నిజం చెప్పే ధైర్యం నాకు లేదు.. జన నాయగన్ పై దర్శకుడు షాకింగ్ కామెంట్స్
తమిళ సినీ పరిశ్రమలోనే కాకుండా దేశవ్యాప్తంగా రాజకీయ, సినీ వర్గాల్లో అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తున్న సినిమా 'జన నాయగన్'. తమిళనాడు ముఖ్యమంత్రి, స్టార్ హీరో విజయ్ నటించిన చివరి సినిమా కావడంతో ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే విడుదలకు సిద్ధమై నెలలు గడుస్తున్నా ఇప్పటికీ సినిమా థియేటర్లలోకి రాకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో దర్శకుడు హెచ్. వినోద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త చర్చకు దారితీశాయి. అసలేం జరిగింది?
ఇటీవల దర్శకుడు పాండిరాజ్ తెరకెక్కిస్తున్న 'పరిమళ & కో' సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో డైరెక్టర్ హెచ్. వినోద్ను పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనను ఓ యాంకర్ 'జన నాయగన్ ఎప్పుడు విడుదలవుతుంది?' అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు వినోద్ ఇచ్చిన సమాధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. "ఆ విషయం నా చేతుల్లో లేదు. అసలు ఏం జరిగిందో చెప్పే ధైర్యం నాకు లేదు. ఒకవేళ నేను ధైర్యం చేసి చెప్పినా, మీరు దాన్ని బయటపెట్టే ధైర్యం చేయలేరు' అని ఆయన వ్యాఖ్యానించారు.

సాధారణంగా సినిమా విడుదల ఆలస్యంపై దర్శకులు లేదా నిర్మాతలు సాంకేతిక కారణాలు, పోస్ట్ ప్రొడక్షన్ పనులు లేదా సెన్సార్ ప్రక్రియల గురించి మాట్లాడటం చూస్తుంటాం. కానీ వినోద్ చేసిన వ్యాఖ్యలు మాత్రం సినిమా వెనుక మరేదో పెద్ద కథ దాగి ఉందనే అనుమానాలను మరింత పెంచాయి. ముఖ్యంగా ఆయన మాటల్లో రాజకీయ ఒత్తిళ్లు, సెన్సార్ వివాదాలు లేదా వ్యవస్థాగత అడ్డంకులపై పరోక్ష సంకేతాలు ఉన్నాయా అనే చర్చ మొదలైంది.
సెన్సార్ సర్టిఫికెట్ కోసం ఎదురుచూపులు
సమాచారం ప్రకారం 'జన నాయగన్' చిత్రం గత ఐదు నెలలుగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) క్లియరెన్స్ కోసం ఎదురుచూస్తోంది. మొదట ఈ సినిమాను 2026 జనవరి 9న పొంగల్ కానుకగా విడుదల చేయాలని నిర్మాతలు భావించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు విడుదలైతే సినిమాకు భారీ క్రేజ్ వస్తుందని అంచనా వేశారు. అయితే సెన్సార్ పరిశీలన సమయంలో సినిమాలోని కొన్ని సన్నివేశాలపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా మతపరమైన అంశాలు, సాయుధ దళాలు, రాజకీయ నేపథ్యం కలిగిన కొన్ని సన్నివేశాలపై అభ్యంతరాలు రావడంతో సినిమా రివైజింగ్ కమిటీకి వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో సర్టిఫికేషన్ ప్రక్రియ మరింత ఆలస్యమైంది. దాదాపు 5 నెలలుగా సెన్సార్ సర్టిఫికెట్ కోసం ఎదురుచూస్తున్నారు.
Karuppu Day 17 Collection: బాక్సాఫీస్ వద్ద కరుప్పు సునామీ.. సీఎం విజయ్ రికార్డును బ్రేక్ చేసిన సూర్య..
కోర్టుల వరకు వెళ్లిన నిర్మాతలు
సెన్సార్ ప్రక్రియలో జాప్యం పెరగడంతో నిర్మాత వెంకట్ కె. నారాయణ నేతృత్వంలోని కేవీఎన్ ప్రొడక్షన్స్ న్యాయపోరాటం కూడా ప్రారంభించింది. మొదట మద్రాస్ హైకోర్టును, ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కోర్టులు సానుకూలంగా స్పందించినప్పటికీ, తుది సర్టిఫికేషన్ ప్రక్రియ మాత్రం ఇంకా పూర్తికాలేదు. దీంతో సినిమా విడుదల తేదీ పదేపదే వాయిదా పడుతోంది. ఇప్పటికే సెన్సార్ సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సినిమాకు ఏప్రిల్లో మరో పెద్ద షాక్ తగిలింది. సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలు సోషల్ మీడియాలో లీక్ కావడం సంచలనం సృష్టించింది. ఈ కేసును తీవ్రంగా పరిగణించిన సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టి, ఒక అసిస్టెంట్ ఎడిటర్తో సహా పలువురిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన కూడా విడుదల ప్రక్రియపై ప్రభావం చూపినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.
సీఎం అయినా మారని పరిస్థితి
తమిళనాడు రాజకీయాల్లో చరిత్ర సృష్టిస్తూ విజయ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన తర్వాత 'జన నాయగన్'కు ఉన్న అడ్డంకులు తొలగిపోతాయని అభిమానులు భావించారు. అంతేకాకుండా జూన్ 22న విజయ్ పుట్టినరోజు సందర్భంగా జూన్ 19న సినిమా విడుదల అవుతుందని బుక్మైషో వంటి టికెటింగ్ ప్లాట్ఫారమ్ల్లో కనిపించిన వివరాలు అభిమానుల్లో ఆశలు పెంచాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వంలో అత్యున్నత పదవిలో ఉన్న విజయ్ నటించిన చిత్రానికే సెన్సార్ క్లియరెన్స్ ఇంకా లభించకపోవడం ఆసక్తికరంగా మారింది. దీనిపై ఇటీవల తమిళనాడు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి రాజ్మోహన్ అరుముగం స్పందిస్తూ, సెన్సార్ సర్టిఫికెట్ వచ్చిన తర్వాతే సినిమా విడుదల సాధ్యమని, చట్టపరమైన అర్హతలు పూర్తి చేసిన ఏ చిత్రాన్నీ రాజకీయ కారణాలతో నిలిపివేయలేమని స్పష్టం చేశారు.
విడుదల ఎప్పుడు?
ప్రస్తుతం 'జన నాయగన్' భవితవ్యం పూర్తిగా సెన్సార్ బోర్డు నిర్ణయంపైనే ఆధారపడి ఉంది. దర్శకుడు వినోద్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయంగా మారాయి. విజయ్ సినీ కెరీర్కు వీడ్కోలు పలికే చిత్రంగా భావిస్తున్న ఈ సినిమాను అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. అయితే సర్టిఫికేషన్ ప్రక్రియ పూర్తయ్యే వరకు విడుదల తేదీపై స్పష్టత వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో 'జన నాయగన్' ఎప్పుడు థియేటర్లలో సందడి చేస్తుందనే ప్రశ్నకు ఇప్పటికీ సమాధానం దొరకని పరిస్థితి నెలకొంది.


Click it and Unblock the Notifications




