AP Elections జనసైనికులను అల్లు అర్జున్ హర్ట్ చేశాడా? పుష్ప 2 మూవీపై ఎఫెక్ట్ తప్పదా?
మెగా హీరోల్లో అల్లు అర్జున్ వైఖరి మరోసారి హాట్ టాపిక్గా మారింది. మెగా ఫ్యామిలీ మొత్తం జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురంలో మకాం వేస్తే బన్నీ మాత్రం.. పవన్ వ్యతిరేకించే వైఎస్ జగన్ సారథ్యంలోని వైసీపీ అభ్యర్ధి తరపున ప్రచారం చేయడానికి నంద్యాల వెళ్లడం సినీ, రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పరిణామాలు మెగా ఫ్యామిలీలో మనస్పర్ధలను తెరపైకి తెచ్చింది.
బన్నీ నంద్యాలలో ఉన్న సమయంలో చరణ్ తన తల్లి, మేనమామ అల్లు అరవింద్తో కలిసి పిఠాపురంలో బాబాయ్ పవన్ను కలవడం.. చెర్రీని చూసేందుకు మెగా అభిమానులు పోటెత్తారు. ఎన్నికల ప్రచారానికి చివరి రోజున ఇలా ఒకే ఫ్యామిలీకి చెందిన స్టార్ హీరోలు, వేరు వేరు రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్ధులకు సంఘీభావం చెప్పేందుకు వెళ్లడం సినీ, రాజకీయ వర్గాల్లో దుమారం రేపింది.

బాబాయ్ పవన్ కళ్యాణ్ గెలుపు కోసం తాను పిఠాపురానికి వెళ్తున్నట్లు రాంచరణ్ కానీ , ఆయన టీమ్ కానీ ఎక్కడా చెప్పలేదు. అయితే ప్రచారానికి చివరి రోజైన ఆదివారమే దీనికి ఎంచుకోవడం హాట్ టాపిక్గా మారింది. కానీ అల్లు అర్జున్ మాత్రం నంద్యాల వెళ్లి వైసీపీ అభ్యర్ధి శిల్పా రవిచంద్రారెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
బన్నీ రాకతో నంద్యాల రోడ్లు అభిమానులతో కిక్కిరిసిపోయాయి. అయితే శిల్పారవికి తాను మద్ధతు పలకడంపై వస్తున్న విమర్శలకు అల్లు అర్జున్ కౌంటరిచ్చారు. హైదరాబాద్కు తిరుగు ప్రయాణమవుతూ మీడియాతో మాట్లాడిన ఆయన శిల్పా రవిచంద్రారెడ్డి వ్యక్తిగతంగా తనకు స్నేహితుడు కావడంతోనే మద్ధతు పలికినట్లు తెలిపారు. అంతకుమించి ఏ రాజకీయ పార్టీకి తాను సపోర్ట్ చేయడం లేదని అల్లు అర్జున్ క్లారిటీ ఇచ్చారు.
స్నేహం కోసం అల్లు అర్జున్ ఇలా చేసినప్పటికీ జనసైనికులు, ముఖ్యంగా మెగా , పవన్ అభిమానులు బన్నీపై మండిపడుతున్నారు. సొంత కుటుంబ సభ్యుడు , పైగా మేనమామ పవన్కు మద్ధతిస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి.. ఫ్రెండ్ కోసం పర్సనల్గా వెళ్లడమేంటంటూ ప్రశ్నిస్తున్నారు.

అసలే అల్లు అర్జున్ - పవన్ కళ్యాణ్ మధ్య గతంలో వృత్తిపరమైన వైరం వున్న సంగతి తెలిసిందే. నిండు సభలో పవన్ గురించి చెప్పాలంటూ ఆయన అభిమానులు పదే పదే గోల చేయడంతో వేదికపై వున్న బన్నీ 'చెప్పను బ్రదర్ ' అంటూ చేసిన కామెంట్స్ కలకలం రేపింది. ఆ క్షణం నుంచి నేటి వరకు ఇరు హీరోల అభిమానుల మధ్య సోషల్ మీడియాలో యుద్ధం జరుగుతూనే వుంది.
అల్లు అర్జున్ తాజా స్టెప్ కారణంగా ఆయన రానున్న చిత్రం పుష్ప-2పై పడే సూచనలు వున్నాయా అంటూ ఫిలింనగర్ సర్కిల్స్లో చర్చ జరుగుతోంది. చెప్పను బ్రదర్ కామెంట్స్ కారణంగా బన్నీ నటించిన ఓ చిత్రానికి వసూళ్లు పడిపోయాయని ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడు పవన్ బద్ధ వ్యతిరేకికి చెందిన పార్టీకి బన్నీ అండగా నిలబడటం కూడా అదే స్థాయిలో ప్రభావం చూపుతుందా అన్న అనుమానాలు లేకపోలేదు. అయితే ఇక్కడ ఓ విషయం గుర్తుపెట్టుకోవాలి. పవన్-అల్లు అర్జున్ మధ్య ఏ విభేదాలు లేకున్నా.. ఉన్నట్లుగా ప్రచారం జరిగినా, వివాదాలు రేగినా వీరిద్దరూ ఏనాడు స్పందించలేదు.
సరిగ్గా ఎన్నికల ప్రక్రియ కీలక దశకు చేరుకున్న వేళ.. పవన్కు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశాడు అల్లు అర్జున్. గతంలో ఏం జరిగినా ఫ్యాన్స్ మధ్య చీలిక ఉండకూడదని... గంపగుత్తగా మెగా ఫ్యాన్స్ ఓట్లన్నీ పవన్కు, కూటమికి పడాలనే ఉద్దేశం బన్నీలోనూ కనిపించింది. ఎన్నికలు జరిగి, రిజల్ట్స్ వచ్చాక ఎవరి ప్రపంచంలో వాళ్లు బిజీ అయిపోతారు. అల్లు అర్జున్ నంద్యాల వెళ్లడం, చరణ్ పిఠాపురం వెళ్లడం కేవలం బంధుత్వాలు, స్నేహసంబంధాల కోణంలోనే చూడాలి తప్పించి రాజకీయం కాదని విశ్లేషకులు అంటున్నారు.


Click it and Unblock the Notifications











