భారత సినిమా పితామహుడు దాదా సాహెబ్ ఫాల్కే జయంతి
హైదరాబాద్: ధూండీరాజ్ గోవింద్ ఫాల్కే అంటే చాలామందికి తెలీకపోవచ్చు. కానీ దాదా సాహెబ్ ఫాల్కే అనే పేరు సినిమాను ప్రేమించే ప్రతి వారికీ సుపరిచితం. భారతీయ సినిమాకు ఆయనే ఆధ్యుడు. దాదాసాహెబ్ ఫాల్కే 146వ జయంతి నేడు. ఏప్రిల్ 30, 1870లో దాదా సాహెబ్ ఫాల్కే మహారాష్టల్రోని త్రయంబకేశ్వర్లో జన్మించారు. దాదాసాహెబ్ దుండిరాజ్ గోవింద ఫాల్కే పురావస్తు శాఖలో డ్రాఫ్ట్సమన్గా, ఫోటోగ్రాఫర్గా పనిచేశారు. 3-5-1913న ఫాల్కే మొదటి చిత్రం 'రాజాహరిశ్చంద్ర' విడుదలైంది. అదే మొట్టమొదటి భారతీయ కథా (మూకీ) చలన చిత్రం.
ఈయన గురించి మనలో ఎంతమందికి తెలుసు? భారతీయ మొట్టమొదటి చలన చిత్ర దర్శకుడూ... ఇండియన్ సినిమా దార్శనికుడు అయిన ఆయన వల్లే మన దేశానికి సినిమా వచ్చింది అని చెప్పడంలో అతిశయోక్త లేదేమో. ఫోటోగ్రాఫర్ గా జీవితాన్ని ప్రారంభించిన దూండీరాజ్ ఫాల్కేకి సినిమా తీస్తే ఎలా ఉంటుంది అని వచ్చిన ఆలోచనే భారతయులకు సినిమాను దగ్గర చేసింది. అందువల్లనే ఫాల్కే భారతీయ చలన చిత్ర పితామహుడుగా పేరుపొందారు.

సినిమాపై ఆసక్తితో జర్మనీ వెళ్లి సినిమా టెక్నాలజీ నేర్చుకొచ్చి మన సినిమాకు ఓనమాలు దిద్దారు. అనుభవం లేని ఆర్టిస్టులు, ఆడ వేషానికి మొగ వేషానికీ రెండిటికీ మొగవారు, కెమెరా దృష్టిలో పెట్టుకోని నటించడం, డైలాగులు పలకడం తెలియని రోజులు.. ఇలా అష్టకష్టాలు పడుతూ, సడలని ఆత్మవిశ్వాసంతో తొలి భారత సినిమాని సృష్టించాడు దాదా సాహెబ్ ఫాల్కే. ఆ సినిమా పేరు - "రాజా హరిశ్చంద్ర". 1914లో ఆయన రెండవ చిత్రం 'మోహినీ భస్మాసుర' విడుదలయింది. ఆయన నిర్మించిన చివరి చిత్రాలు 'సేతుబంధన్', 'గంగావతరణ్'.
భారతీయ సినిమాకు మూలస్తంభంగా నిలిచిన ఫాల్కే సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును నెలకొల్పింది. సినీ ప్రముఖులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం ఇది. నటీనటులు తాము ప్రదర్శించిన నటనకు గాను వివిధ రకాల అవార్డులను అందుకుంటారు. అయితే వీటిలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు మాత్రం ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఏ నటులైనా ఈ అవార్డు దక్కించుకోవడాన్ని తమ జీవితంలోనే అత్యున్నతంగా భావిస్తారు.


Click it and Unblock the Notifications











