పవన్ కళ్యాణ్ అభిమాని నిరంజన్ మృతి.. చివరి కోరిక నెరవేరకుండానే అనంతలోకాలకు..
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వీరాభిమాని పొనుగంటి నిరంజన్ (17) మరణం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. వరంగల్ జిల్లా హనుమకొండ హనుమాన్ నగర్కు చెందిన నిరంజన్ గత కొన్నేళ్లుగా అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. ఇటీవల ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో హైదరాబాద్లో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచాడు. ఇటీవల తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ ను ఒక్కసారి అయినా కలవాలనే కోరిక నెరవేరినా, అతని మరో కోరిక తీరకుండానే అతడు చివరి శ్వాస విడిచిపెట్టడం భావోద్వేగానికి గురిచేస్తోంది. ఇంతకీ ఆ అభిమాని చివరికి కోరిక ఏంటీ?
నిరంజన్ ఏడేళ్ల వయసు వరకు ఆరోగ్యంగా ఉన్నప్పటికీ, అనంతరం అతడికి డ్యూచెన్ మస్క్యులర్ డిస్ట్రోఫీ (DMD) అనే అరుదైన జన్యుపరమైన వ్యాధి బారినపడ్డారు. ఈ వ్యాధి కారణంగా శరీరంలోని కండరాలు క్రమంగా బలహీనపడుతూ వచ్చాయి. సరిగా నడవడం లేకపోవడం, కూర్చోలేకపోవడం, చేతులు కదపలేకపోతారు. ఇలా ఈ వ్యాధి బారిన పడ్డ నిరంజన్ చివరకు పూర్తిగా మంచానికే పరిమితమయ్యాడు. ఇటీవల కిడ్నీ సంబంధిత సమస్యలు కూడా తలెత్తడంతో ఆరోగ్యం మరింత విషమించింది.

అయితే శారీరకంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా, మానసికంగా మాత్రం నిరంజన్ ఎంతో ధైర్యంగా ఉండేవాడు. ఆ ధైర్యానికి కారణం పవన్ కళ్యాణ్పై అతడికి ఉన్న అమితమైన అభిమానం. పవన్ సినిమాలు, ప్రసంగాలు, పాటలు చూస్తూ స్ఫూర్తి పొందేవాడు. శరీరం సహకరించకపోయినా, మంచంపైనే పడుకుని పవన్ పాటలకు స్టెప్పులు వేయడానికి ప్రయత్నించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ ను కలువాలనే నిరంజన్ కోరికను జనసేనాని దృష్టికి తీసుకెళ్లేలా.. అతని వీడియోలను వైరల్ చేశారు. ఫైనల్ గా అతని విజ్ఞప్తి చివరకు పవన్ కళ్యాణ్ దృష్టికి చేరింది.
ఈ విషయంపై వెంటనే స్పందించారు పవన్ కళ్యాణ్. పవర్ స్టార్ గత నెలలో హనుమకొండలోని నిరంజన్ ఇంటికి స్వయంగా వెళ్లి పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని, తాను అండగా ఉంటానని పవర్ స్టార్ ఆత్మవిశ్వాసం నింపే ప్రయత్నం చేశారు. అభిమానిని నాయకుడిగా కాకుండా కుటుంబ సభ్యుడిలా పలకరించిన పవన్ తీరును చూసి అక్కడున్నవారంతా భావోద్వేగానికి గురయ్యారు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ నిరంజన్తో చాలాసేపు ముచ్చటించారు. తిరుమల శ్రీవారి ప్రసాదం, జనసేన డైరీపై తన చేతిరాతతో ప్రత్యేక సందేశం రాసి బహుమతిగా ఇచ్చారు. కుటుంబానికి ఆర్థిక సాయం కూడా అందించారు.
ఈ సమయంలో నిరంజన్ తన చిన్న కోరికలను పవన్తో పంచుకున్నాడు. "నాకు ఒక కుక్కపిల్లను పెంచుకోవాలని ఉంది" అని చెప్పగానే, వెంటనే "కొని పంపిస్తా చిన్నా" అంటూ పవన్ మాట ఇచ్చారు. ఇచ్చిన హామీ ప్రకారం అదే రోజు కుక్కపిల్లను పంపించి అతని కోరికను నెరవేర్చారు. అంతేకాదు, 'ఓజీ-2 విడుదలైతే నువ్వే నా స్పెషల్ గెస్ట్. మనిద్దరం కలిసి సినిమా చూద్దాం' అంటూ పవన్ కళ్యాణ్ చెప్పారు.
అయితే కాలం ఆ చిన్నారి పట్ల కనికరం చూపలేదు. కొద్ది రోజులకే ఆరోగ్యం మరింత క్షీణించడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్కు తరలించి చికిత్స అందించారు. కానీ, మంగళవారం రాత్రి నిరంజన్ కన్నుమూశాడు. ఆ మరణ వార్త వెలుగులోకి రాగానే పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున సంతాపం వ్యక్తం చేస్తున్నారు. పవన్ నిరంజన్ను కలిసిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ను కలవాలన్న కోరిక నెరవేరింది. అభిమాన హీరోతో గడిపిన ఆ క్షణాలు జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలయ్యాయి. కానీ "ఓజీ-2" కలిసి చూస్తామని పవన్ ఇచ్చిన మాటను ఆస్వాదించే అవకాశం మాత్రం అతడికి దక్కలేదు. ఆ నెరవేరని కల మిగిలిపోయిందని అంటూ పోస్టులు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications




