క్యాన్సర్తో మంచానికే పరిమితైనా.. ఆ డైరెక్టర్ అందరి ముందు అలా.. : విజయశాంతి
తెలుగు సినిమా ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్గా చెరగని ముద్ర వేసిన నటి విజయశాంతి. ఈ మహానటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 'రాములమ్మ'గా ప్రేక్షకుల గుండెల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నారు. చిరంజీవి, కృష్ణ, నాగార్జున, వెంకటేశ్, బాలకృష్ణ వంటి స్టార్ హీరోల సరసన ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. మరోవైపు ప్రతిఘటన, ఓసేయ్ రాములమ్మ, కర్తవ్యం వంటి లేడీ ఓరియంట్ సినిమాల్లో నటించి ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టి సినిమాలకు దూరమైన విజయశాంతి ఇటీవల మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' తో రీ ఎంట్రీ ఇచ్చారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో విజయశాంతి మాట్లాడుతూ.. ఓ స్టార్ డైరెక్టర్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు?
ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్ విజయశాంతి.. హీరో గోపిచంద్ తండ్రి, దివంగత దర్శకుడు టి.కృష్ణ పై ఎమోషనల్ కామెంట్స్ చేసింది. తనకు , టి.కృష్ణతో, ఆయన కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. "ఆయన నాలోని నటిని బయటకు తీసుకొచ్చిన దర్శకుడు. నాకు కెరీర్లో కొత్త దిశ చూపించిన వ్యక్తి. కానీ అంతకంటే ఎక్కువగా ఆయన మా కుటుంబంలో ఒక అన్నలా ఉండేవారు. వదిన కూడా మమ్మల్ని కుటుంబ సభ్యుల్లా చూసుకునేవారు. గోపీచంద్ చిన్నవాడిగా ఉన్నప్పటి నుంచి మేమంతా ఒకే కుటుంబంలా కలిసి ఉండేవాళ్లం. ఆ అనుబంధాన్ని మాటల్లో చెప్పలేం" అంటూ భావోద్వేగానికి లోనయ్యారు.

బయట ఫ్రెండ్లీగా ఉన్న డైరెక్టర్ టి.కృష్ణ పని విషయంలో ఎంత కఠినంగా, ఎంత అంకితభావంతో ఉంటారని చెప్పారు. ఆ సమయంలో 'రేపటి పౌరులు' సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక ఘటనను విజయశాంతి గుర్తు చేసుకున్నారు. అప్పటికే టి.కృష్ణ క్యాన్సర్తో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆరోగ్యం పూర్తిగా సహకరించకపోయినా, మంచంపైనే పడుకుని సినిమా దర్శకత్వం వహించేవారని ఆమె తెలిపారు. అయినప్పటికీ ఒక్క సీన్ విషయంలో కూడా ఆయన ఎలాంటి రాజీ పడేవారు కాదని చెప్పారు.
ఒక కోర్టు సీన్ షూటింగ్ సమయంలో తాను డైలాగ్ చెప్పిన తీరు ఆయనకు నచ్చలేదని విజయశాంతి తెలిపారు. ""నేను ఒక పాటర్న్లో చేసుకుంటూ వస్తున్నాను. అప్పుడు ఆయన ఇలా చేయాలి కదా, ఎందుకు ఇలా ముడుచుకొని చెప్తావ్ అని గట్టిగా తిట్టారు. నాకు అప్పటి వరకు ఆయన అంత ఎమోషన్ అవడం తెలియదు. ఆరోగ్యం బాగోలేకపోయినా సినిమా విషయంలో మాత్రం ఆయనకు ఎలాంటి రాజీ ఉండేది కాదు" అని వెల్లడించారు.
ఆ ఘటన తర్వాత తాను కొద్దిసేపు పక్కకు వెళ్లి తన నటన గురించి ఆలోచించానని, దర్శకుడు చెప్పిన సూచనలను అర్థం చేసుకుని మళ్లీ కెమెరా ముందుకు వచ్చి ఒక్క టేక్లోనే ఆ సీన్ పూర్తి చేశానని విజయశాంతి చెప్పారు. "ఆ రోజు నాకు నటిగా ఎంతో పెద్ద పాఠం నేర్పింది. ఒక మంచి దర్శకుడు నటుడి నుంచి ఉత్తమమైన నటనను ఎలా రాబట్టాలో టి.కృష్ణకు బాగా తెలుసు. ఆయన క్రమశిక్షణ, పనిపై ఉన్న నిబద్ధత నాకు ఇప్పటికీ స్ఫూర్తినిస్తాయి" అని ఆమె అన్నారు.
టి.కృష్ణ మరణం గురించి మాట్లాడుతూ విజయశాంతి ఎమోషనల్ అయ్యారు . "ఆయన చనిపోయిన సమయంలో నేను ఊటీలో 'కళ్యాణ తాంబూలం' సినిమా షూటింగ్లో ఉన్నాను. ఆ వార్త తెలిసిన వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా షూటింగ్ వదిలేసి బయలుదేరాను. రెండు రైళ్లు మారి ఆయన అంత్యక్రియలకు చేరుకోవాలని ఎంత ప్రయత్నించినా, నేను అక్కడికి చేరుకునేలోపే కార్యక్రమాలు పూర్తయ్యాయి. నా గురువుకు, నా అన్నకు చివరి వీడ్కోలు కూడా చెప్పుకోలేకపోయాననే బాధ ఇప్పటికీ నా మనసులో ఉంది" అన్నారు.


Click it and Unblock the Notifications




