Yatra 2: యాత్ర 2 రిలీజ్ డేట్ వచ్చేసింది.. వైఎస్సార్తో జగన్ ఫస్ట్ లుక్ చూశారంటే!
ఈ మధ్య కాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో బయోపిక్ మూవీల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. ఇప్పటికే మన ఫిల్మ్ మేకర్లు ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ల జీవిత కథలను సినిమాలుగా మలిచారు. వీటిలో చాలా వరకూ సూపర్ హిట్లుగా నిలిచాయి. అలా కొన్నేళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రమే 'యాత్ర'. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్గా వచ్చిన ఈ చిత్రానికి విశేషమైన స్పందన లభించిన విషయం తెలిసిందే. దర్శకుడు మహి వీ రాఘవ్ ఈ సినిమాకు సీక్వెల్ చేయాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నాడు.
'యాత్ర' సూపర్ సక్సెస్ అవడంతో వైఎస్సార్ తనయుడు, ఇప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి లైఫ్ స్టోరీతో దీనికి సీక్వెల్ చేయడానికి డైరెక్టర్ మహి వీ రాఘవ్ కథను కూడా ఎప్పుడో రెడీ చేసుకున్నాడు. ఆ తర్వాత చాలా కాలం పాటు దీనిపై వర్క్ చేసిన అతడు.. ఇటీవలే కోలీవుడ్ హీరో జీవాతో ఈ సినిమాను 'యాత్ర 2' టైటిల్తో ప్రారంభించాడు. ఆ వెంటనే ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్ను సైతం విడుదల చేశాడు. దీనికి వైఎస్ అభిమానులతో పాటు సినీ ప్రియుల నుంచి కూడా మంచి స్పందన లభించింది.

2024లో వచ్చే అసెంబ్లీ ఎన్నికలను టార్గెట్ చేస్తూ 'యాత్ర 2' మూవీని తీసుకు రాబోతున్నారని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్తో పాటు రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది. అందరూ అనుకున్నట్లుగానే దీన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరి 8వ తేదీన రిలీజ్ చేయబోతున్నారు. ఇక, తాజాగా విడుదలైన పోస్టర్లో వైఎస్సార్గా మమ్ముట్టి కనిపించగా.. వైఎస్ జగన్మోహన్ రెడ్డిగా జీవా దర్శనమిచ్చాడు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ను చూసి వైఎస్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

ఇదిలా ఉండగా.. 'యాత్ర 2' మూవీలో వైఎస్సార్ చనిపోయిన దగ్గర నుంచి మొదలవుతుందట. ఇందులో పాదయాత్రను బాగా హైలైట్ చేయబోతున్నారని తెలుస్తోంది. అలా మొదలై ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి అయ్యేంత వరకూ ఈ సినిమాలో చూపిస్తారని తెలుస్తోంది. మధ్యలో ఆయనపై కొందరు కుట్రలు చేసినట్లు కూడా చూపిస్తారని సమాచారం.
ఇక, 'యాత్ర 2' సినిమాను త్రి ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. సీక్వెల్కు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో నటించే వాళ్ల వివరాలు తెలియాల్సి ఉన్నాయి.


Click it and Unblock the Notifications











