మల్లేశం సినిమా చేనేత వ్యాపారుడు, పద్మ శ్రీ అవార్డు గ్రహీత చింతకింద మల్లేశం జీవితచరిత్ర ఆధారంగా చిత్రీకరిస్తున్నారు. ఇందులొ ప్రియదర్శి, అనన్య, ఝాన్సి తదితరులు నటిస్తున్నారు. రాజ్ ఆర్ దర్శకత్వం వహించారు. రాజ్ ఆర్ మరియు శ్రీ అధికారి సంయుక్తంగా నిర్మించారు. సంగీతం శ్రావన్ అందిస్తున్నారు.
కథ
దిగువ తరగతి చేనేత కుటుంబంలో పుట్టిన మల్లేశం (ప్రియదర్శి)కు బాల్యం నుంచే కష్టాలు, సమస్యలు కళ్ల ముందే కదలాడుతాయి. ఆర్థిక సమస్యలతో కుటుంబ సభ్యులు ఆత్మహత్యకు పాల్పడటం పసివాడిని కలిచివేస్తుంది. అలాగే ఆసు పట్టే తల్లి ఆరోగ్యం క్రమక్రమంగా క్షీణిస్తుంటుంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆరో తరగతిలోనే చదువు ఆపేస్తాడు. కుటుంబ భారాన్ని కొంత తన భుజానికి ఎత్తుకొంటాడు. తన తల్లికే కాకుండా చేనేత కుటుంబంలో ఏ మహిళ కూడా ఆసు కష్టాలను అనుభవించకూడదనే ఆలోచనతో ఆసు యంత్రాన్ని కనిపెట్టేందుకు పూనుకొంటాడు.
ఆసు యంత్రాన్ని కనుగొనే క్రమంలో ఎదురైన కష్టాలేంటీ? గ్రామస్థుల సహకారం ఎలా ఉంది? జీవితానికే సవాల్గా నిలిచిన క్షణాల్లో భార్య (అనన్య) ఎలా నిలిచింది? మల్లేశం భుజానికి ఎత్తుకొన్న కార్యాన్ని తండ్రి (చక్రపాణి) ఎందుకు అడ్డుకొనేందుకు ప్రయత్నం చేశాడు. తన కార్యదీక్షకు తల్లి (యాంకర్ ఝాన్సీ ) ఎలాంటి నైతిక మద్దతు ఇచ్చింది. చివరకు ఎలాంటి సమస్యలను ఎదురించి ఆసు యంత్రాన్ని కనుగొన్నాడు అనే ప్రశ్నలకు సమాధానమే మల్లేశం సినిమా.