నా భార్యకు ఎప్పుడో చెప్పా.. కొడుకు పుడితే.. మనసులో కోరిక బయటపెట్టిన అఖిల్!
అక్కినేని అఖిల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టి దాదాపు 10 ఏండ్ల తరువాత 'లెనిన్'సినిమాతో సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించి, రికార్డు స్థాయిలో కలెక్షన్లు అందుకుంది. దీంతో అఖిల్ ప్రస్తుతం ఫుల్ జోష్లో ఉన్నారు. మూవీ ప్రమోషన్స్ ముగిసిన తర్వాత తాజాగా ఓ యూట్యూబ్ పాడ్కాస్ట్లో పాల్గొన్నారు. తన సినీ ప్రయాణానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ముఖ్యంగా చైల్డ్ ఆర్టిస్ట్గా నటించిన 'సిసింద్రీ' సినిమా గురించి చెప్పిన విశేషాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇంతకీ ఏమన్నారంటే?
హీరో అఖిల్ మాట్లాడుతూ.. తన జీవితంలో 'సిసింద్రీ' సినిమాకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. తాను కేవలం 8 నుంచి 9 నెలల వయసులోనే ఆ సినిమాలో నటించానని గుర్తు చేసుకున్నారు. అప్పట్లో తాను ఏం చేస్తున్నానో కూడా తెలియని వయసులో కెమెరా ముందుకు వచ్చానని, కానీ ఆ సినిమా తన జీవితంలో ఎప్పటికీ మరచిపోలేని జ్ఞాపకంగా నిలిచిపోయిందన్నారు. అంతేకాదు, భవిష్యత్తులో తనకు కొడుకు పుడితే అతడితో 'సిసింద్రీ 2' సినిమా తీయాలని తన కోరిక అని వెల్లడించారు.

ఈ విషయాన్ని తన భార్య జైనాబ్కు కూడా చెప్పానని అఖిల్ తెలిపారు. "నాకు కొడుకు పుడతాడా? కూతురు పుడుతుందా? అనేది దేవుడి చేతుల్లో ఉంది. కానీ ఒకవేళ కొడుకు పుడితే మాత్రం అతడితో 'సిసింద్రీ 2' చేయాలని నా ఆలోచన. మావోడు ఎప్పుడు వస్తాడో.. ఎప్పుడు ఆ సినిమా చేస్తామో చూడాలి" అంటూ తన మనసులో మాటను బయటపెట్టారు. అఖిల్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం అక్కినేని అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
'సిసింద్రీ' షూటింగ్ సమయంలో జరిగిన విషయాలను అఖిల్ వివరించారు. తాను రోజుకు కేవలం నాలుగు గంటలు మాత్రమే మెలకువగా ఉండేవాడినని, ఆ సమయంలో కూడా తన మూడ్ బాగుంటేనే షూటింగ్ చేసేవారని చెప్పారు. చిన్నపిల్లాడైన తనపై ఎలాంటి ఒత్తిడి పడకుండా చిత్రబృందం ఎంతో జాగ్రత్తగా షూటింగ్ చేస్తున్నట్టు తెలిపారు.
సినిమాలో నవ్వే సన్నివేశాలు ఎలా చిత్రీకరించారో కూడా అఖిల్ వివరించారు. కెమెరా వెనుక తన తండ్రి నాగార్జున నిలబడి రకరకాల సైగలు చేస్తే తాను నవ్వేవాడినని చెప్పారు. అలాగే ఏడవాల్సిన సన్నివేశాల కోసం తన తల్లి అమల కారులో వెళ్లిపోతుండగా చూసి తాను ఏడిస్తే, ఆ సహజ భావోద్వేగాలను షూట్ చేశారని తెలిపారు. సిసింద్రీ సినిమా అక్కినేని కుటుంబానికి ఎంతో ప్రత్యేకమని కూడా అఖిల్ చెప్పారు. ఆ సినిమా విజయాన్ని సాధించడంతో వచ్చిన లాభాలతోనే తన తల్లి అమల ఎంతో ఇష్టంగా 'బ్లూ క్రాస్' జంతు సంరక్షణ సంస్థ ప్రారంభించారని వెల్లడించారు.
అంతేకాదు, 'సిసింద్రీ' తనకు తొలి గుర్తింపును మాత్రమే కాదు, ఫిలింఫేర్ అవార్డును కూడా అందించిందని అఖిల్ పేర్కొన్నారు. చిన్న వయసులోనే అంతటి గుర్తింపు రావడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. అందుకే ఆ సినిమా తన కెరీర్లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా ప్రత్యేక సినిమాగా నిలిచిపోయిందన్నారు.
1995లో విడుదలైన 'సిసింద్రీ' సినిమాకు శివ నాగేశ్వరరావు దర్శకత్వం వహించారు. హాలీవుడ్ సూపర్హిట్ 'బేబీస్ డే అవుట్' కథ ఆధారంగా రూపొందించారు. ఈ సినిమాను నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్పై నిర్మించడంతో పాటు కీలక పాత్రలో కూడా నటించారు. చిన్నారి అఖిల్ అమాయక నటన, క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది.


Click it and Unblock the Notifications





