ఎన్టీఆర్ డ్రాగన్ మరో ధురంధర్ కాబోతుందా? సీక్రెట్ రివీల్ చేసిన ప్రశాంత్ నీల్!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'డ్రాగన్' సినిమా. ఈ సినిమా ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు సృష్టిస్తోంది. తాజాగా విడుదలైన ఫస్ట్ గ్లింప్స్తో సినిమా గురించి ఎన్నో చర్చలు మొదలయ్యాయి. అయితే తాజాగా ప్రశాంత్ నీల్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఇంటర్య్వూలో ముఖ్యంగా ఎన్టీఆర్ పాత్ర, కథ నేపథ్యం గురించి ఆయన వెల్లడించిన విషయాలు 'డ్రాగన్' సాధారణ కమర్షియల్ సినిమా కాదనే సంకేతాలు ఇస్తున్నాయి.
సాధారణంగా స్టార్ హీరోల సినిమాల ఫస్ట్ లుక్ లేదా టీజర్ అంటే హీరో ఎలివేషన్స్, మాస్ డైలాగ్స్, పవర్ఫుల్ ఎంట్రీలు ఉంటాయి. కానీ 'డ్రాగన్' విషయంలో మాత్రం ప్రశాంత్ నీల్ పూర్తిగా డిఫెరెంట్ స్ట్రాటజీ ఎంచుకున్నారు. గ్లింప్స్లో ఎన్టీఆర్ను చూపించే ముందు మొత్తం కథ, పాత్రలను ప్రేక్షకులకు పరిచయం చేశాడు. దీనిపై స్పందించిన ప్రశాంత్ నీల్.. "ఈసారి కేవలం హీరోను హైలెట్ చేయడం కాదు.. మేము చెప్పబోయే కథను కూడా ప్రేక్షకులకు పరిచయం చేయాలనుకున్నాం" అని చెప్పాడు.

ఇక ఎన్టీఆర్ పాత్ర గురించి మాట్లాడుతూ.. "నేను ఇప్పటివరకు రాసిన పాత్రల్లో ఇదే అత్యంత డార్క్ క్యారెక్టర్. రాఖీ భాయ్, దేవా కంటే కూడా లూగర్ పాత్ర చాలా భిన్నంగా ఉంటుంది" అని ప్రశాంత్ నీల్ వెల్లడించాడు. స్టార్ ఇమేజ్ ఉన్న హీరో ఇలాంటి పాత్రను అంగీకరించడం చాలా పెద్ద రిస్క్ అని కూడా చెప్పాడు. ఒక స్టార్ హీరోగా కాకుండా కథ కోసం పూర్తిగా తన ఇమేజ్ను పక్కన పెట్టి ఎన్టీఆర్ ఈ పాత్రను అంగీకరించాడని ప్రశంసించాడు.
అసలు ఈ కథకు సంబంధించిన ఆలోచన ఐదేళ్ల క్రితమే మొదలైందట. అప్పటి నుంచి ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ఇద్దరూ కలిసి కథ, పాత్రలు, డ్రామాపై ఎన్నో చర్చలు జరిపారట. ఈ కథలోని ప్రధాన పాత్ర ఎందుకు అలా ప్రవర్తిస్తుంది? అతడి ప్రయాణం ఏంటి? అనే విషయాలను పూర్తిగా నమ్మేలా రాయడానికి మాత్రమే మూడు సంవత్సరాలు పట్టిందని ప్రశాంత్ నీల్ వెల్లడించాడు. ఒక సీన్ను జస్టిఫై చేయడానికి కూడా సంవత్సరాల పాటు కష్టపడ్డామని చెప్పాడు.
మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. 'డ్రాగన్' కథ 1947 తర్వాతి భారతదేశం నేపథ్యంలో సాగనుంది. అయితే అసలు డ్రామా 1967 కాలంలో ప్రారంభమవుతుందని ప్రశాంత్ నీల్ తెలిపాడు. ముంబై, కోల్కతా వంటి నగరాల నేపథ్యంలో కథ నడుస్తుందని, అప్పట్లో ఉన్న ఓపియం, హెరాయిన్ వ్యాపారాలు, అక్రమ సామ్రాజ్యాలు, గ్యాంగ్ వార్స్ ఈ కథలో కీలక పాత్ర పోషిస్తాయని వెల్లడించాడు. అంటే 'కేజీఎఫ్'లో బంగారం, 'సలార్'లో ఖాన్సార్ రాజ్యం ఎలా కథకు బలం ఇచ్చాయో.. 'డ్రాగన్'లో చారిత్రక నేపథ్యం, నేర సామ్రాజ్యాల పోరాటాలతో పాటు దేశ భక్తి భావం కూడా ఉన్నట్టు చెప్పారు.
ఇక ఎన్టీఆర్ లుక్ గురించి కూడా ప్రశాంత్ నీల్ ఆసక్తికర విషయాలు చెప్పాడు. మొదట ఈ పాత్ర కోసం కొద్దిగా బరువు తగ్గమని మాత్రమే చెప్పానని, కానీ ఎన్టీఆర్ మాత్రం దాన్ని ఛాలెంజ్గా తీసుకుని ఏకంగా 15 కిలోలకు పైగా బరువు తగ్గాడని తెలిపాడు. నాలుగు నెలల పాటు కఠినమైన డైట్, ట్రైనింగ్ ఫాలో అయ్యాడని, అతడి అంకితభావం చూసి కుటుంబ సభ్యులు కూడా ఆశ్చర్యపోయారని చెప్పాడు. ఒక అసాసిన్ పాత్రకు అవసరమైన బాడీ లాంగ్వేజ్ కోసం ఎన్టీఆర్ ఎంతో కష్టపడ్డాడని వెల్లడించాడు.
తన కెరీర్లో రూపొందించిన డార్క్ క్యారెక్టర్ లో 'డ్రాగన్' చివరి సినిమా అని ప్రకటించాడు. 'కేజీఎఫ్'లో రాఖీ, 'సలార్'లో దేవా, ఇప్పుడు 'డ్రాగన్'లో లూగర్.. ఈ మూడు పాత్రలు ఒకే జానర్కు చెందినవిగా కనిపించినా వాటి భావోద్వేగాలు, లక్ష్యాలు, కథలు పూర్తిగా వేర్వేరని స్పష్టం చేశాడు. అందుకే ఈ సినిమాను మరో 'కేజీఎఫ్' లేదా 'సలార్'తో పోల్చకూడదని సూచించాడు.
ఇలా మొత్తంగా చూస్తే.. 'డ్రాగన్' కేవలం యాక్షన్ సినిమా కాదనీ, డ్రామా, చారిత్రక నేపథ్యం, నేర సామ్రాజ్యాలు, దేశ భక్తి, భావోద్వేగాలు, రాజకీయ శక్తుల మధ్య పోరాటలు లాంటి అంశాలతో రూపొందుతున్న సినిమా అని తెలుస్తోంది. దాదాపు ఇలాంటి కథతో వచ్చిన ధురంధర్ 1, ధురంధర్ 2 సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసి, పలు రికార్డులను క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఇలా అంశాలన్నింటిని చూస్తుంటే.. 'డ్రాగన్' మరో ధురంధర్ లాగా సంచలనంగా నిలుస్తుందా? లేక ఎన్టీఆర్ కెరీర్లో కొత్త చరిత్ర సృష్టిస్తుందా? అనేది చర్చనీయంగా మారింది. ఇక సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications






