పంతం సినిమా యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో గోపిచంద్, మెహ్రీన్, సంపత్ రాజ్, ముఖేశ్ రుషి, ప్రిథ్వి, శ్రీనివాస రెడ్డి, పవిత్ర లోకేష్, సత్య కృష్ణ, హంస నందిని, జయప్రకాష్ రెడ్డి, సయాజి షిండే, అజై, బద్రం, జీవా తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కె చక్రవర్తి వహించారు మరియు నిర్మాత రాధా మోహన్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం గోపి సుందర్ అందించారు.
కథ
లండన్లో మల్టీ మిలియనీర్ కుమారుడైన విక్రమ్ సురానా (గోపిచంద్) ఓ పని కోసం ఇండియాకు వస్తాడు. ఊహించని పరిస్థితుల కారణంగా ఓ కార్యాన్ని భుజానకెత్తుకొని కామన్ మ్యాన్గా మారుతాడు. ఇండియాలో రకరకాల దోపిడి, అక్రమాలను చూసి చలించిపోతాడు. అందుకు కారణమైన హోంమంత్రి జయేంద్ర అలియాస్ నాయక్ భాయ్, ఆరోగ్యశాఖ మంత్రి (జయప్రకాశ్ రెడ్డి) దాచుకొన్న నల్లధనాన్ని దోచి అనాథ శరణాలయకు, కొంత మంది బాధితులకు పంచిపెడుతుంటాడు. తమ వద్ద నుంచి డబ్బు కొట్టేసేదెవరు అని తెలుసుకోవడానికి మంత్రులు తలపట్టుకొంటారు. ఈ క్రమంలో చివరికి నల్లధనాన్ని దోచుకొనేది విక్రమ్ అని తెలుస్తుంది. సంపన్నుడైన విక్రమ్ నల్లధనాన్ని దోచుకోవడానికి దారితీసిన కారణమేమిటి? తన లక్ష్యాన్ని చేరుకొనే క్రమంలో తారస పడిన అక్షర (మెహ్రీన్) ప్రేమ వ్యవహారం ఎలా సాగింది? తన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎలాంటి ఎత్తులు వేశాడు? విక్రమ్ ఎత్తులకు మంత్రులు ఎలాంటి పై ఎత్తులు వేశారు. తాను అనుకొన్న లక్ష్యాన్ని విక్రమ్ ఎలా చేరుకొన్నాడు? అనే ప్రశ్నలకు సమాధానమే పంతం సినిమా కథ.