పిలిచిన మగాడిని ఎందుకు ప్రశ్నించరు?.. కమిట్మెంట్పై సీరియల్ నటి కామెంట్స్
తెలుగు సినీ పరిశ్రమలో రెండు దశాబ్దాలకుపైగా మోడల్గా, డ్యాన్సర్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి శ్రావణ సంధ్య.'గమ్యం' సినిమాలో నక్సలైట్ పాత్రతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తరువాత గమనం, శ్రీరంగపురం తదితర సినిమాల్లో నటించి మెప్పించారు. ప్రస్తుతం సినిమాలతో పాటు గుండెనిండా గుడిగంటలు వంటి సీరియల్స్లోనూ నటిస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రావణ సంధ్య.. సినీ పరిశ్రమలో తరచూ వినిపించే కమిట్మెంట్, కాస్టింగ్ కౌచ్ వంటి విషయాలపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇంతకీ ఏమన్నారంటే?
ఇండస్ట్రీలో కమిట్మెంట్ అనేది ఓపెన్ సీక్రెట్ అని కొందరు చెబుతుంటారని ప్రశ్నించగా.. నటి శ్రావణ సంధ్య తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ.. తన అనుభవంలో ఎవరూ బలవంతంగా ఎవరినీ ఏదైనా చేయించలేదని చెప్పారు. అవకాశాలు వచ్చినప్పుడు వాటిని ఎలా ఉపయోగించుకోవాలనేది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయమని పేర్కొన్నారు. ఒకరి వ్యక్తిగత నిర్ణయాన్ని మొత్తం ఇండస్ట్రీకి ఆపాదించడం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు. "అడగడం ఒకటి.. బలవంతం చేయడం మరోటి..ప్రతి రంగంలోనూ వేధింపులు,అనుచిత ప్రవర్తనకు సంబంధించిన సంఘటనలు జరుగుతాయని, కేవలం సినిమా పరిశ్రమను మాత్రమే ప్రత్యేకంగా టార్గెట్ చేయడం సరైంది కాదని చెప్పారు.

సాఫ్ట్వేర్ కంపెనీల నుంచి ఇతర కార్యాలయాల వరకు ఇలాంటి సమస్యలు వినిపిస్తాయని, కానీ సినిమా రంగం గ్లామర్ ఇండస్ట్రీ కావడం వల్ల ఎక్కువగా చర్చకు వస్తోందని అభిప్రాయపడ్డారు. సినిమా ఇండస్ట్రీ గురించి ఆధారాలు లేకుండా తప్పుగా మాట్లాడితే తాను ఎదురు నిలబడి ప్రశ్నిస్తానని, ఇద్దరు వ్యక్తుల వ్యక్తిగత నిర్ణయాలపై మూడో వ్యక్తి తీర్పు ఇవ్వడం సరికాదన్నారు. అదే సమయంలో ఎవరైనా నిజంగా అన్యాయానికి గురైతే, జరిగిన వెంటనే ధైర్యంగా బయటకు వచ్చి మాట్లాడాలని సూచించారు. అయితే చాలా సంవత్సరాల తర్వాత మాత్రమే ఆరోపణలు చేయడం కూడా చర్చకు దారితీస్తుందని తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలను కూడా శ్రావణ సంధ్య ప్రస్తావించారు. సినీ పరిశ్రమలోకి వచ్చే యువతులు భయపడాల్సిన అవసరం లేదని ఆయన చెప్పిన మాటలతో తాను ఏకీభవిస్తున్నానని తెలిపారు. తాను దాదాపు రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఉన్నానని, వేలాది మందితో కలిసి పనిచేసిన అనుభవంలో ప్రతి ఒక్కరినీ ఒకే కోణంలో చూడలేమని అన్నారు. శ్రీరెడ్డి అంశంపై కూడా ఆమె స్పందించారు.. ఆ సమయంలో తనను కూడా స్పందించాలని చాలామంది కోరారని, కానీ తాను చెప్పిన నిజమైన అభిప్రాయాన్ని కంటే "పబ్లిసిటీ కోసం మాట్లాడుతోంది" అనే విమర్శలే ఎక్కువగా వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో కామెంట్లు చేసే వారు ఎదుటివారి కష్టాలు, పరిస్థితులు తెలుసుకోకుండా తీర్పు ఇవ్వడం బాధ కలిగిస్తుందని అన్నారు.
సినిమా పరిశ్రమపై తనకు ఉన్న గౌరవాన్ని కూడా శ్రావణ సంధ్య వివరించారు. జీవితంలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న రోజుల్లో తనకు, తన కుటుంబానికి ఈ ఇండస్ట్రీనే అండగా నిలిచిందని చెప్పారు. నెలల తరబడి అవకాశాలు లేక ఇబ్బందులు పడ్డ సందర్భాలు ఉన్నాయని, షూటింగ్ డబ్బుల కోసం ఎదురు చూసి ఇంటి ఖర్చులు నెట్టుకొచ్చిన రోజులు కూడా ఉన్నాయని గుర్తు చేసుకున్నారు. అందుకే తనకు అన్నం పెట్టిన ఇండస్ట్రీని తాను నిందించలేనని స్పష్టం చేశారు. అవకాశాలు వచ్చినప్పుడు సంపాదించిన డబ్బును భవిష్యత్తు కోసం దాచుకోవాలని కూడా యువ కళాకారులకు సూచించారు. ఇండస్ట్రీలో కనిపించే గ్లామర్, ఖరీదైన వస్తువుల కంటే ఆర్థిక భద్రత ముఖ్యమని, సంపాదించినప్పుడు పొదుపు చేయకపోతే తర్వాత ఇబ్బందులు తప్పవని అన్నారు.
ఇక తనకు కొన్ని ప్రత్యేకమైన పాత్రలపై ఎందుకు ఆసక్తి ఉంటుందో కూడా శ్రావణ సంధ్య వివరించారు. ముఖ్యంగా సెక్స్ వర్కర్ లేదా సింగిల్ మదర్ పాత్రలు చేయడానికి కారణం వాటి వెనుక ఉన్న బాధను తాను దగ్గరగా చూసిన జీవిత అనుభవాలేనని చెప్పారు. చిన్న వయసులోనే తండ్రిని కోల్పోవడం, ఇద్దరు పిల్లలను పెంచేందుకు తన తల్లి పడిన కష్టాలు, ఇడ్లీలు అమ్ముతూ కుటుంబాన్ని నెట్టుకొచ్చిన రోజులు ఇప్పటికీ తన కళ్లముందే ఉంటాయని గుర్తు చేసుకున్నారు. ఆ అనుభవాలే అలాంటి పాత్రలను గౌరవంగా చూడటం నేర్పాయని అన్నారు.
మహిళలపై మాత్రమే నిందలు వేయడం కూడా సరైంది కాదని శ్రావణ సంధ్య అభిప్రాయపడ్డారు. "ఒక్క మహిళనే ఎందుకు ప్రశ్నిస్తారు? ఆమెను పిలిచిన వ్యక్తి గురించి కూడా అదే ప్రశ్న వేయాలి కదా" అంటూ మండిపడ్డారు. ప్రతి పరిస్థితిలో బాధ్యత ఇద్దరి నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటుందని, సమాజం ఒకే కోణంలో మహిళలను విమర్శించడం మానుకోవాలని సూచించారు. ఇండస్ట్రీలో ఎవరూ బలవంతం చేయరని ఆమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.


Click it and Unblock the Notifications





