పెళ్లైన క్రేజ్ అసలు తగ్గట్లేదుగా.. రష్మిక ఖాతాలో మరో అరుదైన రికార్డు
పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక మందన్న (Rashmika Mandanna) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అభిమానులు ఆమెను ప్రేమగా "నేషనల్ క్రష్" అని పిలుస్తుంటారు. తన అందం, నటన, స్క్రీన్ ప్రెజెన్స్తో దేశవ్యాప్తంగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ స్టార్ హీరోయిన్ ఇటీవల వ్యక్తిగత జీవితంలోనూ కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. చాలా కాలంగా నటుడు విజయ్ దేవరకొండతో ప్రేమలో ఉన్న రష్మిక, ఈ ఏడాది కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ఇక కెరీర్ పరంగా కూడా ఆమె వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఇటీవలే ఉత్తమ నటిగా గద్దర్ ఫిల్మ్ అవార్డును అందుకుని తన ప్రతిభను మరోసారి చాటుకుంది. ఇదిలా ఉండగా, తాజాగా రష్మిక అంతర్జాతీయ స్థాయిలో మరో గౌరవాన్ని సొంతం చేసుకోవడం విశేషంగా మారింది. ఇంతకీ ఆ గౌరవం ఏంటీ?
నేషనల్ క్రష్ రష్మిక మందన్న కు మరోసారి అరుదైన అవకాశం దక్కింది. అంతర్జాతీయ వేదికపై భారత గౌరవాన్ని చాటారు. జపాన్లో జరిగే ప్రతిష్టాత్మక క్రంచీరోల్ యానిమే అవార్డ్స్ (crunchyroll anime awards 2026)లో కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ పురస్కారాల వేడుకకు ఆమె ప్రెజెంటర్గా హాజరు కానుండడం ఇది రెండోసారి. ఇప్పటికే 2024లో ఈ వేదికపై తన అందం, స్టైల్తో మెరిసిన రష్మిక... ఇప్పుడు మళ్లీ అదే స్టేజ్పై కనిపించబోతుండటం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముఖ్యంగా ఈ అవార్డ్స్లో రెండుసార్లు ప్రెజెంటర్గా వ్యవహరించిన తొలి భారతీయ సినీ సెలబ్రిటీగా రికార్డు సృష్టించారనే చెప్పాలి.

ఈసారి క్రంచీరోల్ యానిమే అవార్డ్స్ 10వ ఎడిషన్ మే 23న జపాన్ రాజధాని టోక్యోలో అంగరంగ వైభవంగా జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా యానిమేటెడ్ సినిమాలు, వెబ్ సిరీస్లలో ప్రతిభ కనబరిచిన కళాకారులను గౌరవించే ఈ వేడుకకు ప్రత్యేక స్థానం ఉంది. హాలీవుడ్ ప్రముఖులతో పాటు వివిధ దేశాలకు చెందిన కళాకారులు ఈ ఈవెంట్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా రష్మిక కూడా ప్రెజెంటర్గా వేదికపైకి వెళ్లి విజేతలకు అవార్డులు అందజేయనున్నారు.
రష్మికకు జపాన్లో పెరుగుతున్న క్రేజ్ ఈ అవకాశానికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. ముఖ్యంగా 'పుష్ప' సినిమాలో ఆమె పోషించిన 'శ్రీవల్లి' పాత్ర అక్కడి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో కూడా జపాన్ అభిమానులు ఆమెకు పెద్ద సంఖ్యలో ఫాలో అవుతున్నారు. భారతీయ నటీమణుల్లో జపాన్ మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు పొందిన వారిలో రష్మిక ముందంజలో ఉన్నారు.
నీ సైజు ఎంతో చెప్పు.. నెటిజన్కు స్టార్ హీరోయిన్ షాకింగ్ రిప్లై
ఇక సినిమాల విషయానికి వస్తే, రష్మిక ప్రస్తుతం వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. 'మైసా', 'రణబలి' వంటి సినిమాల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలు కూడా పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతుండటంతో, ఆమె కెరీర్ మరింత ఎత్తుకు చేరే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ముఖ్యంగా కమర్షియల్ సినిమాలతో పాటు విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ తన నటనను నిరూపించుకుంటోంది. ఇప్పటికే టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించిన రష్మిక... ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో కూడా తన గుర్తింపు అందుకుంటున్నారు.


Click it and Unblock the Notifications

















