షారుఖ్తో సల్మాన్ ఖాన్ గొడవ.. 5 ఏళ్లు శత్రువుల్లా, ఆ హీరోయిన్ బర్త్ డేలో ఏం జరిగిందంటే?
బాలీవుడ్ను గత 40 ఏళ్లుగా శాసిస్తోంది ఖాన్ త్రయం. సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, ఆమీర్ ఖాన్లు త్రిమూర్తుల్లా.. హిందీ చిత్ర పరిశ్రమకు ఐకాన్స్గా వెలుగొందుతున్నారు. వేల కోట్ల రూపాయల వ్యాపారం వీరి ముగ్గురు పేరు మీదే జరుగుతోంది. వీరు ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ ప్రత్యర్ధుల్లా కాకుండా అన్నదమ్ముల్లా, ప్రాణ స్నేహితుల్లా కలిసి మెలిసి ఉంటారు. ఒకరి కష్టాల్లో ఒకరు అండగా నిలుస్తూ.. కొత్త తరానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అయితే ఎంతటి బెస్ట్ ఫ్రెండ్స్ అయినా విభేదాలు సహజమే.. అలాగే వీరిలోనూ గొడవలు జరిగాయి.
ఇప్పుడు ప్రాణ స్నేహితుల్లా ఉన్న షారుఖ్ ఖాన్- సల్మాన్ ఖాన్ల మధ్య ఒకప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గమనే పరిస్ధితి ఉండేదంటే మీరు నమ్ముతారా? కానీ ఇది నిజం. సరిగ్గా 18 ఏళ్ల క్రితం జరిగిన ఓ హీరోయిన్ కారణంగా జరిగిన గొడవతో సల్మాన్ ఖాన్ - షారుఖ్ ఖాన్ల మధ్య దూరం పెరిగింది. దాదాపు 5 ఏళ్ల పాటు వీరిద్దరి మధ్య మాటలు కూడా లేవు. మరి 18 ఏళ్ల క్రితం ఏం జరిగింది? వీరి మధ్య గొడవకు కారణమైన ఆ హీరోయిన్ ఎవరు? తిరిగి సల్మాన్ ఖాన్- షారుఖ్ ఖాన్ ఎలా కలిశారు. ఈ వివరాల్లోకి వెళితే..

వీరిద్దరి మధ్య గొడవకు కారణమైన నటి కత్రినా కైఫ్. 2008లో కత్రినా కైఫ్ పుట్టినరోజు వేడుకల్లో జరిగిన గొడవ ఈ ఇద్దరు బాలీవుడ్ దిగ్గజాల మధ్య వైరాన్ని సృష్టించడంతో పాటు బాలీవుడ్ చరిత్రలోనే అత్యంత చర్చనీయాంశమైన ఘటనలలో ఒకటిగా నిలిచింది. ఆ రోజు సాయంత్రం పార్టీలో సల్మాన్ ఖాన్ పీకలదాకా తాగి మద్యంలో మత్తులో తూగుతున్నాడు. తన పక్కనే ఉన్న షారుఖ్ ఖాన్తో ఆయన హోస్ట్గా వ్యవహరిస్తోన్న క్యా ఆప్ పంచవీ పాస్ సే తేజ్ హై షోను హేళనగా మాట్లాడాడు. అక్కడితో ఆగకుండా నువ్వొక స్వార్ధపరుడివి, అర్ధం లేని మనిషివి.. నీకు అవసరమైతేనే ఇతరులకు ఫోన్ చేస్తావు.. అవసరం తీరాక వాళ్లని వదిలేస్తావని సల్మాన్ అన్నట్లుగా అప్పట్లో బాలీవుడ్ మీడియా కోడై కూసింది.
మరో వెర్షన్ ప్రకారం.. మై ఔర్ మిసెస్ ఖన్నాలో అతిథి పాత్ర చేయడానికి షారుఖ్ నిరాకరించడంతో సల్మాన్ కోపంతో ఉన్నాడని కొందరు చెప్పారు. సల్మాన్ ఖాన్ మాత్రం.. ఓం శాంతి ఓంలో గెస్ట్ రోల్ చేయడంతో పాటు షారుఖ్ హోస్ట్గా ఉన్నప్పుడు కౌన్ బనేగా కరోడ్పతికి కత్రినా కైఫ్తో కలిసి హాజరయ్యారు. ఇదే సమయంలో సల్మాన్ గేమ్ షో దస్ కా దమ్ను షారుఖ్ ఎగతాళి చేసినట్లుగా వార్తలు వచ్చాయి. ఇద్దరు సూపర్స్టార్ల మధ్య మాటా మాటా పెరిగి కొట్లాటకు దారి తీసే పరిస్థితులు కనిపించడంతో షారుఖ్ భార్య గౌరీ ఖాన్ జోక్యం చేసుకుని ఆయనను తీసుకుని వెళ్లిపోయారని బాలీవుడ్ మీడియా చెప్పింది. అయితే ఐశ్వర్యరాయ్ గురించి షారుఖ్ చెడుగా మాట్లాడటం వల్లే సల్మాన్లో ఆగ్రహం కట్టలు తెంచుకుందని మరికొందరు అంటారు.
వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ కారణంగా బాలీవుడ్ రెండు వర్గాలుగా చీలిపోయింది. ఎవరితో పనిచేస్తే ఎవరి ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందోనని దర్శక నిర్మాతలు వణికిపోయారు. సల్మాన్ - షారుఖ్లను కలిపేందుకు మరో సూపర్స్టార్ ఆమీర్ ఖాన్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అలా దాదాపు ఐదేళ్ల పాటు వీరిద్దరూ ఎడముఖం పెడముఖంగానే ఉన్నారు. వారిని కలపాల్సిందిగా దివంగత నేత బాబా సిద్ధిఖీ దృష్టికి తీసుకెళ్లారు బాలీవుడ్ ప్రముఖులు. పరిస్ధితిని అర్ధం చేసుకున్న సిద్ధిఖీ.. 2013లో రంజాన్ సందర్భంగా తన ఇంట్లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసి ఇద్దరినీ ఆహ్వానించారు.
ఆ విందులో సల్మాన్ - షారుఖ్లు ఆప్యాయంగా కౌగిలించుకోవడంతో వివాదం ముగిసింది. కానీ కత్రినా కైఫ్ పార్టీలో ఏం జరిగింది? ఇద్దరి మధ్య అంతలా దూరం పెరగడానికి కారణం ఏంటీ? అనేది తెలియరాలేదు. ఆ రాత్రి ఏం జరిగిందనేది మీడియా ద్వారానే కొంత వరకు తెలిసినప్పటికీ నిజానిజాలు మాత్రం బయటకు రాలేదు. కాలక్రమేణా షారుఖ్ - సల్మాన్లు ప్రాణ స్నేహితుల్లా, కుటుంబ సభ్యుల్లా మారిపోయారు. అలా ఈ ఇద్దరు దిగ్గజాల మధ్య కోల్డ్ వార్ ముగిసి బాలీవుడ్లో ప్రశాంత పరిస్ధితులు నెలకొన్నాయి.


Click it and Unblock the Notifications



