తెలుగు సినీ పరిశ్రమపై అమలాపాల్ సంచలన వ్యాఖ్యలు
కథానాయిక అమలాపాల్ తెలుగు చిత్ర పరిశ్రమపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక్కడి సినీ పరిశ్రమ కొన్ని కుటుంబాల చేతిలో బందీ అయిందని వ్యాఖ్యానించారు. ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేయడంతో అది వైరల్ అవుతోంది. తెలుగులో అతి తక్కువ సినిమాలు మాత్రమే చేసిన అమలాపాల్ తాను అంత తక్కువ సినిమాలు చేయడానికి కారణాలను వివరించారు.

కొన్నికుటుంబాల చేతిలో బందీ
తెలుగు సినిమాల్లోకి అడుగు పెట్టిన సమయంలో తనకు ఒక విషయం బాగా అర్థమైందని, ఇక్కడి చిత్ర పరిశ్రమ కేవలం కొన్ని కుటుంబాల చేతిలోనే ఉందనే విషయం స్పష్టమైందన్నారు. ఆ కుటుంబాలు, వారికి చెందిన వ్యక్తులే పరిశ్రమపై ఆధిపత్యం చెలాయిస్తున్నారని, వారి ప్రతిసినిమాలోను ఇద్దరు కథానాయికలుంటారని, వారిని కేవలం గ్లామర్గాచూపించడానికి, ప్రేమ సన్నివేశాలకు, పాటలకే పరిమితం చేసేవారని ఆవేదన వ్యక్తంచేశారు. ఆ సినిమాలు కమర్షియల్గా ఉండేవని, అందుకే తాను తెలుగు పరిశ్రమకు దగ్గర కాలేకపోయినట్లు చెప్పారు. నటనకు ప్రాధాన్యమున్న సినిమాలకే తాను ఎక్కువ ప్రాధాన్యతనిచ్చినట్లు తెలిపారు.

తమిళ సినిమాతో కెరీర్ అనేది నా అదృష్టం
తమిళ సినిమాతో తన కెరీర్ ప్రారంభం కావడాన్ని తన అదృష్టంగాభావిస్తున్నానన్నారు. ఆడిషన్స్, మీటింగ్స్ వంటి వాటితో ఇబ్బందులు ఎదుర్కొన్నానని, కెరీర్ ప్రారంభంలో తాను చేసిన రెండు సినిమాలు ఇప్పటికీ విడుదల కాలేదని తెలిపారు. తాను నటించిన మైనా చిత్రం సంచలనం సృష్టించిందని, తర్వాత ఆఫర్లు వరుసగా వచ్చాయన్నారు. తెలుగులో అమలాపాల్ నాయక్, లవ్ ఫెయిల్యూర్, జెండాపై కపిరాజు, ఇద్దరమ్మాయిలతో వంటి సినిమాల్లో నటించారు. చివరిగా పిట్టకథలులో నటించారు. తాజాగా అమలాపాల్ సినిమా కడవర్ ఓటీటీలో విడుదలైంది.

ఎవరిని ఉద్దేశించి చేసిందో స్పష్టమవుతోంది
అమలాపాల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఎవరిని ఉద్దేశించి, ఏ కుటుంబాలను ఉద్దేశించి చేసిందనే విషయం స్పష్టంగానే అర్థమవుతోందని,ఇది అందరికీ తెలిసిన విషయమేనని వ్యాఖ్యలు వినపడుతున్నాయి. అమలాపాల్ చేసిన వ్యాఖ్యల్లో ఎటువంటి తప్పు లేదని, ఉన్న విషయాన్ని ఆమె స్పష్టంగానే చెప్పిందని, తనకు తెలిసిన విషయాన్ని నిర్భయంగా చెప్పే ధైర్యం కూడా అందరికీ ఉండదని, కానీ అమలాపాల్ మాత్రం తెలియజేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.


Click it and Unblock the Notifications











