‘లోఫర్' టైటిల్ మార్చిన పూరి జగన్నాథ్
హైదరాబాద్: వరుణ్ తేజ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘లోఫర్' మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సి.కళ్యాణ్ నిర్మాత. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఫెమినా మిస్ ఇండియా 2013 రన్నరప్ దిషా పతాని ఈ చిత్రంలో వరుణ్ తేజ్ కి జోడీగా నటిస్తోంది. ఈ చిత్రానికి డిఫెరెంట్ టైటిల్ పెట్టానని చెప్తున్న పూరి జగన్నాథ్ ..తాజాగా టైటిల్ మార్చారని సమాచారం. లోఫర్ అనే టైటిల్ ని వద్దనకుని మా అమ్మ మహాలక్ష్మి అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు వినికిడి. ఈ విషయమై అతి త్వరలో అధికారికంగా ప్రకటన వచ్చే అవకాసం ఉంది. ఈ చిత్రంలో అమ్మ పాత్రలో రేవతి కనిపించనుంది.
పూరి జగన్నాధ్ మాట్లాడుతూ...సినిమాలోని కొన్ని సన్నివేశాలు చూసినప్పట్నుంచి పేరు మార్చమని రామ్గోపాల్ వర్మ, నిర్మాత సి.కల్యాణ్ నా బుర్ర తినేస్తున్నారు (నవ్వుతూ).అమ్మ బంధం చుట్టూ తిరిగే కథకి ఇలాంటి టైటిల్ ఏంటని అంటున్నారు అన్నారు.
పూరి జగన్నాథ్ మాట్లాడుతూ...'అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి' తర్వాత ఆ తరహాలో చేస్తున్న మరో సినిమా ఇది. అమ్మ సెంటిమెంట్ ఆధారంగా తెరకెక్కించా. చాలా రోజుల తర్వాత మళ్లీ ఓ సెంటిమెంట్ సినిమా చేయడం నాకే కొత్తగా, ఆసక్తికరంగా అనిపించింది. ట్విట్టర్లోనూ, అక్కడా ఇక్కడా చాలా మంది నన్ను పదే పదే అడిగేవాళ్లు... 'అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి' లాంటి సినిమా చేయరా? అని. ఈ సినిమాతో మళ్లీ అలాంటి ఓ మంచి కథ కుదిరింది. రచయితగా నాకు సంతృప్తినిచ్చిన కథ ఇది అని అన్నారు.

చిత్రం తన హీరో క్యారక్టరైజేషన్ గురించి మాట్లాడుతూ...ఇందులో హీరోకి పనీ పాట ఏమీ ఉండదు. కానీ చివరికి మంచివాడిలా మారతాడు. ఈ పేరు ఎందుకు పెట్టామో సినిమా చూశాక బాగా అర్థమవుతుంది అన్నారు.
వరుణ్ తేజ చాలా బాగా నటించాడు. తప్పకుండా మంచి హీరో అవుతాడు. నాగబాబుగారు గర్వపడేలా చేస్తాడు. నిజాయతీగా నటిస్తాడు. ఎంత పొడుగున్నా వరుణ్లో ఓ రకమైన అమాయకత్వం కనిపిస్తుంటుంది. ఆ అమాయికత్వం అతడి కెరీర్కి బాగా ఉపయోగపడుతుందని నమ్ముతున్నా అన్నారు.
ఇక రామ్గోపాల్ వర్మకి బంధాలు, అనుబంధాలు, సందేశాత్మక చిత్రాలు నచ్చవు. సెంటిమెంట్లంటే అసహ్యం, అలాంటి సినిమాలు నేను చేయనని చెబుతుంటారు వర్మ. కానీ ఈ సినిమాలోని సన్నివేశాలు చూశాక భావోద్వేగానికి గురయ్యారు. నన్ను ఎడిటింగ్ రూమ్లో నుంచి బయటికి పంపించేసి... అమ్మ మీద 30 సెకన్ల ఓ ప్రోమోని కట్ చేశారు. వర్మ అమ్మపై ప్రోమో కట్ చేయడం నాకే చిత్రంగా అనిపించింది. అది నాకు దక్కిన ఓ గొప్ప ప్రశంసగా భావించా.
ఈ చిత్రానికి సునిల్ కశ్యప్ సంగీతం అందించబోతున్నారు. బ్రహ్మానందం, రేవతి, పోసాని కృష్ణ మురళి తదితరులు ముఖ్య పాత్రలల్లో కనిపించనున్నారు. ఈ చిత్రంలో చరణ్ దీప్ విలన్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఆ మధ్య వచ్చిన కళ్యాణ్ రామ్ ‘పటాస్', రీసెంట్గా విడుదలైన విజయ్ ‘జిల్లా' చిత్రంలో ప్రతినాయకుడిగా అలరించిన చరణ్ దీప్ ప్రస్తుతం గబ్బర్ సింగ్ 2 చిత్రంలో కూడా నటిస్తున్నాడు. యాక్షన్ ఎంటర్ టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం మదర్ సెంటిమెంట్ కథాంశంగా రూపొందుతోందని టాక్.


Click it and Unblock the Notifications











