పవర్ స్టార్ వీరాభిమాని నిరంజన్ మృతి.. తీవ్ర విషాదంలో పవన్ కల్యాణ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమాని పొనుగంటి నిరంజన్ కన్నుమూశాడు. వరంగల్ జిల్లా హనుమకొండకు చెందిన నిరంజన్ గత కొంతకాలంగా అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాతున్నాడు. ఇటీవల అతని ఆరోగ్యం మరింత విషమించడంతో కుటుంబ సభ్యులు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు. కానీ, చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచాడు.ఈ వార్త తెలిసిన వెంటనే జనసేన శ్రేణులు, పవన్ అభిమానులు సోషల్ మీడియాలో భావోద్వేగ సందేశాలతో నివాళులర్పిస్తున్నారు.
నిరంజన్ పుట్టుకతోనే అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్నాడు. ఆ వ్యాధి కారణంగా అతడి శారీరక ఎదుగుదల పూర్తిగా దెబ్బతింది. వయసు పెరుగుతున్నా శరీరం పెరుగుదల లేకపోవడంతో మంచానికే పరిమితమయ్యాడు.అయితే.. అతనికి పవన్ కళ్యాణ్పై అమితమైన అభిమానం. ఒకసారి అయినా తన అభిమాన హీరోను ప్రత్యక్షంగా కలవాలనే కోరికను ఉండేది. నిరంజన్ కోరిక సోషల్ మీడియా ద్వారా పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లింది.

ఆ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ గత నెలలో హనుమకొండలోని నిరంజన్ ఇంటికి స్వయంగా వెళ్లి పరామర్శించారు. మంచంపైనే ఉన్న నిరంజన్ పక్కన కూర్చుని ఆప్యాయంగా పలకరించారు. అతడి చేతిని పట్టుకుని ధైర్యం చెప్పారు. "అధైర్యపడకు.. మంచి చికిత్స తీసుకుంటే తప్పకుండా కోలుకుంటావు" అంటూ ఆత్మవిశ్వాసం నింపే ప్రయత్నం చేశారు. నిరంజన్తో సెల్ఫీ తీసుకుని, తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని అందజేశారు. జనసేన డైరీపై తన చేతిరాతతో ప్రత్యేక సందేశం రాసి బహుమతిగా ఇచ్చారు. అంతేకాకుండా కుటుంబానికి రూ.1 లక్షల ఆర్థిక సహాయం కూడా అందించారు.
ఆ సందర్భంగా నిరంజన్ తనకు ఒక కుక్కపిల్లను పెంచుకోవాలనే కోరిక ఉందని పవన్కు చెప్పాడు.'వెంటనే కొని పంపిస్తా చిన్నా' అంటూ పవన్ హామీ ఇచ్చారు. అదే రోజు అతని కోరికను నెరవేర్చారు.ఆ సమయంలో నిరంజన్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తమ కొడుకు చిరకాల కోరిక నెరవేరిందని అతని తల్లిదండ్రులు కూడా భావోద్వేగానికి గురయ్యారు.
ఇక నిరంజన్ను పవన్ కళ్యాణ్ పలుకరించిన తరువాత ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కూడా నిరంజన్ కుటుంబాన్ని పరామర్శించారు. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ తరఫున రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించి, ఆ కుటుంబానికి అండగా నిలిచారు. పలువురు జనసేన నాయకులు, అభిమానులు కూడా నిరంజన్ కుటుంబాన్ని అండగా నిలిచారు. అతనికి మనసికంగా భరోసా అందించారు.
తాజాగా నిరంజన్ ఆరోగ్యం మరింత విషమించడంతో కుటుంబ సభ్యులు అతడిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు. అక్కడ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందించినప్పటికీ ఆరోగ్య పరిస్థితి క్రమంగా దిగజారింది. పరిస్తితి విషమించడంతో మంగళవారం రాత్రి నిరంజన్ తుదిశ్వాస విడిచాడు. నిరంజన్ మరణ వార్త తెలిసిన వెంటనే సోషల్ మీడియాలో సంతాప సందేశాలు వెల్లువెత్తాయి. చిన్నారి నిరంజన్ మరణ వార్త తెలిసిన వెంటనే పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications




