ప్రతి రోజూ అలా ప్రార్థించేదాన్ని.. సీతమ్మ పాత్ర కోసం సాయి పల్లవి చేసిన పని ఇదే!
Ramayana: భారతీయ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో 'రామాయణ' ఒకటి. దర్శకుడు నితీష్ తివారి తెరకెక్కిస్తున్న ఈ పౌరాణిక సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో శ్రీరాముడిగా రణ్బీర్ కపూర్, సీతాదేవిగా సాయి పల్లవి నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా సీత పాత్ర గురించి సాయి పల్లవి చేసిన కామెంట్స్ ఇప్పుడు అందరికి హార్ట్ టచింగ్ గా మారాయి. ఇంతకీ సాయి పల్లవి ఏమన్నారు?
జూలై 18న ఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో 'రామాయణం' ట్రైలర్ను కొందరికి ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ వేడుకలో చిత్రబృందం పాల్గొంది. ఈ సందర్భంగా సాయి పల్లవి తన పాత్ర గురించి మాట్లాడిన మాటలు అందరినీ భావోద్వేగానికి గురి చేశాయి. సాయి పల్లవి మాట్లాడుతూ.. "సీతమ్మ పాత్ర చేయడం ప్రతి నటికి దక్కే అవకాశం కాదు. దేవత పాత్రను పోషించడం చాలా పెద్ద బాధ్యత. అలాంటి పాత్రను చేయడానికి కేవలం నటన సరిపోదు. ఆ పాత్ర ఆత్మను కూడా అర్థం చేసుకోవాలి"అని చెప్పింది. తాను ఈ పాత్రను ఎంచుకోలేదని, "సీతమ్మే నన్ను ఈ పాత్ర కోసం ఎంచుకుంది" అని సాయి పల్లవి ఎమోషనల్ గా చెప్పింది.

ఈ పాత్రకు సిద్ధమవుతున్న సమయంలో ప్రతిరోజూ ధ్యానం చేసేదానినని వెల్లడించింది. "ధ్యానం చేస్తున్నప్పుడు సీతమ్మను ప్రార్థించేదాన్ని. 'సీతమ్మా.. నువ్వే నా ద్వారా నటించు. ప్రేక్షకులు నా నటనను కాదు.. నిన్నే చూడాలి' అని మనస్ఫూర్తిగా కోరుకునేదాన్ని"అని సాయి పల్లవి చెప్పింది. అంతేకాదు.. షూటింగ్ మొత్తం సమయంలో తన ఆలోచనలు కూడా పవిత్రంగా ఉండేలా ప్రయత్నించానని ఆమె తెలిపింది. "శరీరం మాత్రమే కాదు.. మనసు కూడా ప్రశాంతంగా, నిర్మలంగా ఉండాలని భావించాను. ఎందుకంటే సీత పాత్రకు అదే అవసరం" అని వివరించింది.
ఆ తర్వాత దర్శకుడు నితీష్ తివారి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "ఒక నటుడి కళ్లే అతని నిజాయితీని చెబుతాయి. రణ్బీర్ కళ్లలో నాకు శ్రీరాముడు కనిపించాడు. సాయి పల్లవి కళ్లలో సీత కనిపించింది. వాళ్లలోని నిజాయితీ, అంకితభావమే ఈ పాత్రలకు సరైన ఎంపిక చేశాయి. షూటింగ్ సమయంలో నాకు రణ్బీర్, సాయి పల్లవి కనిపించలేదు. రాముడు, సీత మాత్రమే కనిపించారు"అంటూ ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో ట్రైలర్ను చూసిన వారు కూడా సినిమా విజువల్స్, పాత్రల రూపకల్పన, భావోద్వేగాలు అద్భుతంగా ఉన్నాయని చెబుతున్నారు. అధికారిక ట్రైలర్ను జూలై 24న శాన్ డియాగో కామిక్-కాన్ 2026 వేదికగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రణ్బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతాదేవిగా నటిస్తుండగా, యశ్ రావణుడి పాత్రలో కనిపించనున్నారు.
అలాగే సన్నీ డియోల్ హనుమంతుడిగా, రవి దూబే లక్ష్మణుడిగా, లారా దత్తా కైకేయిగా, రకుల్ ప్రీత్ సింగ్ శూర్పణఖగా, కాజల్ అగర్వాల్ మందోదరిగా, అరుణ్ గోవిల్ దశరథుడిగా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా మొదటి భాగాన్ని 2026 దీపావళి కానుకగా థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రెండో భాగం 2027 దీపావళికి రానుంది.


Click it and Unblock the Notifications




