NTR30: ఎన్టీఆర్ మూవీలో ఆ గేమ్ హైలైట్.. మల్లయోధుడిగా సర్ప్రైజ్ ట్రీట్
హిట్లు మీద హిట్లు.. హిట్లు మీద హిట్లు కొడుతూ కొంత కాలంగా భీకరమైన ఫామ్తో దూసుకుపోతోన్నాడు టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. మరే హీరోకూ సాధ్యం కాని రీతిలో వరుసగా ఆరు విజయాలను సొంతం చేసుకున్న అతడు.. RRR అనే చిత్రంతో అంతర్జాతీయ ఖ్యాతిని సైతం సొంతం చేసుకున్నాడు. దీనికితోడు హాలీవుడ్ ప్రముఖుల దృష్టిని సైతం ఆకట్టుకున్నాడు. ఫలితంగా మరింత ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నాడు. ఇందులో భాగంగానే ఇప్పుడు ఎన్టీఆర్.. తన 30వ చిత్రాన్ని టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో చేస్తున్న విషయం తెలిసిందే.
నందమూరి చిన్నోడు జూనియర్ ఎన్టీఆర్.. కొరటాల శివ కాంబినేషన్లో రాబోతున్న ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయింది. మొదటి షెడ్యూల్ను హైదరాబాద్ శివారు ప్రాంతమైన శంకరపల్లిలో వేసిన ప్రత్యేకమైన సెట్లో పూర్తి చేశారు. ఆ వెంటనే రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా రెండో షెడ్యూల్ను జరుపుతున్నారు. ఇక్కడ దాదాపు ఇరవై రోజలు పాటు చిత్రీకరణ జరపబోతున్నారు. ఇందులో తారక్తో పాటు ముఖ్యమైన పాత్రలను చేస్తున్న స్టార్ల మధ్య కీలకమైన సన్నివేశాలను, యాక్షన్ సీక్వెన్స్ను చిత్రీకరిస్తారని తెలిసింది. ఈ నేపథ్యంలో తాజాగా దీని నుంచి ఓ క్రేజీ న్యూస్ లీకైంది.

'జనతా గ్యారేజ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల కలిసి చేస్తున్న ఈ సినిమా ఇండియన్ కోస్టల్ బ్యాగ్డ్రాప్తో తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో తారక్ డుయల్ రోల్ చేస్తున్నట్లు ఇప్పటికే ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఇక, తాజా సమాచారం ప్రకారం.. ఫ్లాష్బ్యాక్లో వచ్చే ఎపిసోడ్లో పెద్ద ఎన్టీఆర్ మల్లయోధుడి (రెజ్లర్)గా కనిపించబోతున్నాడట. అంతేకాదు, అతడు ఓ రెజ్లింగ్ కాంపిటీషన్లో కూడా పాల్గొంటాడని తెలిసింది. దీనికి సంబంధించిన సీక్వెన్స్ను పీటర్ హెయిన్స్ నేతృత్వంలో తాజాగా చిత్రీకరించారని తెలిసింది. ఇదంతా హైలైట్గా ఉండబోతుందని సమాచారం.

ఎన్టీఆర్ - కొరటాల కలిసి చేస్తున్న ఈ మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనికి యంగ్ సెన్సేషన్ అనిరుథ్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో జాన్వీ హీరోయిన్ కాగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్గా నటిస్తున్నాడు. ఈ మూవీని 2024 ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ చేయబోతున్నారు.


Click it and Unblock the Notifications











