46 ఏళ్ల వయసులో తల్లయిన టాలీవుడ్ హీరోయిన్.. పెళ్లైన 12 ఏళ్లకు గుడ్న్యూస్!
ఇటీవలి కాలంలో టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు సినీతారలు పెళ్లిళ్లు చేసుకుని గర్బం దాలుస్తూ ఒకరి తర్వాత మరొకరు గుడ్న్యూస్ చెబుతున్నారు. అయితే మరికొందరు మాత్రం ఏళ్లు గడుస్తున్నా మాతృత్వానికి దూరంగానే ఉంటున్నారు. తాజాగా పెళ్లయిన 12 ఏళ్లకు తల్లిని అయినట్లుగా తెలిపింది ఓ టాలీవుడ్ సీనియర్ నటి. ఈ వివరాల్లోకి వెళితే..
కేరళకు చెందిన పద్మప్రియ అసలు పేరు పద్మప్రియ జానకీరామన్. ఆమె తండ్రి భారత సైన్యంలో బ్రిగేడియర్ హోదాలో పనిచేశారు. ఆయన ఉద్యోగ రీత్యా వీరి కుటుంబం దేశంలోని పలు ప్రాంతాల్లో నివసించింది. అయితే ఆమె బాల్యం, చదువు మొత్తం సికింద్రాబాద్లోనే జరగడం విశేషం. ఎంబీఏ పూర్తి చేశాక బెంగళూరులోని ఓ కంపెనీలో ఉద్యోగం చేరిన పద్మప్రియ.. అనంతరం నటనపై ఆసక్తితో మోడలింగ్లో దిగారు. అయితే అంతకుముందు 12వ తరగతి చదువుతుండగా 2001లో మిస్ ఆంధ్రప్రదేశ్ కిరీటాన్ని గెలిచారు.

2004లో శీను వాసంతి లక్ష్మీ సినిమా ద్వారా వెండితెరపై అడుగుపెట్టిన ఆమె ఎక్కువగా తమిళ, మలయాళ చిత్రాల్లోనే నటించారు. అందరి బంధువయా, పటేల్ సార్ అనే తెలుగు సినిమాలలో కనిపించారు. తమిళ, మలయాళ భాషల్లో టాలెంటెడ్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న పద్మప్రియ తన 20 ఏళ్లకు పైగా కెరీర్లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, ఇంగ్లీష్ భాషలలో పలు చిత్రాలలో నటించారు. నేషనల్ ఫిల్మ్ అవార్డ్తో పాటు తమిళనాడు, కేరళ ప్రభుత్వాల అవార్డులు, మూడు ఫిల్మ్ఫేర్ అవార్డులను పద్మప్రియ అందుకున్నారు. ఇటీవల మలయాళ సినీ తారల సంఘం (అమ్మ) ప్రాథమిక సభ్యత్వానికి ఆమె రాజీనామా చేయడం కలకలం రేపిన సంగతి తెలిసిందే.
2014లో గుజరాత్కు చెందిన జాస్మిన్ షాతో ముంబైలో పద్మప్రియ వివాహం జరిగింది. న్యూయార్క్ యూనివర్సిటీలో, కొలంబియా యూనివర్సిటీలలో చదువుకుంటున్న సమయంలో జాస్మిన్కు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి వీరిద్దరూ వైవాహిక బంధం ద్వారా ఒక్కటయ్యారు. పెళ్లి తర్వాత తన వయసుకు తగిన పాత్రలతో అడపాదడపా నటిస్తున్నారు పద్మప్రియ. గత ఏడాది యువ సప్నాన్ కా సఫర్, డియర్ మా సినిమాలలో ఆమె నటించారు. పద్మప్రియ భర్త జాస్మిన్ ప్రస్తుతం రాజకీయాలలో యాక్టీవ్గా ఉంటున్నారు. అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆప్లో ఆయన కీలక నేతగా వ్యవహరిస్తున్నారు.
సినిమాలు చేసినా, చేయకున్నా సోషల్ మీడియాలో యాక్టీవ్గా ఉంటున్నారు పద్మప్రియ. తన సినిమాలు, ఇతర వ్యక్తిగత విశేషాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా తాను తల్లిని అయ్యానంటూ ఆమె పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. తన ప్రెగ్నెన్సీ గురించి ఏనాడూ రివీల్ చేయని ఈ ముద్దుగుమ్మ.. సడెన్గా గుడ్న్యూస్ చెప్పడంతో అభిమానులు షాక్ అయ్యారు. తల్లిదండ్రుల చేతిలో బిడ్డ చేయి ఉన్న ఫోటోను పద్మప్రియ పంచుకున్నారు. అయితే పుట్టింది ఆడబిడ్డా లేక మగబిడ్డా అనేది మాత్రం ఆమె క్లారిటీ ఇవ్వలేదు. పద్మప్రియ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు, పెళ్లయి దాదాపు 12 ఏళ్లు కావొస్తోంది.. ఈ వయసులో ఆమె తల్లి కావడంతో అభిమానులు, సినీ ప్రముఖులు ఈ దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications


