ఆ సీక్రెట్ నాకు మాత్రమే తెలుసు.. సమంత ప్రెగ్నెన్సీపై డైరెక్టర్ రియాక్షన్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు మరోసారి వార్తల్లో నిలిచారు. చాలా కాలం తర్వాత పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'మా ఇంటి బంగారం' బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకుపోతుంది. ఈ తరుణంలో ఈ సినిమా షూటింగ్కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమా డైరెక్టర్ బి. వి. నందిని రెడ్డి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత ప్రెగ్నెన్సీ గురించి చెప్పిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
షూటింగ్ మధ్యలో తెలిసిన గుడ్ న్యూస్
తాజాగా డైరెక్టర్ నందిని రెడ్డి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఓ ప్రత్యేక సంఘటనను గుర్తు చేసుకున్నారు. ఆమె మాట్లాడుతూ.. 'తస్సదియ్యా' పాట షూటింగ్ సమయంలో సమంతకు ఉదయం నుంచి ఒంట్లో బాగాలేదని తెలిసిందని, మొదట అది జ్వరమేమో అనుకున్నామని చెప్పారు. అయితే మరుసటి రోజు సమంత స్వయంగా తాను 'మార్నింగ్ సిక్నెస్'తో బాధపడుతున్నానని, క్యారింగ్ అని చెప్పింది. దీంతో ఆమె గర్భవతి అని తనకు తెలిసిందని వెల్లడించారు.

నందిని ఇంకా మాట్లాడుతూ.. ఆ సమయంలో ఆ విషయం యూనిట్లో తనకు మాత్రమే తెలుసని, మరెవరికీ తెలియకుండా చాలా జాగ్రత్తగా ఉంచామని చెప్పారు. సినిమా పూర్తయ్యే వరకు ఆ విషయం బయటకు రాకుండా చూసినట్లు వివరించారు. అయితే.. సమంత గర్భవతి అని తెలిసిన సమయానికి షూటింగ్ లోని అత్యంత కష్టమైన యాక్షన్ సన్నివేశాలు అప్పటికే పూర్తయ్యాయని నందిని రెడ్డి చెప్పారు. అదే తమకు పెద్ద రిలీఫ్గా మారిందన్నారు. "లక్కీగా హెవీ యాక్షన్ పోర్షన్ అంతా ముందే పూర్తయింది. ఆ తర్వాత మిగిలిన సన్నివేశాల షూటింగ్ పూర్తిగా సమంత ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్లాన్ చేశాం. ఆమెకు ఎక్కడా ఒత్తిడి లేకుండా, అవసరమైనంత విశ్రాంతి ఇస్తూ షూటింగ్ పూర్తి చేశాం" అని తెలిపారు.
సమంత ఫోకస్కు నందిని రెడ్డి ప్రశంసలు
సమంతతో తన అనుబంధం గురించి కూడా నందిని రెడ్డి మాట్లాడారు. ఇద్దరి మధ్య ఉన్న స్నేహం గురించి చెబుతూ, సమంత నుంచి తాను నేర్చుకున్న గొప్ప విషయం ఆమె ఫోకస్ అని పేర్కొన్నారు. "సమంత పని చేస్తున్నప్పుడు లక్ష్యంపై మాత్రమే దృష్టి పెడుతుంది. నేను మధ్యలో కాస్త రిలాక్స్ అవుతుంటాను. కానీ సమంతను చూస్తే లక్ష్యంపై మరింత ఫోకస్ పెట్టాలని గుర్తు వస్తుంది. అదే ఆమె నుంచి నేర్చుకున్న గొప్ప విషయం" అని చెప్పారు.
బాక్సాఫీస్ వద్ద 'మా ఇంటి బంగారం' జోరు
ఇక మరోవైపు 'మా ఇంటి బంగారం' బాక్సాఫీస్ వద్ద కూడా మంచి ప్రదర్శన కొనసాగిస్తోంది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం.. తొలి వారం ముగిసే సమయానికి సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 35. 85 కోట్ల నెట్ వసూలు చేసింది. ఇందులో తెలుగు వెర్షన్ ఒక్కటే రూ. 34.05 కోట్లు, తమిళ వెర్షన్ రూ. 1.80 కోట్లు రాబట్టింది. ఏడో రోజు (మొదటి గురువారం) ఈ సినిమా రూ. 2. 65 కోట్ల నెట్ వసూలు చేసినట్లు ట్రేడ్ రిపోర్టులు చెబుతున్నాయి. దేశీయ మార్కెట్తో పాటు విదేశాల్లో కూడా ఈ సినిమాకు మంచి స్పందన లభిస్తోంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో తొలి వీకెండ్లోనే 1 మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరడం విశేషం. మొదటి వారంలో ఓవర్సీస్ మార్కెట్ నుంచి రూ. 18. 10 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా తొలి వారంలో రూ. 59. 53 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది.


Click it and Unblock the Notifications



