Don't Miss!
- News రాహుల్ సహా నేడు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్న కీలక నేతలు వీరే..
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
చనిపోవటానికి ముందు రోజు ఉదయ్ కిరణ్ ఎంత బాధపడ్డాడో చెప్పిన అల్లరి నరేష్
హైదరాబాద్ : ఉదయ్ కిరణ్ ...ఈ పేరు వింటే చాలు మనందరి గుండెలు ఒక్కసారిగా బరువెక్కిపోతాయి. చిన్నగా సిగ్గు పడుతూ చిరునవ్వులు చిందించే ఈ యంగ్ హీరోని మర్చిపోవటం కష్టమే. ఒక తరాన్ని తన ప్రేమ కథలతో ఊపేసారు. చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే అంటూ వరసపెట్టి హిట్లు కొట్టి, ఆ తర్వాత ఊహించని విధంగా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.
అయితే చనిపోవడానికి కొన్నిరోజులముందు ఉదయ్ చాలా బాధనే అనుభవించాడని చాలా మంది చెప్తారు. అయితే ఆ విషయాలు ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ ఉదయ్ కిరణ్ ఎలా బాధపడేవాడో తనకు తెలుసునంటున్నాడు అతడి మిత్రుడైన అల్లరి నరేష్. రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వులో ఉదయ్ గురించి ఒక బాధాకర విషయం చెప్పి మళ్లీ గుండెలు బరవెక్కించాడు అల్లరి నరేష్.
అల్లరి నరేష్ ని ఇంటర్వూ చేసిన మీడియా సంస్ద..వారు.. మీ జీవితంలో నవ్వులే కాదు, బాధపడ్డ సందర్భాలు ఉంటాయి కదా..? అలాంటి ఒక సంఘటన.. చెప్పండి అంటే ఉదయ్ కిరణ్ సంఘటన ఆయన ప్రస్దావించారు. తన జీవితంలో మర్చిపోలేని ఆ సంఘటన గురించి నరేష్ ఏం చెప్పారంటే...
ఉదయ్ కిరణ్ ముఖంలో దిగులు,బాధ
చనిపోక ముందు ఉదయకిరణ్ ఒక రోజు నన్ను కలిశాడు. ఎందుకో అతని ముఖంలో దిగులు, బాధ కనిపించాయి. ‘ఎందుకు ఉదయ్ అలా ఉన్నావు? ఏమైంది'' అనడిగాను. ‘‘ఏమీలేదు నరేష్, పొద్దున్నే ఒక ఆర్టికల్ చదివాను. అందులో ఒక యువహీరో కథల్ని సరిగా ఎంచుకోవట్లేదని రాసుంది'' అన్నాడు.
చివరకి ఉదయ్ కిరణ్ గతే
‘‘మామూలే ఉదయ్ ఒక్కొక్కరు ఒక్కోలా రాస్తుంటారు. అవన్నీ పట్టించుకోకు. నీకు సంబంధించిన విషయం కాదు కదా'' అన్నాను. ‘‘లేదు నరేష్ నాకు సంబంధించిన విషయమే అది. ఆ యువ హీరో గురించి రాస్తే రాయొచ్చు. అతను మారకపోతే ఆఖరికి ఉదయకిరణ్ గతే పడుతుంది అని నన్ను ఉదాహరణగా చూపడం బాధిస్తోంది'' అన్నాడు.
ఎంత చిన్నచూపు చూస్తారో అని..
నా నోట మాట రాలేదు. నేను కూడా చాలా బాధపడ్డాను. ఒక నటుడికి అవకాశాలు వచ్చినప్పుడు ఆకాశానికి ఎత్తేసిన వీళ్లే.. కిందపడినప్పుడు ఎంత చిన్నచూపు చూస్తారో ఆ సంఘటన ద్వారా తెలుసుకున్నాను. ఎంత పెద్ద నటులు అయినప్పటికీ సామాన్యులకు ఎలాగైతే ఉద్వేగాలు ఉంటాయో అలాగే ఉంటాయని చాలామందికి తెలియదు.
ఆత్మహత్య చేసుకోక ముందే కలిసుంటే..
రంగనాథ్గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ‘ఆత్మహత్య చేసుకోక ముందు ఉదయ్ కిరణ్ నన్ను కలిసుంటే అతన్ని బతికించి ఉండేవాణ్ణి' అని. కానీ ఆఖరికి అలా చెప్పిన రంగనాథ్గారే ఆత్మహత్య చేసుకోవడం నన్ను కదిలించింది.
నటులు ఆత్మహత్యలు పెరిగాయి
నటుల జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో తల్చుకున్నప్పుడు మనసు పాడవుతుంది. ఈ మధ్య నటుల ఆత్మహత్యలు పెరిగాయి. చాలామంది అవకాశాలు లేక, బయటికి రాలేక కుంగిపోతున్నారు అన్నారు నరేష్.
మానాన్న గారి చనిపోయినప్పుడు సెల్ఫీ అడిగారు
ఒక్కోసారి కొందరి విపరీత ప్రవర్తన కోపం తెప్పిస్తుంది. అప్పుడు నటుణ్ణి కదా అని కంట్రోల్ చేసుకోవడం కష్టం. మా నాన్న చనిపోయినప్పుడు పార్ధివదేహం అక్కడే ఉంది. నేను పక్కనే ఉన్నాను. ఒక యువకుడు నావద్దకు వచ్చి సెల్ఫీ తీసుకునే ప్రయత్నం చేశాడు అన్నారు అల్లరి నరేష్
ఏయ్ బయిటకు ఫో
‘ఏయ్ బయటికి వెళ్లు. ఇది ఫోటో తీసుకునే సమయమా'' అని కోప్పడ్డాను. దానికీ కొందరు నన్ను విమర్శించారు. నటులకు కోపతాపాలు, వ్యక్తిగత జీవితం ఉండదా? దానికి మీరు విలువ ఇవ్వరా? అంటూ ఆవేదనగా మాట్లాడారు అల్లరి నరేష్ .
ఆ సమయంలో నా మనస్తత్వం
నా ఫెయిల్యూర్స్ నుంచి నేను ఏమీ నేర్చుకోలేదు. మా నాన్న ఫెయిల్యూర్స్ నుంచి నేను నేర్చుకున్నదే ఎక్కువ. ఒకప్పుడు మా నాన్నకు హిట్లు వచ్చినప్పుడు ఇదే ఇంటి ముందు ఇరవైనాలుగు కార్లు ఉండేవి. ఫ్లాప్లు వచ్చినప్పుడు రెండు కార్లు కూడా లేని పరిస్థితులి చిన్న వయసులోనే చూశాను. అవన్నీ నాకు పాఠాలు నేర్పించాయి. కాబట్టి విజయాన్ని తలకెక్కించుకోను. అపజయం వచ్చినప్పుడూ కుంగిపోను. ఫలితాలను బట్టి నా బిహేవియర్ మారదు. అల్లరి నరేష్ ఎప్పటికీ ఒకేలా ఉంటాడు. అదే నా బలం.
బాధ మాత్రం మిగిలిపోయింది
‘లడ్డుబాబు' ఆశించినంత రిజల్టు రాలేదు. మీరు నమ్మరు. భయంకరమైన కష్టం అది. అంతచేసినా గుర్తింపురాలేదన్న బాధ మాత్రం మిగిలిపోయింది. ‘ధూమ్'లో హృతిక్రోషన్కు మేకప్ చేసిన మైక్ నాకు మేకప్ చేశాడు. ఉదయం 32 కిలోల మేకప్ వేసుకుని షూటింగ్లో కూర్చునేవాణ్ణి. కొత్తగా డిఫరెంట్గా చేయాలని అందరూ అంటుంటారు.. అందుకనే ‘లడ్డుబాబు' చేశాను. ఎలాంటి సినిమాలు చేయాలో ఒక్కోసారి అర్థం అవ్వదు అన్నారు.
అందుకే వర్కవుట్ కాలేదు
ఒక డిస్టిబ్యూటర్ నా వద్దకు వచ్చి ‘‘సార్, మీరున్నారని మీ సినిమాకు ప్రేక్షకులు వచ్చారు. కానీ ‘లడ్డుబాబు'లో మీ రూపం కనిపించడం లేదు. కేవలం మీ వాయిస్ మాత్రమే వినిపిస్తోందని.. డిజప్పాయింట్ అవుతున్నారు'' అన్నారు. ఎనభైశాతం మేకప్ వల్ల, కేవలం ఇరవైశాతం నేను కనిపించాను. అది వర్కవుట్ కాలేదు.
నాకు ఇష్టమే లేదు
నా సినిమాల్లో పేరడీలు ఎక్కువైపోతున్నాయన్న మాట వినిపిస్తోంది. అసలు నాకు పేరడీల మీద ఆసక్తి లేదు. చిన్నప్పటి నుంచి నన్ను ‘హాట్షాట్స్' అనే ఆంగ్ల చిత్రం ఎంతో ప్రభావితం చేసింది. సద్దాం హుస్సేన్, జార్జిబుష్ ల మీద వచ్చిన పేరడీ చిత్రం అది. ఎప్పుడైనా అలాంటి పేరడీ చేయాలన్న చిన్న కోరిక ఉండేది.
అంత దారణం అయ్యిపోయింది
‘తమిళ్పడం' అనే చిత్రాన్ని తెలుగులో ‘సుడిగాడు' పేరుతో తీశాం. అందులో పేరడీ సన్నివేశాలు కొన్ని పెట్టాల్సి వచ్చింది. ఆ తరువాత వచ్చిన సినిమాల్లో పేరడీల జోలికే వెళ్లలేదు. చాన్నాళ్ల తరువాత ‘జంప్ జిలానీ', ‘సెల్ఫీరాజా'లలో పేరడీ కనిపించింది. ఆఖరికి రెండు గంటల సినిమాలో కేవలం రెండే రెండు నిమిషాల పేరడీ గురించే మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. ఎందుకీ అభిప్రాయం వచ్చిందంటే.. ప్రేక్షకుల మైండ్లో ‘సుడిగాడు' ఉండిపోయింది.
విసుగొచ్చి జనాలు తిట్టుకునేదాకా..
ఈ మధ్యలో ఏమైందంటే టీవీల్లో ఎక్కడ చూసిన పేరడీలే పేరడీలు. ఆ జోరు మిగిలిన నటుల సినిమాల్లోను దూసుకొచ్చింది. ఆఖరికి పేరడీలను చూసి విసుగొచ్చి జనాలు తిట్టుకునే వరకు వెళ్లింది. ఈ తతంగం మొత్తాన్ని నా మీద వేసి.. ‘అల్లరి నరేష్ అనగానే పేరడీ సినిమాలు' అన్న ప్రచారం జరిగిపోయింది.
డిసైడ్ అయ్యా..ఇక చెయ్యద్దని
ఇక పేరడీల జోలికి వెళ్లొద్దని ఈ మధ్యనే నిర్ణయించుకున్నా. అసలు నేను ఒక హీరోను అనుకరించి పేరడీలు చేయడమెందుకు. నాకంటూ ఒక బాడీ లాంగ్వేజ్ ఉంది. నటించే నైపుణ్యం ఉంది. పేరడీ చేస్తే నన్ను నేను తగ్గించుకోవడమే అని తెలుసుకున్నా. యాక్టింగ్ స్కూల్లో చెప్పిన ‘ఇమిటేషన్ ఈజ్ నాట్ యాక్టింగ్' ఇప్పటికి తెలి సొచ్చింది అన్నారు అల్లరి నరేష్.
అలా అందరూ అన్నారనే..
