మాట తప్పిన ఛార్మీ.. ఫైర్ అయిన యంగ్ హీరో.. హాట్ టాపిక్గా కోల్డ్వార్
చాలా కాలంగా సరైన హిట్ లేక సతమతపడుతున్నారు ఓ డైరెక్టర్.. ఓ హీరో కలిసి సినిమా చేశారు. దాని ఫలితంపై వాళ్లిద్దరే కాకుండా సినీ ఇండస్ట్రీ మొత్తం ఆసక్తికరంగా ఎదురు చూస్తోంది. ఇప్పటికే వాళ్లిద్దరు ఎవరో అర్థమై ఉంటుంది. అందులో ఒకరు డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాగా.. మరొకరు ఎనర్జిటిక్ స్టార్ రామ్. వీళ్లిద్దరి కలయికలో వచ్చిన చిత్రమే. 'ఇస్మార్ట్ శంకర్'. పూరి జగన్నాథ్ సొంత బ్యానర్ టూరింగ్ టాకీస్, సీనియర్ హీరోయిన్ ఛార్మీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో రామ్ సరసన నిధీ అగర్వాల్, నభా నటేశ్ నటిస్తున్నారు.
ఇప్పటికే నిర్మాణానంతర కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్న 'ఇస్మార్ట్ శంకర్' జూలై 18న ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఇప్పటికే విడుదలైన రామ్ లుక్, టీజర్, ట్రైలర్కు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో చిత్ర యూనిట్ హ్యాపీగానే ఉంది. ముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా జూలై 12న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ, ఇంగ్లండ్లో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ కారణంగా ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత అంటే జూలై 18న విడుదల చేస్తామని కొత్త తేదీని ప్రకటించింది చిత్ర యూనిట్.

ఇప్పుడిదే కోల్డ్వార్కు కారణం అయింది. వాస్తవానికి జూలై 12 'ఇస్మార్ట్ శంకర్' రిలీజ్ చేస్తామని చిత్ర బృందం ప్రకటించడంతో, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన 'రాక్షసుడు' 18న విడుదల చేయడానికి ఆ చిత్ర యూనిట్ సన్నాహాలు చేసుకుంది. అయితే, రామ్ సినిమా రిలీజ్ డేట్ 18కి మారడంతో, నిర్మాత ఛార్మీపై బెల్లంకొండ వారి అబ్బాయి ఫైర్ అయినట్లు తెలుస్తోంది. తమ సినిమా విడుదల రోజు 'ఇస్మార్ శంకర్' ఎలా రిలీజ్ చేస్తారంటూ గట్టిగానే వాదనకు దిగాడట ఈ యంగ్ హీరో.
ఈ విషయంలో ఛార్మీ చేతులెత్తేయడంతో చేసేదేం లేక తమ సినిమానే వాయిదా వేసుకుంది 'రాక్షసుడు' యూనిట్. తమిళంలో సూపర్ డూపర్ హిట్ అయిన 'రాచ్చసన్' చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేశారు. ఈ చిత్రాన్ని రమేష్ వర్మ డైరెక్ట్ చేశారు. ఇందులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తమ్ముడు సాగర్ సంభాషణలు అందించాడు. ఈ చిత్రం ఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











