైంది. పుష్ప 2 రిలీజ్ నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ వరకు జరిగిన సంఘటనలు చూస్తే వారి మధ్య భారీ గ్యాప్ ఉందనే విషయంలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కూడా పుష్ప 2 సినిమా సమయంలో నిర్మాతలకు, మ్యూజిక్ డైరెక్టర్కు మధ్య ఇన్డైరెక్ట్ వార్ నడుస్తుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం తమన్ను రంగంలోకి దించారనే మీడియా వార్తలతో ఈ వ్యవహారం మరింత ఆసక్తికరంగా మారింది. ఈ వివాదానికి కారణాల్లోకి వెళితే..
గతంలో పుష్ప 2 సమయంలో కూడా దేవీ శ్రీ ప్రసాద్ వర్క్ కొనసాగుతుండగానే తమన్ను తెరపైకి తెచ్చారు. ఆ విషయంలో మైత్రీ, దేవీ శ్రీ ప్రసాద్ మధ్య భారీగానే వాగ్వాదం జరిగిందనే ప్రచారం జరిగింది. అంతేకాకుండా చెన్నైలో జరిగిన పుష్ప 2 ఈవెంట్లో మైత్రీ నిర్మాత రవిశంకర్తో స్టేజ్ మీదే తన అసంతృప్తిని వ్యక్తం చేయడం అప్పట్లో చర్చనీయాంశమైంది. దేవీ శ్రీ ప్రసాద్ చేసిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నచ్చకపోవడం వల్ల తమన్ను తెరపైకి తెచ్చారనే విషయం హాట్ టాపిక్ అయింది.

ఇక తాజాగా మల్లారెడ్డి యూనివర్సిటీలో జరిగిన ఉస్తాద్ భగత్ సింగ్ ఈవెంట్లో దేవీ శ్రీ ప్రసాద్ మాట్లాడుతూ.. హరీశ్ శంకర్ పర్మిషన్ లేకుండా ఈ సినిమా గురించి ఓ విషయాన్ని షేర్ చేయాలనుకొంటున్నాను. ఆ తర్వాత నన్ను తిట్టరు కదా? ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ దాదాపు పూర్తయింది. చాలా బాగా వచ్చింది. ఫస్టాఫ్, సెకండాఫ్ చూసుకొన్నాం. ఫస్ట్ డే థియేటర్లలో సినిమా చూసే సమయంలో కాగితాలు చింపి హంగామా చేసే విధంగా మా స్టూడియోలో సినిమా చూసిన తర్వాత మా పరిస్థితి అలానే కనిపించింది. ఆ రేంజ్కు సినిమాను హరీష్ చేశారు. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్కు అన్ని రకాల విందు భోజనమే. ఆయన పెర్ఫార్మెన్స్ దద్దరిల్లిపోతుందని హరీష్ ముందే చెప్పారు. మార్చి 27న థియేటర్లలో కుమ్మేయండి అంటూ దేవీ శ్రీ ప్రసాద్ క్లారిటీ ఇచ్చారు.
అయితే తాజాగా దేవీ శ్రీ ప్రసాద్ తప్పించి తమన్ను బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం రంగంలోకి దించారు అనే వార్త సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. దేవీ శ్రీ ప్రసాద్ వర్క్ నచ్చలేదా? రీ రికార్డింగ్ పూర్తయిందని ఆయన ముందే చెప్పారు. అయినా మళ్లీ తమన్ను ఎందుకు తీసుకొచ్చారు. తమన్ తీసుకు రావడం వెనుక కారణమేమిటి? మైత్రీ, దేవీ మధ్య వివాదం అలాగే కొనసాగుతున్నదా? ఇటీవల ఈవెంట్లో దేవీ రీ రికార్డింగ్ ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చారు? తనకు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పిస్తున్నారనే విషయం ముందే అర్ధమైందా? అనే విషయాలపై ఇండస్ట్రీలో గుసగుసలు మొదలయ్యాయి.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ ఈ సినిమాను అట్టహాసంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీలీల, రాశీ ఖన్నా, గౌతమీ, చమ్మక్ చంద్ర, అశుతోష్ రాణా, నవాబ్ షా,నర్రా శ్రీను, నాగ మహేష్ నటిస్తున్నారు. ఈ సినిమా మార్చి 27వ తేదీన రిలీజ్ అవుతున్నది. అయితే టాక్సిక్ సినిమా రిలీజ్ వాయిదా పడటంతో ఉస్తాద్ రిలీజ్ డేట్ కూడా మారొచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి.


Click it and Unblock the Notifications