ఈ మధ్య వస్తున్న నా సినిమాల పట్ల నేను రివ్యూ చేసుకుంటున్నాను. కొన్ని చేసిన సినిమాలే మళ్లీ చేసినట్లు నాక్కూడా అనిపించింది. కొన్ని తప్పులు కూడా జరిగాయి. ఎందుకిలా జరిగిందని మళ్లీ వెనక్కి వెళితే - ‘సుడిగాడు' హిట్ అయ్యాక.. ‘మీరు ఇంకా నవ్వించాలి.. ఇంకా నవ్వించాలి' అన్నారందరూ.
ఆ ప్రెజర్ లోనే ప్లాఫ్ లు
అంతకుముందు నా చిత్రాల్లో ఎంత కామెడీ ఉన్నప్పటికీ కాసింత సెంటిమెంటు, ఆసక్తి కలిగించే కథ ఉండేవి. ‘సుడిగాడు' అనంతరం సినిమా మొత్తం కామెడీనే ఉండాలన్న ప్రెజర్ నా మీద పడింది. రెండు మూడు సినిమాలు అయ్యాక ‘ఇదివరకు కథల్లో కామెడీ ఉండేది, ఇప్పుడు మనం కథ కోసమే కామెడీ రాస్తున్నట్లు అనిపిస్తోంది' అంటూ దర్శకుల వద్ద నా అభిప్రాయాన్ని వ్యక్తం చేశాను.
ఏడుపు వద్దంటున్నారనే...
‘మీ సినిమాల్లో ఏడుపు సీన్లు వద్దు సార్, నవ్వడానికే మీ సినిమాలు చూస్తారు'' అన్నారు. అన్ని భావోద్వేగాలు ఉంటూనే హాస్యానికి ప్రాముఖ్యం ఉండాలి. అప్పుడే ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. ‘గమ్యం'లో నా పాత్ర చివరికి విషాదంతో ముగుస్తుంది. అయినా అందులోని హాస్యం జనాలకు గుర్తుండిపోయింది కదా! ఇవన్నీ పరిగణలోకి తీసుకుని కథలో కామెడీ ఉండాలి కానీ.. కామెడీ కోసం కథ ఉండకూడదు అని ఫిక్స్ అయ్యాను.
పెద్ద హీరోలు కి మాకూ అదే తేడా
పెద్ద హీరోలు ఎంటర్టైన్మెంట్తో హాస్యం పంచుతున్నప్పటికీ.. వాళ్లు ఫైట్లు చేయాలి. స్టార్ ఇమేజ్ డైలాగులు చెప్పాలి. డ్యాన్సులు చేయాలి.. ఇవన్నీ చేస్తూనే కామెడీ కూడా చేయాలి. మాలాంటి కమేడియన్ల దగ్గరికి వచ్చేసరికి అవన్నీ చేసినాసరే.. అన్నిట్లోను అండర్లైన్గా కామెడీ తప్పనిసరి. హీరోయిజంకంటే నవ్వించడమే మా పెద్ద పని అయినప్పుడు ఇదొక పెద్ద సవాలే!.
జనాలకు బోర్ వచ్చేసింది
అవే జోకులు, అవే పంచ్డైలాగులు, అవే పేరడీలు..రిపీట్ చేస్తే మాత్రం జనాలకు బోర్ కొడుతుంది. సోషల్మీడియా, వాట్స్పలలో పొద్దున్నే జోకులతోనే గుడ్మార్నింగ్లు మొదలువుతున్నాయి. ఒకప్పటి బుక్జోకులకు కాలం చెల్లింది. నలుగురు మిత్రులు కూర్చున్నప్పుడు నాలుగు మాటలు మాట్లాడి నవ్వుకున్నట్లే.. సినిమాలూ ఉండాలనుకునే జనరేషన్ వచ్చిందిప్పుడు.
భాష, శైలి మారిపోయింది
కృత్రిమ హాస్యం ఎబ్బెట్టుగా తోస్తోంది. ఒకప్పటి హాస్యానికి కించిత్తు గ్రాంథికమో, ఒక చిన్న ప్రాసనో తోడయ్యేది. ఇప్పుడా భాష, శైలి మారిపోతున్నాయి. శ్రీకాకుళం యాసలో షకలక శంకర్, నెల్లూరు యాసలో సప్తగిరి.. ఇలా కామెడీలోను కొత్త మేనరిజంలను ప్రెష్గా ఫీలవుతున్నారు. అలాంటి స్థానిక యాసల్లో వచ్చే హాస్యానికి ప్రేక్షకులు త్వరగా కనెక్ట్ అవుతున్నారు.
పార్టీలకు వెళ్లను
నైట్ పార్టీలకు వెళ్లడం నాకు ఇష్టం వుండదు. అందుకే నేను ఎక్కువగా పార్టీల్లోనూ, పబ్బుల్లోనూ కనిపించను. నా ఫ్రెండ్స్తో... కుటుంబ సభ్యులతోనే ఎక్కువగా విరామ సమయాన్ని ఎంజాయ్ చేస్తుంటాను.
నాకు అదే బాధ కలిగిస్తోంది
ఇటీవల నేను నటించిన చిత్రాలు నిర్మాతలకు, పంపిణీదారులకు మంచి లాభాల్ని అందించాయి. అయితే అవి ఫ్లాప్ సినిమాలని అంతా ప్రచారం చేస్తున్నారు. అది నాకు బాధను కలిగిస్తోంది. ఏ హీరో ఫ్లాప్ సినిమాలు చేయాలని సినిమా మొదలు పెట్టడు. హిట్టు కొట్టాలనే ప్రతీ హీరో సినిమా చేస్తాడు. మంచి రోజు, మంచి ముహూర్తం చూసి పెద్దల చేతుల మీదుగా ప్రారంభించి అన్నీ బాగుండాలనే చేస్తాం. సినిమా ప్రారంభానికి ముందు ‘ఇది ఫ్లాప్' అని ఎవరూ కొబ్బరికాయ కొట్టరు కదా. అలాగే నేను కూడా.
డబుల్ మీనింగ్ డైలాగులు వద్దు
నా సినిమా చూడటానికి థియేటర్కు వచ్చే ప్రేక్షకులు ‘వీడి సినిమాకు వస్తే ఎలాంటి వల్గారిటీ వుండదు' అని చెప్పుకోవాలి. ఇకపై అలాంటి సినిమాలకే ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటున్నాను. ద్వంద్వార్థాలు లేని కామెడీ చిత్రాలు చేయాలనుకుంటున్నాను.
అది వరం, శాపం
సోషల్ మీడియా ఒక విధంగా వరం...మరో విధంగా శాపం. సోషల్ మీడియాలో స్పెండ్ చేయడం ఎక్కువై పోయిన తరుణంలో జనం ఎవరిని తిట్టాలో వారిని డైరెక్ట్గా తిట్టేస్తున్నారు. సాంకేతికత పెరగడం వల్ల లాభం వుంది...అదే సమయంలో నష్టమూ వుంది. సెలబ్రిటీలు దేవుళ్లు కాదు. ఏదైనా మాట్లాడాలన్నా..ట్వీట్ చేయాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాల్సి వస్తోంది.
అనారోగ్య సమస్యలు వచ్చాయి
‘మడత కాజా'తోపాటు తమిళచిత్రం ‘పోరాలి' కోసం నిరవధికంగా 76 గంటలు పనిచేశాను. దానివల్ల చాలా అనారోగ్య సమస్యల్ని ఎదుర్కొన్నాను. కానీ ఏ రోజూ ఇన్ని గంటలు తీరిక లేకుండా వరుస షూటింగ్లలో పాల్గొన్నానని ఎవరికీ చెప్పలేదు. ఇప్పుడు ఎందుకు చెబుతున్నాను అంటే ఈ మధ్య అరగంట లేట్గా వచ్చినా నేను సమయానికి రానని ప్రచారం చేస్తున్నారు. ఇలాంటివి విన్నప్పుడు బాధగా వుంటుంది.
