అందరి జాతకాలు నా దగ్గర ఉన్నాయి.. త్వరలోనే బయటపెడతా: పూరీ షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్ ఎన్టర్జిటిక్ స్టార్ రామ్ - పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం 'ఇస్మార్ట్ శంకర్'. ఈ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. విడుదలైన రోజు నుంచి కలెక్షన్ల మోత మోగిస్తుంది. ఈ సినిమాకు మొదటి ఎనిమిది రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 63 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాతల్లో ఒకరైన సీనియర్ నటి ఛార్మీ కౌర్ వెల్లడించింది. ఈ సినిమాతో పూరీ మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. దీంతో అతడు ఖుషీగా ఉన్నాడు. తాజాగా ఆయన ఓ చానెల్కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశాడు.

నన్ను ఎన్నో సంఘటనలు బాధపెట్టాయి
తనను ఎన్నో సంఘటనలు బాధ పెట్టాయన్న పూరీ.. ‘నన్ను ఎన్నో సంఘటనలు బాధ పెట్టాయి. ఎంతో మంది నాపై రాళ్లు వేశారు. సినిమాలు ప్రొడ్యూస్ చేసినప్పుడు ఎంతో మంది, ఎన్నో రకాలుగా ప్రొడ్యూసర్లతో ఆడుకుంటారు. వాళ్లపై రాళ్లు వేస్తుంటారు. దీంతో వాళ్లు ఏడుస్తుంటారు. అది ఎవరికీ చెప్పుకోలేని బాధ. అన్ని యాంగిల్స్లో ఇబ్బందులకు గురి చేస్తుంటారు' అని చెప్పుకొచ్చాడు.

ప్రొడ్యూసర్గా చాలా కష్ట పడ్డాను
దర్శకుడిగా హ్యాపీగా ఉప్పటికీ ప్రొడ్యూసర్గా చాలా ఇబ్బందులు పడ్డానని పూరీ అన్నాడు. ‘నన్ను వ్యక్తిగతంగా ఎవరూ బాధించిన సంఘటనలు లేవు. ప్రొడ్యూసర్గా ఉన్నప్పుడు మాత్రం చాలా కష్ట పడ్డాను. అవి మామూలు కష్టాలు కావు. నేనిప్పటికి చాలా సినిమాలు ప్రొడ్యూస్ చేశాను. ఈ అనుభవంతోనే చెప్తున్నాను. ఈ కష్టాలు రోజు రోజుకూ పెరిగిపోతుంటాయి. ఎలాంటి నిర్మాతకైనా ఇది జరుగుతుంది' అని ఆయన పేర్కొన్నాడు.

సినిమా విడుదల అయ్యే సమయంలో ఎక్కువ
సినిమా రిలీజ్ దగ్గర పడిన కొద్దీ నిర్మాత టెన్షన్ ఎక్కువవుతుందని పూరీ జగన్నాథ్ వెల్లడించాడు. ‘సినిమా విడుదల అయ్యే సమయంలో అది ఆడుతుందా లేదా అని నిర్మాత టెన్షన్ పడుతున్నప్పుడు ఎంత మంది ఆడుకుంటారో చెప్పలేం. సినిమా ఆడితే నిర్మాతలకు కొంత రిలీఫ్ ఉంటుంది. ఆ తర్వాత ఇంకో సినిమా ప్రొడ్యూస్ చేసేటప్పుడు మాత్రం మామూలుగానే ఉంటుంది. ఒకవేళ సినిమా ఆడకపోతే కొత్త ప్రాబ్లమ్స్ పుట్టుకొస్తుంటాయి' అని తెలిపాడు.

నేను మారిపోయాను
రోజులు మారుతున్న కొద్దీ మనలో కూడా మార్పు వస్తుందన్న పూరీ.. ‘సమాజంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా నేను మారిపోయాను. పదేళ్ల క్రితం ఎలా ఉన్నామో ఇప్పుడు అలా ఉండం. ప్రపంచం ఎలా మారుతుందో.. మనం కూడా అలా మారడానికి ప్రయత్నిస్తాం. అయితే, చుట్టూ ఉన్న వాళ్లు నలుపుతుంటే తట్టుకోలేం' అని వెల్లడించాడు.

ఓ రోజు బయటపెడతా
ఇప్పటి వరకు తనను ఇబ్బందులకు గురి చేసిన వ్యక్తలు వివరాలు త్వరలోనే బయట పెడతానని పూరీ జగన్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘దీని గురించి ఒకసారి ప్రోగ్రామ్ ఉంది. ఆ సమయంలో బ్లాస్టింగ్ ఉంటుంది. ఎవరెవరు ఎలా ఆడుకున్నారో ఒకరోజు చెబుతాను. అందరి గురించి చెబుతాను. డిపార్ట్మెంట్లతో సహా వెల్లడిస్తాను' అని ఆయన బాంబు పేల్చాడు.


Click it and Unblock the Notifications











