Jabardasth: జబర్దస్త్లో ఊహించని మార్పులు.. 13 ఏళ్ల తర్వాత ఈటీవీ సంచలన నిర్ణయం!
Photo Courtesy: ETV Telugu India
దాదాపు 13 ఏళ్లుగా తెలుగు ప్రజలను నవ్వుల్లో ముంచెత్తుతోంది జబర్దస్త్. ఈటీవీ వేదికగా స్టాండప్ కామెడీ పేరుతో ప్రారంభమైన ఈ షో ఎందరికో ఉపాధిని కల్పిస్తోంది. ఈ ప్లాట్ఫాం ద్వారా పరిచయమైన ఎందరో ప్రతిభావంతులు సెలబ్రిటీ స్టేటస్ అందుకున్నారు. జబర్దస్త్లో పనిచేసిన వారు నేడు ఇండస్ట్రీలో కమెడియన్లుగా, హీరోలుగా, రచయితలుగా, దర్శకులుగా వెలుగొందుతున్నారు. ఈ 13 ఏళ్లలో జబర్దస్త్లో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. యాంకర్లు, జడ్జిలు, టీమ్ టీడర్లు, కమెడియన్లు అంతా మారిపోయారు. అయినప్పటికీ తన హవాను సాగిస్తోంది జబర్దస్త్.
రోజా- నాగబాబులు జడ్జిలుగా 2013 ఫిబ్రవరి 7న జబర్దస్త్ తొలి ఎపిసోడ్ ఈటీవీలో ప్రసారమైంది. ధనాధన్ ధనరాజ్, చమ్మక్ చంద్ర, చలాకీ చంటీ, రాకెట్ రాఘవ, రోలర్ రఘు, వేణు వండర్స్ టీమ్లు ఫస్ట్ సీజన్లో ఉండేవి. అనతి కాలంలోనే ఈ షో ప్రేక్షకుల ఆదరణను దక్కించుకుని తిరుగులేని టీఆర్పీని సాధించి.. ఈటీవీని ప్రజలకు మరింత చేరువ చేసింది. జబర్దస్త్లో నటించే యాంకర్లు, కమెడియన్లకు ప్రజల్లో మంచి క్రేజ్ లభించింది. జబర్దస్త్ను చూసి మిగిలిన ఛానెల్స్ కూడా రకరకాల షోలు ప్లాన్ చేసినా జబర్దస్త్ రేంజ్లో సక్సెస్ కాలేకపోయింది.

Photo Courtesy: ETV Telugu India
కాలక్రమంలో హైపర్ ఆది, బుల్లెట్ భాస్కర్ తదితర కొత్త టీమ్ లీడర్లు రావడంతో జబర్దస్త్ క్రేజ్ తారా స్థాయికి చేరింది. ఇదే సమయంలో వివాదాలు కూడా అదే స్థాయిలో వచ్చాయి. ముఖ్యంగా అసభ్యపదజాలం, డబుల్ మీనింగ్ డైలాగ్స్, బూతులతో ఈ షోపై సాంప్రదాయవాదులు మండిపడ్డారు. అయినప్పటికీ ప్రేక్షకులు మాత్రం జబర్దస్త్కు కొండంత అండగా నిలిచారు. ఈ దశలో జబర్దస్త్ నుంచి జడ్జిగా ఉన్న మెగా బ్రదర్ నాగబాబు పక్కకు తప్పుకోవడం, కొందరు కమెడియన్లు వెళ్లిపోవడంతో పెద్ద కుదుపుకు లోనైంది.
ఆ తర్వాత మరో జడ్జి రోజా, యాంకర్ అనసూయ భరద్వాజ్ సహా హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, చమ్మక్ చంద్ర తదితరులు కూడా వ్యక్తిగత కారణాలు, సినీ రంగంలో అవకాశాల దృష్ట్యా ఈ షో నుంచి తప్పుకున్నారు. అలీ, కృష్ణ భగవాన్, శివాజీ, మనో, మీనా, ఇంద్రజలు జబర్దస్త్కు జడ్జిలుగా వ్యవహరించారు. పంచ్లలో పస లేకపోవడం, రోటీన్ కామెడీతో జబర్దస్త్కు ఆదరణ దక్కింది. దీంతో మల్లెమాల, ఈటీవీ యాజమాన్యం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. మెగా బ్రదర్ నాగబాబును తిరిగి తీసుకొచ్చి జడ్జి చైర్లో కూర్చొబెట్టింది. ఈ వెంటనే కొందరు మాజీ కమెడియన్లు, టీమ్ లీడర్లు కూడా జబర్దస్త్లోకొ ఒక్కొక్కరిగా అడుగుపెడుతున్నారు.
దీంతో గడిచిన కొద్దిరోజులుగా జబర్దస్త్ స్కిట్స్ అలరిస్తూ పునర్వైభవం దిశగా సాగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఈటీవీ, మల్లెమాల సంస్థలు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. జబర్దస్త్ టైమింగ్స్ను మార్చేశాయి. ప్రస్తుతం శుక్ర, శనివారాలలో రాత్రి 9.30 గంటలకు బబర్దస్త్ ప్రసారమవుతోంది. గడిచిన 13 ఏళ్లుగా ఈటీవీలో ప్రైమ్ టైమ్ వార్తలు ముగిసిన వెంటనే జబర్దస్త్ టెలీకాస్ట్ అవుతోంది. ఆ తర్వాత ప్రేక్షకుల ఆదరణ దృష్ట్యా గురు, శుక్రవారాల్లో జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్లుగా ప్రసారమైంది. ఆ తర్వాత కొన్నిరోజులకు శుక్ర, శనివారాలకు జబర్దస్త్ను షిప్ట్ చేశారు.
ప్రేక్షకులు కూడా దీనికే అలవాటు పడిపోయారు. కానీ ఈ వారం నుంచి రెండు ఎపిసోడ్స్ రద్దు చేసి ఒకే షోగా ఇకపై ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటలకు జబర్దస్త్ ప్రసారం కానుంది. జూలై 26 నుంచి కొత్త టైమింగ్స్తో వీకెండ్లో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు స్పెషల్ ప్రోమో ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు. స్టార్ మా, జీ తెలుగు ఛానెల్స్ నుంచి పోటీకి తోడు ఆదివారం సెలవు దినం కావడంతో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు జబర్దస్త్ నిర్వాహకులు ఈ ఎత్తుగడ వేసినట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు. మరి కొత్త టైమింగ్స్తో ప్రసారం కానున్న జబర్దస్త్ ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications



