కాదంబరీ జత్వానీ కేసు.. పోలీసులకు చిక్కిన విద్యాసాగర్ , ఆ బడా బాబుల వెన్నులో వణుకు!
కాదంబరీ జత్వానీ కేసు తెలుగు సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. ఈ కేసును కొలిక్కి తీసుకొచ్చేందుకు ఏపీ పోలీసులు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఈ కేసులో ప్రమేయం ఉన్నట్లు తేలడంతో ఇప్పటికే పలువురు పోలీస్ అధికారులపై వేటు పడింది. గంటలు తిరగకుండానే ముగ్గురు సీనియర్ ఐపీఎస్లను ప్రభుత్వం సస్పెండ్ చేయడంతో అధికార వర్గాలు ఉలిక్కిపడ్డాయి. ఈ పరిణామాలతో కాదంబరీ కేసులో నెక్ట్స్ ఎవరు..? అనే చర్చ జరుగుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..
ముంబైకి చెందిన సినీ నటి కాదంబరీ జత్వానీని కృష్ణాజిల్లా మాజీ జడ్పీ ఛైర్పర్సన్ కుక్కల నాగేశ్వరరావు కుమారుడు విద్యాసాగర్ ప్రేమ, పెళ్లి పేరుతో లొంగదీసుకున్నట్లుగా మీడియాలో విస్తృతంగా కథనాలు వచ్చాయి. హైదరాబాద్లో ఓ ఈవెంట్లో పరిచయమైన కాదంబరీని పెళ్లి చేసుకుంటానని విద్యాసాగర్ మాయమాటలు చెప్పి లోబరచుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే తనను పెళ్లి చేసుకోవాలంటూ ఆమె ఒత్తిడి పెంచడంతో విద్యాసాగర్ ఆమెను వదిలించుకోవాలని చూసినట్లుగా మీడియాలో వార్తలు వచ్చాయి. ఇందుకోసం నాటి వైఎస్ జగన్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన పెద్దల సాయం తీసుకున్నాడని, వారి ఆదేశాలతో అధికారులు సైతం విద్యాసాగర్కు సహకరించినట్లుగా వార్తలు వచ్చాయి.

విద్యాసాగర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ముంబైలో కాదంబరీని, ఆమె కుటుంబ సభ్యులను అరెస్ట్ చేసిన బెజవాడ పోలీసులు వారిని నగరానికి తీసుకొచ్చారు. కోర్ట్ వీరికి రిమాండ్ విధించగా.. 42 రోజుల పాటు జైల్లోనే ఉన్నారు. పెళ్లి ప్రతిపాదనను విరమించుకోవాలని వారి నుంచి సంతకాలు తీసుకుని ఈ గ్యాంగ్ విడిచిపెట్టింది. కొన్నాళ్లు సైలెంట్గా ఉన్న కాదంబరీ టీడీపీ ప్రభుత్వం రాగానే తనకు జరిగిన అన్యాయాన్ని బయటపెట్టింది.
దీంతో ప్రత్యేక విచారణాధికారిని నియమించిన ప్రభుత్వం దర్యాప్తు చేయిస్తోంది. ఈ కేసులో ప్రమేయం ఉన్నట్లుగా తేలడంతో నాడు విజయవాడలో విధులు నిర్వర్తించిన ఏసీపీ హనుమంతరావు, ఇబ్రహీంపట్నం సీఐ ఎం సత్యనారాయణలను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఆ తర్వాత ఐపీఎస్ అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా టాటా, విశాల్ గున్నీలను సీఎం చంద్రబాబు సస్పెండ్ చేశారు. కాదంబరీ కేసులో ప్రమేయం ఉన్న ఎవరినీ వదిలిపెట్టేది లేదని, ఆమెకు న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి హెచ్చరించారు.
అయితే ఈ మొత్తం వ్యవహారంలో సూత్రధారిగా , తెర వెనుక మంత్రాంగం నడిపిన వైసీపీ పెద్ద మనిషికి పోలీసులు ఉచ్చు బిగిస్తున్నారు. కీలక ఆధారాలను సేకరించి నేడో రేపో ఆయనను వ్యాన్ ఎక్కించాలని పావులు కదుపుతున్నారు. అటు జత్వానీ కేసు ఏపీలో అధికార పార్టీకి బ్రహ్మాస్త్రంలా మారింది. ఆ పెద్ద మనిషిని కటకటాల వెనక్కి నెట్టి.. వైసీపీకి షాక్ ఇవ్వాలని కూటమిలోని కొందరు నేతలు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
ఇదిలాఉండగా.. కాదంబరీ జత్వానీ కేసులో వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ను డెహ్రాడూన్లో అరెస్ట్ చేసిన పోలీసులు ఆయనను ఆదివారం అర్ధరాత్రి నాటికి విజయవాడ తీసుకురానున్నారు. చట్టపరమైన లాంఛనాలు పూర్తి చేసి విద్యాసాగర్ను సోమవారం కోర్టులో హాజరుపరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన పోలీస్ కస్టడీలోకి వెళితే.. మరిన్ని ఆధారాలు వెలుగుచూసే అవకాశం ఉండటంతో ఈ కేసులో ప్రమేయం ఉన్న బడాబాబుల వెన్నులో వణుకు మొదలైనట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీంతో జత్వానీ కేసు ఏ వైపు మలుపు తిరుగుతుందో, ఎందరి పేర్లు బయటికి వస్తాయోనని సినీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.


Click it and Unblock the Notifications











