బెంగళూరు పోలీసుల అదుపులో కన్నడ టాప్ హీరోయిన్.. దర్శన్ కేసులో మరో ట్విస్టు!
కర్ణాటకలో సంచలనం రేపిన రేణుక స్వామి అనే వ్యక్తి కేసులో మరో సంచలనం చోటు చేసుకొన్నది. ఈ కేసులో కన్నడ నటి, ఫ్యాషన్ డిజైనర్ పవిత్ర గౌడను బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. ఈ మర్డర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కన్నడ సూపర్ స్టార్ దర్శన్ను మంగళవారం (జూన్ 6వ తేదీన) అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసును అన్ని కోణాల్లో విచారించేందుకు పవిత్రను కూడా అదుపులోకి తీసుకొన్నారు. ఆ కేసు వివరాల్లోకి వెళితే..
మృతుడు రేణుక స్వామి సినీ నటుడు దర్శన్కు అభిమాని. చిత్ర దుర్గలోని మెడికల్ షాపులో పనిచేస్తుంటాడు. ఇటీవల దర్శన్ భార్యకు అసభ్యకరమైన సందేశాలు పంపాడు. అంతేకాకుండా పవిత్ర గౌడ, దర్శన్ రిలేషన్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దాంతో దర్శన్ అగ్రహానికి గురయ్యాడు.

అయితే రేణుక స్వామి చేష్టలతో కోపంతో ఉన్న దర్శన్ తన అనుచరులకు చెప్పి .. అతడిని తీసుకురమ్మని తన అనుచరుడు వినయ్కి చెప్పారు. దాంతో రేణుక స్వామిని తీసుకొచ్చి దారుణంగా కర్రలతో కొట్టారు. దాంతో ఆయన తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు. అయితే అతడి మృతదేహాన్ని వృషభావటి వ్యాలీలో పూడ్చి పెట్టారు.
ఇక తన కుమారుడు కనిపించడం లేదని రేణుక స్వామి తల్లి ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించిన తర్వాత దర్శన్కు సంబంధించిన ముగ్గురు అనుచరులను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. దాంతో దర్శన్, పవిత్ర గౌడ చేసిన ప్లాన్ బయటకు వచ్చింది. పోలీసుల జాగిలాలను ఉపయోగించి రేణుక స్వామి బాడీని కనుగొన్నారు.

జూన్ 8వ తేదీన రేణుక స్వామి మర్డర్ బయటకు రావడంతో బెంగళూరు పోలీసుల కేసు నమోదు చేశారు. పలు కోణాల్లో కేసును విచారించిన తర్వాత.. అనుచరులు వెల్లడించిన సమాచారం ఆధారంగా దర్శన్ను మైసూరులోని ఫామ్ హౌస్ నుంచి బెంగళూరు తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆయనను విచారిస్తున్నారు.
ఇక మర్డర్ కేసులో భాగంగా పవిత్ర గౌడను కూడా అదుపులోకి తీసుకొన్నారు. బెంగళూరులోని అన్నపూర్ణేశ్వరి పోలీస్ స్టేషన్లో ఆమెను విచారిస్తున్నారు. పవిత్ర గౌడ అరెస్ట్తో ఈ కేసు మరింత సంచలనంగా మారింది. వారిని కోర్టులో హజరుపరిచి పోలీస్ రిమాండ్కు తీసుకొనే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.


Click it and Unblock the Notifications











