S Janaki Passed Away: లెజెండరీ సింగర్ ఎస్ జానకీ కన్నుమూత
చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. లెజెండరీ సింగర్ ఎస్ జానకీ కన్నుమూశారు. ఆమె వయసు 88 సంవత్సరాలు. జూలై 11న మైసూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జానకి కన్నుమూసినట్లుగా ఆమె మనవరాలు అప్సర ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటించారు. ఆమె మరణం పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం తెలియజేస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఎస్ జానకి ప్రస్థానం:
23 ఏప్రిల్ 1938న గుంటూరు జిల్లా రేపల్లె సమీపంలోని పల్లపట్ల గ్రామంలో జానకి జన్మించారు. ఆమె పూర్తి పేరు శ్రిష్ట్లా శ్రీరామమూర్తి జానకి. ఆమె తండ్రి ఆయుర్వేద డాక్టర్. ఆమె బాల్యం సిరిసిల్లలో గడిచింది. నదస్వరం విద్వాన్ పైడిస్వామి వద్ద సంగీతంలో ఓనమాలు దిద్దారు. తన జీవితంలో ఎలాంటి శాస్త్రీయ సంగీతం ఆమె నేర్చుకోలేదు. 1959లో వీ రాంప్రసాద్తో జానకి వివాహం జరిగింది. ఈ దంపతులకు ఒక కుమారుడు. అయితే 1997లో కార్డియాక్ అరెస్ట్తో రాంప్రసాద్ కన్నుమూశారు. జానకి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో జానకి అనర్గళంగా మాట్లాడగలరు.
మద్రాస్లో ఏవీఎం స్టూడియోస్లో ఆర్ సుదర్శనం వద్ద ప్లే బ్యాక్ సింగర్గా తన ప్రస్థానం ప్రారంభించారు జానకి. 1957లో విడుదలైన తమిళ చిత్రం విధియిన్ విలాయట్టులో ఆమె తొలిపాట పాడారు. 65 ఏళ్లకు పైగా కెరీర్లో 20 భారతీయ భాషలు సహా ఇంగ్లీష్, జపనీస్, జర్మన్, సింహళ భాషలలో 50 వేలకు పైగా భాషల్లో పాటలు పాడారు. అభిమానులు ఆమెను క్వీన్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ మాడ్యూలేషన్ అని పిలుచుకుంటారు. భారతీయ సంగీతానికి అందించిన సేవలకు గాను 4 జాతీయ అవార్డులు, 33 రాష్ట్ర ప్రభుత్వ అవార్డులతో పాటు మైసూర్ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. తమిళనాడు ప్రభుత్వం నుంచి కలైమామణి అవార్డ్ ఆమెను వరించింది.
అయితే 2013లో భారత ప్రభుత్వం ఆమెకు పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించగా.. అవార్డుల విషయంలో దక్షిణాది కళాకారులకు అన్యాయం జరుగుతోందంటూ ఈ ప్రతిష్టాత్మక అవార్డ్ను జానకి తిరస్కరించారు. దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్నకు జానకి అన్ని విధాలా అర్హురాలని పలువురు ప్రముఖులు బహిరంగంగానే వ్యాఖ్యానించిన సందర్భాలు ఉన్నాయి. తన కెరీర్లో ఏఆర్ రెహమాన్, జీకే వెంకటేష్, హంసలేఖ, ఇళయరాజా, ఎం రంగారావు, ఎంఎస్ సుబ్బరాజ్, రాజన్ నాగేంద్ర, విజయ భాస్కర్ సహా దిగ్గజ సంగీత దర్శకులతో జానకి పనిచేశారు.
వయసు పైబడినప్పటికీ సినీ వేడుకలకు, ఇతర కార్యక్రమాలకు తూచా తప్పకుండా హాజరయ్యేవారు జానకి. 80 ఏళ్లకు పైగా వయసులోనూ ఎంతో చురుకుగా ఉండేవారు. అయితే కొన్నాళ్ల కిందట జానకి కుమారుడు అమెరికాలో చనిపోవడంతో ఆమె బాగా కృంగిపోయారు. నాటి నుంచి తనలో తానే కుమిలిపోతోన్న జానకి.. వయోభారంతో పాటు పలు అనారోగ్య కారణాలతో మైసూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జూలై 11న తుదిశ్వాస విడిచారు. ఆమె మరణంతో భారతీయ సినీ సంగీత ప్రపంచంలో ఒక శకం ముగిసినట్లయ్యింది. తన గాత్రంతో కోట్లాది మందిని అలరించిన గానం శాశ్వతంగా మూగబోయింది.


Click it and Unblock the Notifications


