మల్టీప్లెక్స్ లో టికెట్ ధర కేవలం రూ.75
ఇటీవలే సెప్టెంబరు 3వ తేదీని నేషనల్ సినిమా డేగా అమెరికా, బ్రిటన్ దేశాల్లో జరుపుకున్నారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని సినిమా టికెట్ ధరను 3 డాలర్ల దగ్గర ఫిక్స్ చేశారు. సాధారణంగా అక్కడ టికెట్ ధర 8 డాలర్ల వరకు ఉంటుంది. సినిమా డిమాండును బట్టి ప్రిమియర్ షోలకు 40 డాలర్ల ధర కూడా పెడతారు. అలాంటిది మల్టీప్లెక్సుల్లో మూడు డాలర్లకే టికెట్ పెట్టడంతో థియేటర్లకు ప్రేక్షకులు పోటెత్తారు. కార్తికేయ-2 నాలుగో వారం కూడా విదేశాల్లో హౌస్ ఫుల్స్తో నడవడానికి కారణం నేషనల్ సినిమా డే సందర్భంగా తగ్గించిన టికెట్ ధరలే కారణం.
ఇప్పుడు ఇండియాలో కూడా నేషనల్ సినిమా డేను జరపబోతున్నారు. సెప్టెంబరు 16న ముహూర్తం పెట్టారు. అన్ని మల్టీప్లెక్సుల్లో టికెట్ ధరను రూ.75 కి ఫిక్స్ చేశారు. కొన్ని రోజుల ముందే ప్రకటన రావడంతో సినీ ప్రియులు ఆ తేదీ కోసం ఎదురు చూశారు. కారణాలేమైనా కానీ సెప్టెంబరు 16 నుంచి 23కు వాయిదా వేశారు. ఆరోజు నేషనల్ సినిమా డే జరగబోతోంది. దేశవ్యాప్తంగా ఏ మల్టీప్లెక్స్ లోనైనా సినిమా టికెట్ ధర రూ.75. పైగా ఆరోజు శుక్రవారం కలిసొస్తుందని భావిస్తున్నారు. అవతార్-2 సినిమా కూడా అదేరోజు విడుదల కాబోతోంది. ఆ సినిమాను ఇప్పుడున్న అత్యాధునిక టెక్నాలజీతో రీమాస్టర్ చేసి విడుదల చేస్తున్నారు.

అంతేకాకుండా టికెట్ ధర కూడా రూ.75 కావడంతో ప్రేక్షకులు పోటెత్తే అవకాశం ఉందని, ఆరోజు విడుదలయ్యే చిత్రాలకు హౌస్ ఫుల్ పడే అవకాశం పుందని భావిస్తున్నారు.మల్టీప్లెక్స్ లతోపాటు సింగిల్ థియేటర్లలో కూడా టికెట్లు తగ్గించాలనే డిమాండ్ వస్తోంది. ఇండియాలో మల్టీప్లెక్స్ లకన్నా సింగిల్ స్క్రీన్స్ ఎక్కువగా ఉంటాయని, దీనివల్ల డిస్ట్రిబ్యూటర్లకు, నిర్మాతలకు కూడా లాభం కలుగుతుందని చెబుతున్నారు. మరి ఈ నిర్ణయాన్ని మల్టీప్లెక్స్ లకే పరిమితం చేస్తారా? లేదంటే సింగిల్ స్క్రీన్స్ కు కూడా వర్తింప చేస్తారా? అనేది తేలాలంటే కొద్దిరోజులు వేచిచూడక తప్పదు.


Click it and Unblock the Notifications











