డబ్బులిస్తామని ప్రకటించండి.. అలా అయితేనే! ప్రధాని మోదీకి పూరి జగన్నాథ్ బహిరంగ లేఖ
భావితరాల బాగోగులు ఆలోచించి పర్యావరణ కాలుష్యం కాకుండా పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటోంది భారత ప్రభుత్వం. ఇందులో భాగంగా ప్లాస్టిక్ వాడకానికి చరమగీతం పాడేలా చర్యలు చేపట్టారు ప్రధాని మోదీ. ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. అయితే ఇదే విషయమై తనదైన స్టైల్లో భారత ప్రధాని మోదీకి పలు సూచనలిస్తూ బహిరంగ లేఖ రాశాడు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. ప్రస్తుతం ఈ లేఖ నెట్టింట వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ లేఖలో ఏముంది? వివరాల్లోకి పోతే..

ఎర్రకోట వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ..
పర్యావరణానికి తీవ్ర హానికరంగా మారిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిద్దామని, భారత దేశాన్ని ప్లాస్టిక్ రహిత దేశంగా మార్చుదామని, ఇందుకు ప్రజలంతా సహకరించాలని ఇటీవల ఎర్రకోట వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు నిత్యం వాడే ప్లాస్టిక్ కవర్ల లాంటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తులపై నిషేధం విధిస్తూ చర్యలు తీసుకుంటున్నారు
ప్రధాని మోదీ.

ఎంటరైన పూరి జగన్నాథ్.. ఏకంగా బహిరంగ లేఖ
తాజాగా ఈ విషయమై డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనదైన కోణంలో స్పందించడం ఆసక్తికరంగా మారింది. కేవలం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నిషేధించినంత మాత్రాన పర్యావరణ కాలుష్యాన్ని పూర్తిగా అరికట్టలేమని పేర్కొంటూ భారత ప్రధాని మోదీకి బహిరంగ లేఖ రాశాడు పూరి జగన్నాథ్. ఈ లేఖ ద్వారానే పలు సూచనలు కూడా ఇచ్చాడు.

సమస్య తీవ్రంగానే ఉంది.. అయినప్పటికీ
నేటి సమాజంలో పర్యావరణాన్ని ప్రభావితం చేస్తున్న అంశాలు చాలా ఉన్నాయని, ప్రస్తుతం వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మాత్రమే కారణం కాదని పూరి అంటున్నాడు. వాతావరణ మార్పు అనేది ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న తీవ్ర సమస్య అయినప్పటికీ, కేవలం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం కారణంగా ఆ సమస్యకు సరైన పరిష్కారం దొరకదని తన లేఖలో పూరి పేర్కొన్నాడు.

లాజిక్ బయటకు తీసిన పూరి
1960వ దశకంలో ప్లాస్టిక్ వాడకం బాగా పెరగడం వల్ల కాగితపు సంచుల వాడకం తగ్గి.. చెట్లు, అడవులను కొట్టేయడం తగ్గిందని, తిరిగి ఇప్పుడు ఒక్కసారిగా ప్లాస్టిక్ కవర్స్ బ్యాన్ ప్రకటిస్తే.. ప్రజలంతా ప్లాస్టిక్ను వదిలి పేపర్ బ్యాగులు వాడడం మొదలు పెట్టేస్తారని, దీని వల్ల పేపర్కు విపరీతమైన డిమాండ్ పెరుగుతుందని పూరి అన్నాడు. పేపర్కు పెరిగిన డిమాండ్ కారణంగా మళ్ళీ చెట్లను నరికే పరిస్థితి వస్తుందని తనదైన స్టైల్ లాజిక్ బయటకు తీశాడు పూరి.
ఇలా చేస్తే పరిస్థితి వేరేలా ఉంటుంది
చెట్లు నరకడం వల్ల పర్యావరణ సమతౌల్యత దెబ్బతినే ఛాన్స్ ఉంది. దీనికి పరిష్కారం ఒక్కటే ప్లాస్టిక్ రీ సైక్లింగ్ అంటున్నాడు ఈ డాషింగ్ డైరెక్టర్. ఒక్కసారి వాడిన ప్లాస్టిక్ ఎక్కడపడితే అక్కడ పడేయడం వల్లే అవి పర్యావరణానికి హానికరంగా మారుతున్నాయి.. కానీ వాటిని రీ-సైక్లింగ్ చేస్తే పరిస్థితి వేరేలా ఉంటుందని ఆయన అంటున్నాడు.

డబ్బులిచ్చేలా స్కీం తీసుకొస్తే..
ఈ సమస్యల నుంచి బయటపడాలంటే మొక్కలు ఎక్కువగా నాటాలని, అదేవిధంగా ప్రజలు ఒక్కసారి వాడిన ప్లాస్టిక్నే మళ్లీ మళ్లీ వాడేలా చర్యలు తీసుకోవాలని, దీనిపై అవగాహాన కల్పించాలని పూరి సూచించాడు. అంతేకాదు ప్రభుత్వం ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్లను ఏర్పాటు చేసి, వాడిన ప్లాస్టిక్ను తిరిగి ఇస్తే.. వాటికి డబ్బులు ఇస్తామని ఓ స్కీం పెడితే బాగుంటుందని ఆయన తన లేఖలో పేర్కొన్నాడు.


Click it and Unblock the Notifications











