పూరిపై దాడి కేసు: ‘లోపర్’ డిస్ట్రిబ్యూటర్ల వాదన మరోలా...
హైదరాబాద్: సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్ ఇటీవల తనపై దాడి జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. 'లోఫర్' సినిమాతో నష్టపోయామంటూ అభిషేక్, ముత్యాలు, సుధీర్ అనే ముగ్గురు డిస్ట్రిబ్యూటర్లు పూరీ ఇంటి గలాటా సృష్టించినట్లు వార్తలు వినిపించాయి.
అయితే తాము దాడి చేశామని వస్తోన్న వార్తలు అవాస్తవమని డిస్ట్రిబ్యూటర్లు అభిషేక్, సుధీర్, రాంధాస్ తెలిపారు. సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పూరీ ఇంటి కెళ్లినట్లు, ఫోన్లో మాట్లాడినట్లు ఆధారాలేమీ లేవని పేర్కొన్నారు. తాను ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్....నేనెలా దాడి చేస్తాను అంటూ ముగ్గురిలో ఒకరు వ్యాఖ్యానించారు. పూరిపై దాడి చేయాల్సిన అవసరం తమకేముందని ప్రశ్నించిన వారు....తప్పుంటే తమపై చర్యలు తీసుకోవాలని వ్యాఖ్యానించారు.

అవనసరంగా తమపై తప్పుడు కేసులు పెట్టారని, పూరి ఇంటి వద్ద, ఆఫీసు వద్ద సీసీ కెమెరాలు పరిశీలిస్తే నిజా నిజాలు బయట పడతాయని అన్నారు. తమపై వస్తోన్న ఆరోపణలపై క్లారిటీ ఇద్దామనే మీడియా ముందుకు వచ్చినట్లు పేర్కొన్నారు.
పూరి ఫిర్యాదు మేరకు కేసు...
డిస్ట్రిబ్యూటర్లు తనపై దాడి చేసిన విషయంపై పూరి జగన్నాథ్ హైదరాబాదులోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో వారిపై 323, 506, 384 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. లోఫర్ సినిమాలో నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ హీరోగా నటించాడు. హీరోయిన్గా దిశా పటానీ నటించింది. ఈ సినిమా నిరుడు డిసెంబర్లో భారీ అంచనాలతో విడుదలైంది. అయితే, బాక్సాఫీస్ వద్ద మాత్రం బోల్తా కొట్టింది.


Click it and Unblock the Notifications











