ఓదెల రైల్వేస్టేషన్ సినిమా యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో వసిష్ఠ ఎన్ సింహ, హెబ్బా పటేల్, పూజిత పొన్నాడ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం అశోక్ తేజ వహించారు. నిర్మాత కెకె రాధా మోహన్ నిర్మించారు. సంగీతం అనూప్ రూబెన్స్ అందించారు. ఈ సినిమాకి కథ సంపత్ నంది అందించారు.
కథ
నిజ జీవిత గాథ ఆధారంగా తెరకెక్కిన ఓదెల రైల్వేస్టేషన్ కథ ప్రారంభంలోనే ఒళ్లు జలదరింపజేస్తుంది. ఓ స్త్రీ ఒంటినిండా బురదతో, చేతిలో మొండెం లేని తలను పట్టుకుని పోలీస్ స్టేషన్ కు వచ్చి లొంగిపోతుంది. ఆమెను ఆ విధంగా చూసిన గామస్థులు, పోలీసులు జడుసుకున్నట్లుగానే ప్రేక్షకులు కూడా ఒకింత భయపడతారు. ఇక కథలోకి వెళితే, ఓదెల అనే ప్రాంతంలో వరుసగా నవ వధువులందరూ హత్యకు గురవుతుంటారు. పెళ్లైన మరుసటి రోజే అమ్మాయిలను అపహరించి అతి కిరాతకంగా హత్య చేస్తుంటాడు ఓ సీరియల్ కిల్లర్. అదే ప్రాంతానికి ట్రైనింగ్ నిమిత్తం వచ్చిన ఐపీఎస్ అధికారి అనుదీప్ ఈ కేస్ ను ఇన్వెస్టిగేట్ చేస్తుంటాడు. మరోవైపు అదే ఊరికి చెందిన జంట రాథిక, తిరుపతి బట్టలు ఇస్త్రీ చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. ఈ వరుస హత్యల నడుమ వీరి జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయి. అసలు నేరస్థుడు ఎవరు? ఐపీఎస్ అనుదీప్ ఈ వరుస హత్యలను ఆపగలిగాడా లేదా అన్నది అసలు కథ.