ఇలాంటి ప్రచారం ఎలా చేస్తున్నారో
ఈ మధ్య నేను టైమ్ సెన్స్ పాటించడం లేదని ప్రచారం జరుగుతోంది. ఇన్నే ఏళ్ల ప్రయాణంలో నేను సమయపాలన పాటించకపోతే 52 చిత్రాలు పూర్తి చేసేవాడినే కాదు. దీన్నిబట్టే ఒక్కో సినిమాను నేను ఎంత ఫాస్ట్గా పూర్తి చేశానో అర్థం చేసుకోవచ్చు. ప్రొడక్షన్ వల్ల సినిమా ఆలస్యమైతే దాన్ని నా మీద రుద్దేస్తున్నారు.
నేను మొదట నమ్మలేదు
చెన్నయ్లోని మా ఇంట్లోనే అప్పట్లో డైరక్టర్ రవిబాబు ఆఫీసు పెట్టుకున్నారు. ఒకసారి చెన్నయ్ వెళ్ళినప్పుడు రవిబాబును కలిశాను. కాసేపు పిచ్చాపాటి మాట్లాడాక 'నరేష్ నిన్ను హీరోగా పెట్టి సినిమా తీస్తాను' అన్నారు. ఆయన సీరియస్గానే అన్నా నేను మాత్రం సీరియస్గా తీసుకోలేదు. అయితే ఆ మాట విన్నపుపడు మాత్రం నేను చాలా హ్యాపీ ఫీలయ్యాను. నన్ను హీరోగా పెట్టి సినిమా తీస్తానని అనడం నాకు సంతోషాన్నిచ్చింది. ఇది 1999లో జరిగింది.
లిటరల్ గా షాక్
2002లో ఇప్పటికీ నాకు బాగా గుర్తు. ఆరోజు జనవరి 22, ఉదయం 8 గంటలకు రవిబాబు నుంచి ఫోన్ వచ్చింది. నరేష్ నీకున్న డ్రస్సుల్లో ఓ పది మంచి డ్రెస్లు తీసుకుని రామానాయుడు స్టూడియోకి వచ్చేయ్ అన్నారు. అప్పుడు కూడా నేనేమీ ఎగ్జయిట్ అయిపోలేదు. చాలా క్యాజువల్గానే తీసుకుని ఓ పది డ్రస్లతో స్టూడియోకు వెళ్ళాను. ఫొటో సెషన్ చేశారు. 'నరేష్ రేపట్నుంచి షూటింగ్కు వచ్చేయ్' అన్నారు. నేను లిటరల్గా షాకయ్యాను. తర్వాత రవిబాబు నాన్నని కలిసి విషయం చెప్పారు.
రిస్క్ తీసుకోవద్దని నాన్న
చలపతిరావుగారితో నాన్నకున్న స్నేహం దృష్ట్యా రవిబాబు కెరీర్ పాడవుతుందేమోనని నన్ను హీరోగా తీసుకోవడం రిస్క్ అని వాదించారు. అయితే రవిబాబు ససేమిరా అనడంతో నాన్న ఒప్పుకోక తప్పలేదు. కానీ నాన్నకు రవిబాబు మీద చాలా నమ్మకముండేది. అతనిలో మంచి విషయం ఉన్న విషయాన్ని అమెరికాలో కలిసినప్పుడే నాన్న గ్రహించారు. ఆవిధంగా అనూహ్యంగా 'అల్లరి' నా జీవితంలో సంభవించి చివరికి నా ఇంటిపేరుగా మారిపోయింది
మంచి రెస్పాన్స్ వచ్చింది
ప్రస్తుతం హారర్ కామెడీల జోరు నడుస్తున్న నేపథ్యంలో జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో 'ఇంట్లో దెయ్యం నాకే భయం' సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు. గతంలో జి.నాగేశ్వర రెడ్డి తో అల్లరి నరేష్ చేసిన సీమశాస్త్రి', 'సీమటపాకాయ్' చిత్రాలు మంచి విజయ సాధించాయి. దీంతో ఇంట్లో దెయ్యం నాకేం భయం సినిమాపై మంచి అంచనాలున్నాయి. బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.