Year Ender 2024 : 2024లో మరణించిన సినీ ప్రముఖులు .. దివికేగిన కళామతల్లి ముద్దుబిడ్డలు
మరికొద్దిగంటల్లో 2024 కాలగర్భంలోకి గడిచిపోనుంది. చూస్తుండగానే అప్పుడే కొత్త సంవత్సరం వచ్చేసిందా అనిపించక మానదు. 2024లో ఎన్నో తీపి , చేదు జ్ఞాపకాలు.. విజయాలు, పరాజయాలు, సంతోషాలు, దు:ఖాలు ఇలా ఎన్నో ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ వీటన్నింటిని గుండెల్లో దాచుకుని కొత్త ఏడాదిలోకి అడుగుపెడుతోంది ప్రపంచం. అన్ని రంగాల మాదిరిగానే చిత్ర పరిశ్రమకు కూడా ఎన్నో తీపి, చేదు జ్ఞాపకాలు ఉన్నాయి. ఈ ఏడాది పలువురు సినీ దిగ్గజాలు తిరిగి రాని లోకాలకు తరలిపోయారు వారు ఎవరో చూస్తే :
జాకీర్ హుస్సేన్ :
దేశం గర్వించదగ్గ తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ ఈ ఏడాది డిసెంబర్లో అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో తుదిశ్వాస విడిచారు. వాహ్ ఉస్తాద్ అంటూ దశాబ్ధాలుగా సంగీత ప్రియులను అలరిస్తున్న జాకీర్ హుస్సేన్ తన కెరీర్లో నాలుగు గ్రామీ అవార్డులను గెలుచుకున్నారు. అలాగే పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, సంగీత నాటక అకాడమీ అవార్డ్లతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది.

శ్యామ్ బెనగల్ :
కళాత్మక చిత్రాల సృష్టికర్త, దర్శక దిగ్గజం శ్యామ్ బెనగల్ కూడా ఈ ఏడాది డిసెంబర్లో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని ఓ ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోయారు. తను తీసిన చిత్రాలకు గాను పలుమార్లు జాతీయ పురస్కారాలను గెలుచుకున్నారు శ్యామ్ బెనగల్.
రామోజీరావు :
ఈనాడు సంస్థలు, మార్గదర్శి, ఈటీవీ నెట్వర్క్, ప్రియా ఫుడ్స్, రామోజీ ఫిల్మ్ సిటీ అధినేత రామోజీరావు ఈ ఏడాది జూన్లో కన్నుమూశారు. ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్పై ఎన్నో ఉత్తమ చిత్రాలను నిర్మించి , ఎందరో దర్శకులను , హీరోలను, హీరోయిన్లను వెండితెరకు పరిచయం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద రామోజీ ఫిల్మ్ సిటీని నిర్మించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించి తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పారు.
సుహానీ భట్నాగర్ :
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ఖాన్ హీరోగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ దంగల్లో బాలనటిగా నటించిన సుహానీ భట్నాగర్ హఠాన్మరణం చిత్ర పరిశ్రమను షాక్కు గురిచేసింది. గత కొంతకాలంగా డెర్మాటోమియోసిటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సుహానీ ఫిబ్రవరిలో కన్నుమూశారు. ఈ విషయం తెలిసి స్వయంగా అమీర్ఖాన్ సంతాపం ప్రకటించారు.
సూర్యకిరణ్ :
దర్శకుడు సూర్యకిరణ్ ఈ ఏడాది మార్చి 11న జాండీస్తో కన్నుమూశారు. 2003లో వచ్చిన సత్యంతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన ఆయన కెరీర్లో అనుకున్న స్థాయికి చేరుకోకపోవడంతో డిప్రెషన్లోకి వెళ్లారు. బిగ్బాస్ తెలుగు 4లో కంటెస్టెంట్గానూ తళుక్కున మెరిశారు. 2005లో హీరోయిన్ కళ్యాణిని పెళ్లాడగా.. 2016లో వీరిద్దరూ విడిపోయారు.
డేనియల్ బాలాజీ :
తమిళ విలక్షణ నటుడు డేనియల్ బాలాజీ ఈ ఏడాది గుండెపోటుతో కన్నుమూశారు. ఛాతి నొప్పి రావడంతో ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయారు. తమిళంతో పాటు తెలుగులో విలన్ పాత్రలు పోషించి మంచి నటుడిగా గుర్తింపుప తెచ్చుకున్నారు బాలాజీ.
బలగం మొగిలయ్య :
బలగం సినిమా ద్వారా తెలుగు వారి ప్రశంసలు దక్కించుకున్న జానపద కళాకారుడు మొగిలయ్య ఇటీవల కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన వరంగల్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
గద్దర్ :
ప్రజా గాయకుడిగా, విప్లవ నేతగా ప్రసిద్ధి చెందిన గద్ధర్ ఈ ఏడాది ఆగస్టులో కన్నుమూశారు. పాటనే ఆయుధంగా చేసుకుని ఎన్నో ఉద్యమాలలో పాల్గొన్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో తన పాట ద్వారా ఉద్యమానికి మరింత ఊపు తీసుకొచ్చారు. పాటలు, ప్రసంగాల ద్వారా తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరించి వారిలో చైతన్యం తీసుకొచ్చారు.


Click it and Unblock the Notifications











