విమానంలో అలా అవమానించారు... ప్రియాంక చోప్రా ఎమోషనల్
ప్రియాంక చోప్రా.. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా సత్తా చాటిన ఆమె.. ప్రస్తుతం గ్లోబల్ బ్యూటీగా హాలీవుడ్లోనూ నటిస్తూ, భారతదేశానికి గర్వకారణంగా నిలుస్తున్నారు. ప్రస్తుతం సూపర్స్టార్ మహేశ్ బాబు హీరోగా దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న వారణాసిలో ప్రియాంక చోప్రా కీలకపాత్ర పోషిస్తున్నారు. జీవితంలో ఎన్నో మైలురాళ్లను సాధించిన ఈ ముద్దుగుమ్మకు ఇదంతా అంతా తేలికగా దొరకలేదు. ఎన్నో అవమానాలు, ఛీత్కారాలు ఎదుర్కొంది. ఓ సందర్భంలో విమానంలో ప్రియాంక చోప్రాకు అవమానం జరిగిందట. ఈ వివరాల్లోకి వెళితే..
మిస్ట్ వరల్డ్ టైటిల్ గెలిచి సినీరంగంలో అడుగుపెట్టారు ప్రియాంక చోప్రా. తొలినాళ్లలో తన రంగు, రూపం, నటనపై విమర్శలు వచ్చినా తట్టుకుని నిలబడ్డారు ప్రియాంక. డ్యాన్స్ సరిగా చేయలేక ఇబ్బందిపడటంతో సీనియర్ కొరియోగ్రాఫర్ రాజు ఖాన్.. సెట్లో ఆమెపై మైక్ విసిరేసి మరి తిట్టారు. అలాంటి అవమానాలు పొందిన చోటే .. పట్టుదలతో డ్యాన్స్ నేర్చుకుని దేశీ గర్ల్, రామ్ చాహే లీలా వంటి సాంగ్స్లో అద్భుతమైన మూవ్మెంట్స్తో డ్యాన్స్లోనూ తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు. అలా తనను తాను మలచుకుని బాలీవుడ్లో అగ్రనటిగా వెలుగొందారు.

భారత్లో అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా, బాలీవుడ్లో రిచ్చెస్ట్ హీరోయిన్లలో ఒకరిగా ప్రియాంక చోప్రా నిలిచారు. అలాగే సినీరంగానికి చేసిన సేవలకు గాను చిన్న వయసులోనే పద్మశ్రీ వంటి ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందుకుని చిరస్మరణీయమైన విజయాలు సాధించారు. హిందీలో కెరీర్ పీక్స్లో ఉండగానే హాలీవుడ్లో అడుగుపెట్టి అక్కడా సక్సెస్లు అందుకున్నారు. ఈ దశలో తనకంటే పదేళ్లు చిన్నవాడైన అమెరికన్ సింగర్ నిక్ జోనాస్తో ప్రేమలో పడి 2018లో అతనిని ప్రేమ వివాహం చేసుకున్నారు.
నిక్తో పెళ్లి తర్వాత అమెరికాలోని లాస్ ఏంజెల్స్లో స్థిరపడిన ఆమె ఇప్పుడు తన పూర్తి సమయాన్ని హాలీవుడ్కే కేటాయిస్తున్నారు. బాలీవుడ్లో ఒకటి ఆరా సినిమాలు మాత్రమే చేస్తున్నారు. ఈ క్రమంలో వారణాసిలో హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసి ప్రపంచం మొత్తాన్ని తనవైపుకు తిప్పుకున్నారు. ఇందులో మందాకినీ అనే పాత్రలో ప్రియాంక చోప్రా నటిస్తున్నారు. సినిమాలతో పాటు సామాజిక అంశాలపైనా తన అభిప్రాయాలను పంచుకుంటూ ఉంటారు ప్రియాంక. మహిళా హక్కులు, సమానత్వం, వివక్ష తదితర అంశాలపై తను ఎదుర్కొన్న అవమానాలను అప్పుడప్పుడు పంచుకుంటూ ఉంటారు. ఏ విషయంపై అయినా కుండబద్ధలు కొట్టినట్లు మాట్లాడతారు. కొద్దిరోజుల క్రితం కన్యత్వం గురించి ప్రియాంక చోప్రా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
సామాన్యులే కాదు సెలబ్రిటీలు కూడా వివక్షను ఎదుర్కోవాల్సి వస్తుందని.. రంగు, కట్టుబొట్టు చూసి తనను అవమానించిన ఘటనలు ఉన్నాయని ప్రియాంక చోప్రా పలుమార్లు ఆవేదన వ్యక్తం చేశారు. కొద్దిరోజుల క్రితం బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్గా వ్యవహరిస్తోన్న కాఫీ విత్ కరణ్ టాక్ షోలో పాల్గొన్న ప్రియాంక చోప్రా.. విమానంలో జరిగిన అవమానాన్ని పంచుకున్నారు. అమెరికాలో లేదా విదేశాలలో భారతీయురాలిగా ఏదైనా భిన్నమైన పరిస్ధితులు ఎదుర్కొన్నారా అని కరణ్ అడిగారు.
దీనికి ప్రియాంక చోప్రా స్పందిస్తూ.. ఒకరోజున నేను యూరప్ నుంచి న్యూయార్క్కు ఫస్ట్ క్లాస్లో ప్రయాణిస్తున్నా. వాష్రూమ్కి వెళ్లాల్సి రావడంతో ఫ్లైట్ ముందు భాగంలో ఉన్న ఫస్ట్ క్లాస్ టాయిలెట్కు వెళ్లబోతుండగా అక్కడే ఉన్న ఎయిర్హోస్టెస్ నన్ను అడ్డుకున్నాడు. వాష్రూమ్ వెనుక వైపు ఉందని అన్నాడు. ఆ మాటలతో అవాక్కయిన నేను.. మరి ఇదేంటీ అని అడిగాను. ఇది కేవలం ఫస్ట్ క్లాస్ ప్యాసింజర్స్కి మాత్రమేనని చెప్పాడు. దాంతో అతనిని కోపంగా చూసి నేను ఫస్ట్ క్లాస్లోనే కూర్చొన్నాను అని చెప్పడంతో ఆ ఎయిర్హోస్టెస్ ఇబ్బందిగా ఫీల్ అయి వెంటనే నాకు క్షమాపణలు చెప్పాడని ప్రియాంక వెల్లడించారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. భారతీయుల సెలబ్రిటీలకు అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న అవమానాలు, వివక్షపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications



