శంఖం సినిమా యాక్షన్ డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో గోపీచంద్, త్రిష, సత్యరాజ్, కోటా శ్రీనివాసరావు, తెలంగాణా శకుంతల, ఆలీ, చంద్రమోహన్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, వేణుమాధవ్, ఎల్బీ శ్రీరామ్, కృష్ణ భగవాన్, బెనర్జీ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ, స్ర్కీన్-ప్లే, దర్శకత్వం: శివ నిర్వహించారు మరియు నిర్మాతలు జె భగవాన్, జె పుల్లారావు కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు తమన్ స్వరాలు సమకుర్చారు.
కథ
కథ విషయానికొస్తే చందు(గోపీచంద్) తన మామయ్య(చంద్రమోహన్)తో కలసి ఆస్ర్టేలియాలో వుంటాడు. చందుకు తన తల్లిదండ్రులు మరణించారని చెప్పుంటాడు వాళ్ల మామయ్య. కానీ చందు తండ్రి రాయలసీమ శివన్న(సత్యరాజ్) మాత్రం బతికేవుంటాడు. ఇదిలా వుంటే చందు పెళ్లికి పిల్లను వెతికే పనిలో వుంటాడు వాళ్ల మామయ్య. ఇలా అమ్మాయిని వెతుకుతున్న క్రమంలో మహాలక్ష్మి(త్రిష) ని తొలిచూపులోనే ప్రేమిస్తాడు చందు. కానీ మహాలక్ష్మి చందుని ప్రేమించదు. ఎన్నో ప్రయత్నాలు చేసి చివరికి మహాలక్ష్మి కూడా తనని ప్రేమించేలా చేస్తాడు చందు. మహాలక్ష్మి తన ప్రేమ విషయాన్ని చందుకి చెప్పాలనుకున్నప్పుడే మహాలక్ష్మి అత్తయ్య(తెలంగాణా శకుంతల) ఆస్ట్రేలియా వచ్చి తన తనయుడి(వేణుమాధవ్)కి ఇచ్చి పెళ్లి చేయాలని మహాలక్ష్మిని బలవంతంగా ఇండియాకు తీసుకెళ్తుంది. విషయం తెలుసుకున్న చందు మహాలక్ష్మి కోసం ఇండియాకు వస్తాడు.
ఇదిలా వుంటే ఫ్లాష్ బ్యాక్ లో పశుపతి(కోటా శ్రీనివాసరావు)కి, శివన్నకు వైరం వుంటుంది. పశుపతి పేద ప్రజల భూములు లాక్కుని, వారి చేత వెట్టిచాకిరీ చేయిస్తుంటాడు. దీనికి శివన్న అడ్డు పడటమే కాకుండా పశుపతిని జైలుపాలు చేస్తాడు. దీంతో శివన్న పై పగ పెంచుకున్న పశుపతి శివన్న కవల పిల్లల్లో ఒకరిని, ఆయన భార్య(సీత)ని చంపేస్తాడు. దీంతో శివన్న భార్య తనకున్న ఒక్క కొడుకుని తన అన్నయ్య(చంద్రమోహన్)కు అప్పజెప్పి తనని ఇక్కడి నుండీ దూరంగా తీసుకెళ్లమని చెప్పి కన్నుమూస్తుంది. దీంతో ఆమె అన్నయ్య ఆ పిల్లాన్ని తీసుకొని ఆస్ట్రేలియా వచ్చేస్తాడు. అలా పెరిగిన పిల్లాడే చందు.
ఇక చందు ప్రేమించిన మహాలక్ష్మి పశుపతి కూతురే. చందు శివన్న కొడుకేనని తెలిసిన పశుపతి చందుకి తన కూతురుని ఎర చూపి శివన్నపై ఉసిగొల్పుతాడు. శివన్న తన తండ్రి అన్న విషయం తెలియని చందు అతని పై దాడి చెయ్యబోయి ఖంగుతింతాడు. కానీ చందుని చూసిన శివన్న చందు తన కొడుకేనని తెలుసుకొని ఆసుపత్రిలో చేర్పిస్తాడు. ఆ తర్వాత తన మామయ్య ద్వారా అసులు విషయం తెలుసుకున్న చందు తన తల్లిని హతమార్చిన పశుపతి, అతని తమ్ముడిని అంతమొందించాలని ప్రయత్నిస్తుంటాడు. ఈ ప్రయత్నంలో శివన్నను కూడా హతమారుస్తారు పశుపతి మనుషులు. ఇక మిగిలిన కథ చందు పశుపతిని ఎలా అంతమొందిచి, తన ప్రేమను గెలిపించుకున్నాడనేది...మిగతా కథ.