పూరీతో కలిసి గోవాకు విజయ్ దేవరకొండ: హీరోయిన్తో పాటు అక్కడే నెల రోజులు
కెరీర్ ఆరంభంలో చిన్న చిన్న పాత్రలను చేసి.. 'పెళ్లి చూపులు' అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి హీరోగా పరిచయం అయ్యాడు క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ. మొదటి చిత్రంలోనే అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న ఈ యంగ్ హీరో.. దీని ద్వారా భారీ హిట్ను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ వెంటనే 'అర్జున్ రెడ్డి' రూపంలో మరో భారీ సక్సెస్ను అందుకున్నాడు. అంతేకాదు, ఈ చిత్రంతో విజయ్ స్టార్గా ఎదిగిపోయాడు. అనంతరం 'గీత గోవిందం'తో వంద కోట్ల క్లబ్లో చేరిన ఇతగాడు.. ఆ వెంటనే 'టాక్సీవాలా'తో మరో హిట్ను కూడా దక్కించుకున్నాడు.
ఇలా కెరీర్ ఆరంభంలోనే పలు విజయాలను అందుకుని చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగిపోయాడు విజయ్ దేవరకొండ. ఇలాంటి పరిస్థితుల్లో అతడికి వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. దీనికి కారణం ఈ యంగ్ హీరో కొంత కాలంగా వరుస పరాజయాలు చవి చూస్తూ నిరాశ పరుస్తుండడమే. ఈ మధ్య కాలంలో 'నోటా' 'డియర్ కామ్రేడ్', 'వరల్డ్ ఫేమస్ లవర్' బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టాయి. దీంతో అతడి గ్రాఫ్ క్రమంగా పడిపోతోంది. అయినప్పటికీ ఏమాత్రం వెనకడుగు వేయకుండా వరుసగా సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నాడతను.

సరైన హిట్ కోసం వేచి చూస్తోన్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్తో కలిసి 'లైగర్' అనే సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్లో రాబోతున్న ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో ప్రారంభం అయింది. కానీ, అనివార్య కారణాల వల్ల తరచూ వాయిదా పడుతుండడంతో ఇప్పటి వరకూ టాకీ పార్ట్ మాత్రం కంప్లీట్ కాలేదు. దీనికితోడు ఈడీ విచారణ వంటి వాటి వల్ల ఇది మరింత ఆలస్యం అవుతోంది. ఈ పరిస్థితుల్లో తాజాగా ఈ సినిమా తదుపరి షెడ్యూల్ గురించి చిత్ర యూనిట్ ఓ కీలక నిర్ణయం తీసుకుందని తాజాగా ఓ న్యూస్ ఫిలిం నగర్లో వైరల్ అవుతోంది.
తాజా సమాచారం ప్రకారం.. 'లైగర్' మూవీ యూనిట్ త్వరలోనే గోవా వెళ్లబోతుందట. అక్కడే దాదాపు నెల రోజుల పాటు ఓ లాంగ్ షెడ్యూల్ను జరుపుకోబోతున్నారని తెలుస్తోంది. ఇందులో సినిమాలోనే ఎంతో ముఖ్యమైన కొన్ని సన్నివేశాలతో పాటు పలు పాటలు, కొన్ని యాక్షన్ సీక్వెన్స్ను చిత్రీకరించబోతున్నారని సమాచారం. హీరో విజయ్ దేవరకొండతో పాటు హీరోయిన్ అనన్య పాండే కూడా ఈ లాంగ్ షెడ్యూల్లో భాగం కానుందట. ఇక, చిత్ర బృందం త్వరలోనే గోవా ఫ్లైట్ ఎక్కబోతుందని తెలుస్తోంది. దాని తర్వాత హైదరాబాద్లో క్లైమాక్స్ పార్ట్ షూట్ చేస్తారని టాక్.
క్రేజీ కాంబినేషన్లో పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతోన్న 'లైగర్' మూవీలో విజయ్ దేవరకొండ ప్రొఫెషనల్ బాక్సర్గా నటిస్తున్నాడు. ఇందుకోసం అతడు చాలా రోజుల పాటు ఈ క్రీడలో శిక్షణ కూడా తీసుకున్నాడు. అలాగే, ఇందులో ఈ యంగ్ హీరో సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. ఇందులో బాలీవుడ్ స్టార్ డాటర్ అనన్య పాండే హీరోయిన్గా నటిస్తోంది. ఇక, ఈ సినిమాను కరణ్ జోహార్, హీరోయిన్ ఛార్మీలతో కలిసి పూరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇందులో రమ్యకృష్ణ కీలక పాత్రను చేస్తున్నట్లు చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది.


Click it and Unblock the Notifications











