Tollywood Drug Case: భారీగా హవాలా, మనీలాండరింగ్.. పూరీ జగన్నాథ్ విచారణకు రంగం సిద్ధం.. 62 మందిని..!
తెలుగు సినీ పరిశ్రమలో నాలుగేళ్ల క్రితం నాటి డ్రగ్స్ కేసు విచారణ మరోసారి ఊపందుకొన్నది. ఇప్పటికే ఈ కేసులో 12 మంది సెలబ్రిటీలను విచారించేందుకు సమన్లు జారీ చేయడం టాలీవుడ్ను కుదిపేసింది. ఆగస్టు 31వ తేదీ నుంచి వరుసు సినీ ప్రముఖులను విచారించడానికి తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు చెందిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిద్దమైంది. ఈ క్రమంలో మంగళవారం ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ను అధికారులు విచారించే అవకాశం ఉంది. ఈ డ్రగ్స్ కేసు విచారణకు సంబంధించిన విచారణలోకి వెళితే..

ముగ్గురు నిందితుల నుంచి వాగ్మూలం
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో రెండో విడుత విచారణ మంగళవారం ప్రారంభం కానుండటంతో దేశవ్యాప్తంగా దృష్టి తెలుగు సినిమా పరిశ్రమపై పడింది. ఈ కేసులో రాఫెల్ అలెక్స్ విక్టర్తో పాటు మరో ముగ్గురు నిందితుల వాగ్మూలాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు రికార్డు చేశారు. దాంతో వారిచ్చిన సమాచారం ఈ దర్యాప్తులో కీలకం కానున్నదనే విషయం చర్చనీయాంశమైంది.

అత్యాధునిక టెక్నాలజీతో పరీక్షలు
2017లో సిట్ అధికారులు సినీ తారల నుంచే కాకుండా మొత్తం 62 మంది అనుమానితుల నుంచి వెంట్రుకలు, చేతి వేళ్ల గోళ్ల శాంపిల్స్ను సేకరించి అత్యాధునిక టెక్నాలజీతో పరీక్షలు జరిపారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి వెంట్రుకల ఆధారంగా డ్రగ్స్ కేసు దర్యాప్తు చేపట్టారు. ఇలా వెంట్రుకల ద్వారా నిషేధిత మాదక ద్రవ్యాలు సేవించారా లేదా అనే విషయాన్ని దర్యాప్తు చేయడం ఇదే మొదటిసారి అని అధికారులు వెల్లడించారు.

ఆగస్టు 31వ తేదీన పూరీ జగన్నాథ్
టాలీవుడ్తో సంబంధమున్న డ్రగ్స్ కేసులో దర్శకుడు పూరీ జగన్నాథ్ను ఆగస్ట్ 31వ తేదీన విచారించనున్నారు. ఆ తర్వాత సెప్టెంబర్ 6వ తేదీన రకుల్ ప్రీత్ సింగ్, సెప్టెంబర్ 8 తేదీన రానా దగ్గుబాటి, సెప్టెంబర్ 9వ తేదీన రవితేజ, ముమైత్ ఖాన్ను సెప్టెంబర్ 15వ తేదీన విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు సమన్లు జారీ చేయడం తెలిసిందే. అయితే ఛార్మీ కౌర్ను కూడా విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసినట్టు సమాచారం. వీరిందరిని విచారించిన తర్వాత మరికొంత మంది నటీనటులకు సమన్లు జారీ చేసే ఆలోచనలో ఈడీ ఉన్నట్టు సమాచారం.

మొత్తం 62 మంది విచారణ
ఇదిలా ఉండగా, ఆగస్టు 31వ తేదీ నుంచి జరిపే విచారణ అనంతరం తాజాగా సమన్లు అందుకొన్న 12 మందిని కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టోరేట్ (ఈడీ) విచారించాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది. తెలంగాణ ఎక్సైజ్ అధికారులు ఇప్పటికే విచారించిన 50 మందితోపాటు మరికొందరికి కూడా సమన్లు జారీ చేసే అవకాశం లేకపోలేదనే మాట వినిపిస్తున్నది. ఈ దఫాలో మొత్తం 62 మందిని విచారించే అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నారు.

హవాలాతో భారీగా విదేశాలకు డబ్బు
తెలుగు సినీ పరిశ్రమలో పెధ్ద ఎత్తున్న హవాలా కుంభకోణం జరిగినట్టు తెలుస్తున్నది. డ్రగ్స్ వినియోగం వ్యవహారంలో పెద్ద ఎత్తున మనీ లాండరింగ్, ఫెమా ఉల్లంఘన జరిగినట్టు ఈడీ అధికారులు గుర్తించినట్టు సమాచారం. డ్రగ్స్ కోసం సినీ తారలు పెద్ద మొత్తంలో డబ్బును విదేశాలకు తరలించినట్టు ప్రాథమికంగా గుర్తించారు. కొన్ని నగదు వ్యవహారాలు అనుమానాస్పదంగా ఉన్నట్టు తెలుస్తున్నది.
వాటిపై ఈడీ అధికారులు ప్రశ్నించే అవకాశం ఉందని తెలుస్తున్నది. డ్రగ్స్ కొనుగోలు కోసం డ్రగ్ రాకెట్ ముఠాకు, సరఫరా దారులుకు హవాలా ద్వారా సినీ ప్రముఖులు డబ్బులు తరలించినట్టు ఈడీ దర్యాప్తులో తేలిందని అధికారులు నిర్ధారించినట్టు తెలిసింది.


Click it and Unblock the Notifications











