రూ.500 కోట్ల నుంచి రూ.250 కోట్లకు.. 'రామాయణ' నిర్మాతలు తగ్గారా?
ప్రముఖ డైరెక్టర్ నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మైథలాజికల్ విజువల్ గ్రాండియర్ 'రామాయణ' (Ramayana). ఈ భారీ ప్రాజెక్టులో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయిపల్లవి సీతగా, కన్నడ స్టార్ యశ్ రావణుడిగా నటిస్తున్నారు. ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. వేల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుందనే ప్రచారం చాలాకాలంగా వినిపిస్తోంది. తాజాగా ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్కు సంబంధించి బాలీవుడ్ వర్గాల్లో మరో ఆసక్తికర వార్త వైరల్గా మారింది. ముఖ్యంగా హిందీ థియేట్రికల్ రైట్స్ ఓ ఇంట్రెస్టింగ్ రూమర్ క్రియేట్ అయ్యింది. ఇంతకీ ఏం జరిగిందంటే?
ఈ మైథలాజికల్ మూవీని నిర్మాత నమిత్ మల్హోత్రా అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. దర్శకుడు నితీశ్ తివారి ఆధ్వర్యంలో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ను కేవలం సినిమా కాకుండా ప్రపంచ స్థాయి విజువల్ అనుభూతిగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు భావిస్తున్నారు. రణబీర్ కపూర్, సాయిపల్లవి, యశ్తో పాటు సన్నీ డియోల్ హనుమంతుడిగా, కాజల్ అగర్వాల్ మండోదరిగా, రకుల్ ప్రీత్ సింగ్ శూర్పణఖ పాత్రల్లో నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. భారీ బడ్జెట్, హై విజువల్ ఎఫెక్ట్స్, పాన్ ఇండియా స్టార్స్ ఇలా ఏ విషయంలో కూడా రాజీ పడకుండా రూపొందిస్తున్నారు.

ఇండస్ట్రీ వర్గాల అంచనా ప్రకారం రెండు భాగాల కలిపి ఈ ప్రాజెక్ట్ వ్యయం రూ.4,000 కోట్ల వరకు ఉండొచ్చనే ప్రచారం ఉంది. అయితే దీనిపై నిర్మాతల నుంచి అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. భారీ బడ్జెట్.. అంతకు మించి అంచనాలు కారణంగా సినిమా బిజినెస్ కూడా అదే స్థాయిలో ఉండాలని నిర్మాతలు భావించారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ప్రముఖ డిస్ట్రిబ్యూటర్లకు దాదాపు 30 నిమిషాల ప్రత్యేక ఫుటేజ్ను ప్రదర్శించినట్లు సమాచారం. ఈ విజువల్ క్వాలిటీ, యాక్షన్, విజువల్ ఎఫెక్ట్స్, పాత్రల డిజైన్ కు పలువురు డిస్ట్రిబ్యూటర్లు సినిమాపై ప్రశంసలు కురిపించినట్టు తెలుస్తోంది.
థియేట్రికల్ హక్కులకు రూ.500 కోట్ల వరకు జరుగుతుందని చాలా మంది అభిప్రాయపడ్డారు. కానీ, బిజినెస్ విషయంలో మాత్రం ఆశించిన స్థాయిలో రాబట్టలేకపోయినట్టు తెలుస్తోంది. కేవలం రూ.250 కోట్లకు ఇవ్వడానికి అంగీకరించినట్లు బాలీవుడ్ మీడియాలో కథనాలు వచ్చాయి. బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ ఈ ప్రాజెక్ట్పై ఆసక్తి చూపినట్లు వార్తలు వెలువడ్డాయి. పలు చర్చల అనంతరం హిందీ మార్కెట్ హక్కులను సుమారు రూ.250 కోట్లకు అతడికి అమ్మినట్టు కథనాలు వచ్చాయి. అయితే ఈ డీల్పై ఇప్పటివరకు నిర్మాతలు గానీ, ధర్మ ప్రొడక్షన్స్ గానీ అధికారిక ప్రకటన చేయలేదు.
ట్రేడ్ వర్గాల విశ్లేషణ ప్రకారం ఈ ఒప్పందంలో మరో ప్రత్యేక అంశం కూడా ఉన్నట్లు చెబుతున్నారు. సినిమా విడుదలైన తర్వాత భారీ వసూళ్లు సాధిస్తే, ముందుగా కుదిరిన ఒప్పందానికి అదనపు లాభాల భాగస్వామ్యాన్ని జోడించే విధంగా రెవెన్యూ షేరింగ్ క్లాజ్ ఉండే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. అంటే ప్రారంభంలో తక్కువ మొత్తానికి డీల్ కుదిరినా, సినిమా బ్లాక్బస్టర్ అయితే నిర్మాతలకు అదనపు ఆదాయం వచ్చే అవకాశముంటుందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ మూవీ ప్రమోషన్స్ ఇంకా ప్రారంభం కాలేదు. మరోవైపు యశ్ నటిస్తున్న 'టాక్సిక్' సినిమా విడుదల పూర్తయ్యాకే 'రామాయణ' ప్రమోషన్స్ను భారీ స్థాయిలో ప్రారంభించాలని యూనిట్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీంతో దీపావళి విడుదలకు ముందే మరో భారీ టీజర్, పాత్రల పరిచయ వీడియోలు, ట్రైలర్ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అయితే రూ.500 కోట్ల నుంచి రూ.250 కోట్లకు డీల్ జరిగిందన్న సమాచారంపై పూర్తి వివరాలు స్పష్టత రావాలంటే మూవీ మేకర్స్ ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications



