'రాజాసాబ్' నిర్మాతకు ప్రభాస్ బిగ్ ఆఫర్..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు. వాటిలో అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా 'స్పిరిట్'. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ కీలక అప్డేట్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా ది రాజా సాబ్ నిర్మాతకు ప్రభాస్ మరోసారి అండగా నిలిచారట. ఇంతకీ ఏం జరిగిందంటే?
ప్రభాస్ నటించిన 'ది రాజాసాబ్' ఆశించిన విజయాన్ని సాధించలేకపోయింది. దాదాపు 400 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కేవలం సుమారు రూ.205 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసింది. థియేట్రికల్గా సుమారు 50 శాతం మాత్రమే రికవరీ చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో నిర్మాతలకు రూ.150-200 కోట్ల వరకు నష్టం వాటిల్లి ఉండొచ్చని సినీ వర్గాల అంచనా. ఇలా భారీ నష్టాలు ఎదుర్కొన్న నిర్మాతకు ప్రభాస్ మరోసారి అండగా నిలిచారట. ఈ నేపథ్యంలో ప్రభాస్-సందీప్ రెడ్డి వంగా కాంబోలో వస్తున్న 'స్పిరిట్' రైట్స్ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అందించారట.

'స్పిరిట్' కర్ణాటక థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ హక్కులను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ భాగస్వామ్యంతో దక్కించుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రకటనతో పాటు సంస్థ సోషల్ మీడియాలో ఆనందాన్ని వ్యక్తం చేసింది. ప్రభాస్ సినిమాపై ఉన్న క్రేజ్ కారణంగా ఈ రైట్స్కు భారీ డిమాండ్ ఉన్నప్పటికీ, చివరకు ఈ సంస్థకే దక్కడం విశేషంగా మారింది. ఈ డీల్ వెనుక మరో ఆసక్తికరమైన అంశం కూడా కనిపిస్తోంది.
ఇండస్ట్రీ ప్రచారం ప్రకారం.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ఈ అవకాశం రావడంలో ప్రభాస్ కీలక పాత్ర పోషించారని టాక్ నడుస్తోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. అయినప్పటికీ, 'రాజాసాబ్' తర్వాత అదే నిర్మాతకు మరో పెద్ద ప్రాజెక్ట్ డిస్ట్రిబ్యూషన్ రావడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. 'స్పిరిట్' భారీ విజయాన్ని సాధిస్తే.. గత నష్టాల్లో కొంత మేర భర్తీ అయ్యే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతకుముందు 'ఆదిపురుష్' తెలుగు డిస్ట్రిబ్యూషన్లో కూడా అదే సంస్థ భాగస్వామిగా ఉండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో 'స్పిరిట్' రైట్స్ ఈ సంస్థకు దక్కాయి.
మరోవైపు 'స్పిరిట్' షూటింగ్ ఇప్పటికే శరవేగంగా కొనసాగుతోంది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఇటీవలే దాదాపు 40 శాతం షూటింగ్ పూర్తయిందని వెల్లడించారు. ఈ సినిమాలో ప్రభాస్ తొలిసారి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుండగా, త్రిప్తి దిమ్రీ హీరోయిన్గా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ విలన్ పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాని టీ-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ సంస్థలు భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నాయి.
ప్రస్తుతం 'స్పిరిట్' పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. విడుదలకు ఇంకా చాలా నెలలు ఉండగానే వివిధ ఏరియాల థియేట్రికల్ హక్కులకు తీవ్ర పోటీ నెలకొంది. కర్ణాటక రైట్స్ అధికారికంగా లాక్ కావడంతో, మిగతా ప్రాంతాల డిస్ట్రిబ్యూషన్ డీల్స్పై కూడా ఆసక్తి పెరిగింది. 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాల్సి ఉంది.


Click it and Unblock the Notifications




