24 గంటల ఫుటేజ్ను గంటలో ఎలా చూపిస్తారు ? బిగ్ బాస్పై లేడీ కామెడియన్ షాకింగ్ కామెంట్స్..
బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 త్వరలోనే ప్రారంభం కానుంది. ఈసారి ల్యాండ్మార్క్ సీజన్ కావడంతో నిర్వాహకులు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. కంటెస్టెంట్ల ఎంపిక నుంచి గేమ్స్, టాస్కుల వరకు కొత్త తరహా ప్లానింగ్తో షోను మరింత ఆసక్తికరంగా తీర్చిదిద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రచారం సాగుతోంది. ఇప్పటికే పలువురు టీవీ సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు, యూట్యూబర్లు, అలాగే సామాన్యుల పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇలాంటి సమయంలో ప్రముఖ నటి, లేడీ కమెడియన్ విద్యుల్లేఖ రామన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్గా మారాయి. ఇంతకీ ఏమన్నారంటే?
లేడీ కమెడియన్ విద్యుల్లేఖ రామన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. బిగ్ బాస్ షోలో పాల్గొంటారా? అని ప్రశ్నించగా.. తన అభిప్రాయాన్ని చాలా స్పష్టంగా వెల్లడించారు. గత నాలుగైదు సంవత్సరాలుగా తెలుగు, తమిళ భాషల్లో బిగ్ బాస్ నిర్వాహకులు తనను సంప్రదిస్తున్నారని, అయినప్పటికీ ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఆ ఆఫర్ను అంగీకరించలేదని చెప్పారు. "నాకు నాన్-కాంట్రవర్సీ రియాలిటీ షోలంటే ఇష్టం. ఇప్పటికే మూడు, నాలుగు రియాలిటీ షోలు చేశాను. ఇటీవల 'ట్రేటర్స్' అనే రియాలిటీ షోలో కూడా పాల్గొన్నాను. అది అమెజాన్ ప్రైమ్లో విడుదల కానుంది. ఆ షో అనుభవం చాలా బాగుంది. కానీ బిగ్ బాస్ మాత్రం నాకు సరిపడే షో కాదు" అని విద్యుల్లేఖ అన్నారు.

బిగ్ బాస్లో పాల్గొనకపోవడానికి అసలు కారణాన్ని కూడా ఆమె వివరించారు. "ఒక ఇంట్లో 24 గంటలు జరిగే విషయాలను కేవలం ఒక గంట ఎపిసోడ్లో చూపించాలి అంటే చాలా ఎడిటింగ్ చేయాల్సి ఉంటుంది. ఒక సందర్భంలో చెప్పిన మాటను మరో సందర్భంలో పెట్టే అవకాశం ఉంటుంది. ప్రేక్షకులు ఆ ఎడిటెడ్ వెర్షన్నే నమ్ముతారు. దాని వల్ల కంటెస్టెంట్లు అనవసరంగా ట్రోలింగ్కు గురవుతారు. అలాంటి పరిస్థితి నాకు అవసరం లేదు" అని ఆమె అభిప్రాయపడ్డారు.
అంతేకాదు, తన వ్యక్తిత్వానికి కాంట్రవర్సీలు అస్సలు సరిపోవని కూడా చెప్పారు. "ప్రస్తుతం నాకు ఉన్న గుడ్ వైబ్స్ చాలు. కేవలం పాపులారిటీ కోసం వివాదాల్లోకి వెళ్లే ఉద్దేశం లేదు. నేను చెప్పిన చిన్న మాటను కూడా తప్పుగా అర్థం చేసుకుని సోషల్ మీడియాలో నెగిటివ్గా ప్రచారం చేస్తే దాన్ని తట్టుకునే మెంటల్ స్ట్రెంగ్త్ నా దగ్గర లేదు" అని విద్యుల్లేఖ తెలిపారు. సోషల్ మీడియా ట్రోలింగ్ ప్రభావం గురించి కూడా ఆమె నిజాయితీగా స్పందించారు. "కొంతమంది ఆ ఒత్తిడిని చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు. వాళ్లను నేను నిజంగా అభినందిస్తాను. కానీ నేను మాత్రం అలాంటి పరిస్థితులను హ్యాండిల్ చేయలేను. అందుకే బిగ్ బాస్ వంటి కాంట్రవర్సీ షోలకు దూరంగా ఉండటమే నాకు మంచిదనిపిస్తుంది" అని పేర్కొన్నారు.
అలాగే.. ఈ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవిత విషయాలను కూడా విద్యుల్లేఖ పంచుకున్నారు. తాను ప్రేమ వివాహం చేసుకోవడంపై కుటుంబ సభ్యులు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని వెల్లడించారు. "మా అమ్మానాన్నలదే లవ్ మ్యారేజ్. అందుకే నా నిర్ణయాన్ని కూడా పూర్తిగా గౌరవించారు. పెళ్లి చేసుకోమని ఎప్పుడూ ఒత్తిడి చేయలేదు. కెరీర్నే ముందుగా చూసుకోమని, తర్వాత జీవితానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోమని పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు" అని తెలిపారు.
తల్లిదండ్రుల మద్దతు వల్లే తన కెరీర్పై పూర్తిగా దృష్టి పెట్టగలిగానని విద్యుల్లేఖ చెప్పారు. తమ కుటుంబం ఎప్పుడూ తనపై ఒత్తిడి తీసుకురాలేదని, తన అభిరుచులు, నిర్ణయాలను గౌరవించిందని పేర్కొన్నారు. అందుకే తన జీవితంలో తీసుకున్న ప్రతి నిర్ణయం ఎంతో ప్రశాంతంగా, ఆత్మవిశ్వాసంతో తీసుకోగలిగానని ఆమె వివరించారు. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, బిగ్ బాస్ అభిమానుల మధ్య కూడా ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.


Click it and Unblock the Notifications




